Bathukamma 2025: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఆదివారం నుంచి మొదలయ్యాయి. ఈ సారి మరింత ఘనంగా నిర్వహించేందుకు సర్కారు విభాగాలు ఏర్పాట్లు చేశాయి. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ, జీహెచ్ఎంసీ, సెర్ఫ్ ల సంయుక్తాధ్వర్యంలో ఈ సారి బతుకమ్మ ఉత్సవాలను ప్లాస్టిక్ పూలతో కాకుండా రియల్ ఫ్లవర్స్ తో నిర్వహించాలని జీహెచ్ఎంసీ(GHMC) నిర్ణయించింది. బోనాల ఉత్సవాల ఔన్నత్యాన్ని, సంస్కృతీ సంప్రదాలను మరింత గొప్పగా తెలియజేసేందుకు వీలుగా ఈ సారి కూడా సిటీలోని బిజీ జంక్షన్లలో మొత్తం 150 బతుకమ్మ ఐడల్స్ ను ప్రదర్శించేందుకు సిద్దమైంది. కానీ ఈ సారి బతుకమ్మ ఉత్సవాల్లో ప్లాస్టిక్ పూలకు చెక్ పెడుతూ ప్రకృతి పరమైన, సహజసిద్ధమైన రకరకాల పువ్వులతో ఈ 150 బతుకమ్మలను పేర్చి, ప్రతి మూడు రోజులకోసారి ఆ పూలను మార్చాలని అధికారులు నిర్ణయించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ సారి 51 అడుగుల ఎత్తులో నిజమైన పూలతో బతుకమ్మను పేర్చనున్నారు. ఆదివారం పలు ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక బృందాలతో పాటు బస్తీల్లోని మహిళలు బతుకమ్మ ఆడారు.
ఈ నెల 30న ట్యాంక్ బండ్ వద్ద
గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లలోని అన్ని ప్రాంతాల్లో బతుకమ్మ ఆడుకునే మహిళలు, స్వయం సహాయక బృందాల సభ్యులు తమ బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు ఈ సారి కూడా జీహెచ్ఎంసీ 74 స్పెషల్ వాటర్ పాండ్లను సిద్దం చేసింది. జీహెచ్ఎంసీలోని ప్రతి సర్కిల్ లో బతుకమ్మ పోటీలను నిర్వహించి, సర్కిళ్ల వారీగా ఇద్దరు విజేతలను ఎంపిక చేసి, ఈ నెల 30న జరిగే ట్యాంక్ బండ్ వద్ద జరిగే బతుకమ్మ తుది పోటీలకు పంపాలని అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. బతుకమ్మ ఆటా పాటలకు ప్రధాన వేడుకల వేదికలు పీపుల్స్ ప్లాజా–నెక్లెస్ రోడ్, ఎల్.బి స్టేడియం, జలవిహార్, కాప్రా చెరువు, ఉప్పల్ నల్లా చెరువు, సరూర్ నగర్ చెరువు, చార్మినార్, రాజేంద్రనగర్, మెహదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, ముషీరాబాద్, అంబర్పేట్, సికింద్రాబాద్, బేగంపేట్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాలు జరిగే 384 చెరువులు, కుంటల వద్ద పారిశుద్ధ్య విధుల్లో 1450 మంది కార్మికులను నియమించగా, భక్తుల సౌకర్యార్ధం 82 తాత్కాలిక మరుగుదొడ్లును అందుబాటులో ఉంచిన జీహెచ్ఎంసీ రాత్రి పూట జరిగే బతుకమ్మ ఉత్సవాల కోసం 45 వేలతాత్కాలిక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసింది.
Also Read: Narayana College: నారాయణ కాలేజీలో దారుణం.. విద్యార్థి దవడ ఎముక విరిగేలా కొట్టిన ఇన్ ఛార్జ్
గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు లక్ష్యంగా..
గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు ను కైవసం చేసుకునే లక్ష్యంగా ఈ నెల 28న మొత్తం పది వేల మందితో ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ వేడులను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో ఎనిమది వేల మంది స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలను తరలించే బాధ్యతను బల్దియా తీసుకోగా , మరో రెండు వేల మందిని సమీకరించే బాధ్యత సెర్ప్ తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు గాను మధ్యాహ్నాం నాలుగు గంటల నుంచే వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో 8 వేల మందిని సభ్యులను తరలించనున్నారు. దీంతో పాటు నెల 30వ తేదీన సచివాలయం ముందున్న అమరవీరుల జ్యోతి నుంచి ట్యాంక్ బండ్ పై ఉన్న బతుకమ్మ ఘాట్ వరకు స్వయం సహాయక బృందాలకు చెందిన 2 వేల మందితో స్పెషల్ గా బతుకమ్మ పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేగాక, తెలంగాణ రుచులను అందుబాటులో ఉంచేందుకు ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. ఇందులో రకరకాల ఫుడ్స్ డిష్ లను అందుబాటులో ఉంచేందుకు దాదాపు 50 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో హ్యాండీ క్రాఫ్ట్స్ ను కూడా ప్రదర్శనకు ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
గగనతలం నుంచి పూలవర్షం.
ప్రకృతిని పూజించే అరుదైన పండుగ బతుకమ్మ ఉత్సవాలను ఈ సారి మరింత ఘనంగా నిర్వహించేందుకు వీలుగా సర్కారు అన్ని విభాగాలను సమన్వయం చేసి, భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఇదే ఉత్సవాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 30వ తేదీన సచివాలయం ముందున్న అమరవీరుల జ్యోతి నుంచి ట్యాంక్ బండ్ పై ఉన్న బతుకమ్మ ఘాట్ వరకు స్వయం సహాయక బృందాలకు చెందిన 2 వేల మందితో స్పెషల్ గా బతుకమ్మ పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సమయంలో హెలికాప్టర్ నుంచి పరేడ్ నిర్వహిస్తున్న మహిళలపై పూల వర్షం కురిపించేందుకు కూడా రాష్ట్ర టూరిజం, కల్చరల్ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. అంతటితో ఆగని ఈ శాఖ బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రపంచం నలుమూలల తెలియజేసేందుకు వీలుగా ఈ సారి ఫస్ట్ టైమ్ విదేశీ టూరిస్టులను కూడా ఈ బతుకమ్మ పరేడ్ కు ఆహ్వానించనున్నట్లు సమాచారం.
Also Read: Kona Venkat: కోన వెంకట్ ‘ది రాజా సాబ్’ ట్రైలర్ రివ్యూ.. ఇక ఫ్యాన్స్కి పూనకాలే!