GHMC: హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట, ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ (మున్సిపాలిటీ, కార్పొరేషన్లను) జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ఆమోద ముద్ర వేసింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లకు సవరణలు చేసేందుకు నిర్ణయించింది. మంగళవారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం సుమారు 4 గంటల పాటు జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మూడో డిస్కం ఏర్పాటు
రాష్ట్రంలో ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ పేరిట రెండు డిస్కంలు ఉండగా, కొత్తగా మరొకటి ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచి నీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ సీవరేజ్ బోర్డ్ పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కం పరిధిలోకి వస్తాయి. దీంతో పాటు రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, రాబోయే పదేండ్లకు అవసరమయ్యే సరఫరా, ఉత్పత్తి అంచనాలపై సమగ్రంగా చర్చించారు.
విద్యుత్ విభాగం అధికారులు సమగ్రంగా సమర్పించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను పరిశీలించారు. పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం రాష్ట్రంలో వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా 3వేల మెగా వాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని అధికారులకు తెలిపింది. 5 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసే కాల పరిమితి ఒప్పందాలతో ఈ టెండర్లు పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది.
సోలార్ పంప్ట్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంపు
సోలార్ పవర్ తరహాలోనే పంప్డ్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచాల్సి ఉన్నదని క్యాబినెట్ తీర్మానించింది. ఇందుకోసం 2వేల మెగా వాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నది. 5 ఏళ్ల కాల పరిమితితోనే ఈ టెండర్లు కూడా పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది. అంతేగాక రాష్ట్రంలో పలు చోట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలున్నాయి. వీటిని నెలకొల్పేందుకు ముందుకు వచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే డిస్కంల వద్ద ఉన్న ఎంవోయూలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో 10 వేల మెగా వాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని అధికారులకు తెలిపింది. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వమే అవసరమైన భూమిని కేటాయించి, నీళ్లను అందిస్తుంది. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్ను ముందుగా మన డిస్కంలకే అమ్మాలనే షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది.
కొత్త పరిశ్రమలకు అవి ఉండాల్సిందే..
రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కొత్తగా స్థాపించే పరిశ్రమలు తమకు అవసరమైన విద్యుత్ను తమంతట తామే సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జనరేషన్కు అప్లై చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఇందులో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధిత ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇప్పుడున్న విధానంలోనే సరఫరా జరుగుతున్నది.
రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలోనే పవర్ స్టేషన్
రామగుండం థర్మల్ పవర్ స్టేషన్లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్ను ఎన్టీపీసీ అధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. పాల్వంచ, మక్తల్ లోనూ ఎన్టీపీసీ అధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది. ఎన్టీపీసీకి ఈ యూనిట్ నిర్మాణం అప్పగిస్తే ఎంత విద్యుత్ యూనిట్ రేట్ పడుతుంది, జెన్ కో ద్వారా చేపడితే ఎంత రేట్ పడుతుందో ముందుగా అంచనాలు వేసుకొని తుది పరిశీలన చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
హైదరాబాద్లో గ్రౌండ్ కేబుల్స్
నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే బెంగుళూరులో ఇది అమలులో ఉన్నది. ఇటీవలే అక్కడ అమలు చేసిన విధానాన్ని అధికారులు అధ్యయనం చేసి వచ్చారు. అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు దాదాపు రూ.14,725 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిళ్ల వారీగా మూడు విభాగాలుగా విభజించుకొని ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. విద్యుత్తో పాటు టీ ఫైబర్, వివిధ కేబుల్ నెట్వర్క్ వైర్లన్నీ అండర్ గ్రౌండ్లోనే ఉండేలా చేయాలని, ఆ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకున్నది. అందుకు సంబంధించి వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించింది.
ఇంటిగ్రేటెడ్ క్యాంపస్.. జూబ్లీహిల్స్కు ఏటీసీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడున్న 56 ఏటీసీలతో పాటు కొత్తగా 6 ఐటీఐలలో ఏటీసీలను ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది.
Also Read: GHMC: రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ.. అజెండాలో మొత్తం 46 ప్రతిపాదనలు!

