Uttam Kumar Reddy: ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని దారి మళ్లిస్తే మిల్లర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) హెచ్చరించారు. హైదరాబాద్లోని ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ క్లబ్లో గురువారం సివిల్ సప్లయ్ శాఖ ఆధ్వర్యంలో వానాకాలంలో ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లు, రబీ(యాసంగి)లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. సివిల్ సప్లై శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఖరీఫ్ సీజన్లో ధాన్యం ఉత్పత్తి, కొనుగోలు చేసిన అంశాలతో పాటు భవిష్యత్లో తీసుకోవాల్సిన అంశాలపై వివరించారు. ఎన్ఫోర్స్మెంట్ విధివిధానాలకు సంబంధించిన బ్రోచర్ను మంత్రి ఉత్తమ్ విడుదల చేసి మాట్లాడారు.
వారిని వదిలేదు లేదు
అవినీతి, అక్రమాలకు పాల్పడే మిల్లర్లను ఊపేక్షించేది లేదని ఉత్తమ్ తేల్చి చెప్పారు. అటువంటి మిల్లుల విషయంలో నాయకులెవరైనా పైరవీలు చేసినా, అధికారులు పట్టించుకోవద్దని, కఠినంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ గైడ్లెన్స్కు అనుగుణంగా నడుచుకునే మిల్లర్లను ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తుందని, అవసరమైతే అదనంగా ధాన్యం కేటాయిస్తామని తెలిపారు. గత ఖరీఫ్ సీజన్లో 71.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, దీంతో 14.21 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. ధాన్యం కొనుగోలుకు రైతులకు రూ.17,019 కోట్లు చెల్లించామని చెప్పారు. సన్న రకం వరికి బోనస్గా రూ.1,425.22 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. మొత్తం రైతుల ఖాతాల్లో రూ.18,444 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. అత్యధికంగా నిజామాబాద్లో 6.93 మెట్రిక్ టన్నులు, నల్లగొండలో 5.25 లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 4.57 లక్షల మెట్రిక్ టన్నులు, జగిత్యాలలో 3.82, మెదక్లో 3.78 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్టు వివరించారు.
సన్ని బియ్యంతోపాటు ఇతర వస్తువులు
రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యంతోపాటు త్వరలోనే మరికొన్ని నిత్యావసర వస్తువులను అందజేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే రేషన్ బియ్యం తోపాటు ఉప్పు, పప్పులు, చింతపండు, గోధుమలు తదితర నిత్యావసర వస్తువులను అందజేశామని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ షాపుల ద్వారా ప్రజలకు దొడ్డు బియ్యం పంపిణీ జరిగేదని, ఇప్పుడు తమ ప్రభుత్వం సన్న బియ్యం ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేయడంతో రాష్ట్రంలోని 3.17 కోట్ల మంది (85 శాతం)కి పైగా ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు. అందుకు ప్రభుత్వం రూ.13,650 కోట్లు ఖర్చు చేసిందని, పేద ప్రజలు కడువునిండా అన్నం తింటున్నారని పేర్కొన్నారు. మిగిలిన బియ్యాన్ని ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేసేందుకు మిల్లులు ముందుకు వస్తే వారికి సహకరిస్తామన్నారు. ప్రభుత్వం కూడా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతోపాటు వివిధ దేశాలతోనూ చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.
దిగుబడిలోనే కాదు కొనుగోలులోనూ రికార్డ్
రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా ఉన్నదని, నిల్వ చేయడానికి సరిపడా గోదాములు లేవని ఉత్తమ్ అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో మొత్తం 29 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే నిల్వ చేయడానికి గోదాములు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో ఆధునిక విధానంలో గోదాముల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. నూతన టెక్నాలజీలో నిర్మిస్తే కొంత మేర కార్మికుల కొరతను అధిగమించడానికి అవకాశం ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి అయిన నేపథ్యంలో కొనుగోలు ప్రక్రియ కుడా ప్రభుత్వం ఒక సవాల్గా స్వీకరించి 8,448 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో పాటు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వల్లనే ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని తెలిపారు. ధాన్యం దిగుబడిలోనే కాదు కొనుగోలులోనూ తెలంగాణ రాష్ట్రం రికార్డ్ సృష్టించిందని ఇందులో ప్రధాన భాగస్వామ్యం తెలంగాణ రైతాంగానిదేనని స్పష్టం చేశారు.

