Sniffer Dog Retires: పోలీసు డిపార్ట్మెంట్కు 12 ఏళ్లపాటు సేవలు
15 కేసుల్లో నిందితులను పట్టించిన జాగిలం ‘బ్రోనో’
వరంగల్ కమిషనరేట్ పరిధిలో పదవీ విరమణ
వరంగల్, స్వేచ్ఛ: పోలీసు డిపార్ట్మెంట్లో సేవలు అందించినవారికి సర్వీసు వయసు పూర్తయ్యాక ఘనంగా వీడ్కోలు పలకడం ఆనవాయితీ. అధికారులకే కాదు, కేసుల చేధనలో పోలీసులకు అత్యంత కీలకమైన జాగిలాలకు కూడా రిటైర్మెంట్ (Sniffer Dog Retires) ఉంటుంది. అరుదుగా జరిగే ఈ కార్యక్రమంలో శనివారం వరంగల్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. కమిషనరేట్ లో 12 వసంతాల సర్వీసు పూర్తి చేసుకున్న పోలీస్ జాగిలం ‘బ్రోనో’కు పోలీస్ అధికారులు పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుధీర్ఘ కాలంగా సేవలందించిన బ్రోనోను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఘనంగా సత్కరించారు. ట్రాకర్ జాగిలంగా పిలిచే ఈ జాగిలం పోలీస్ శాఖలో చేరిన నాటి నుంచి రిటైర్మెంట్ వరకు మొత్తం 15 కేసుల్లో నిందితులను గుర్తించింది. అంతేకాదు, జాతీయ పోలీస్ డ్యూటీ మీట్లలో బ్రోనో పలు పతకాలను కూడా సాధించింది. ఈ జాగిలానికి హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ శిక్షకుడిగా వ్యవహారించారు.
Read Also- Jobs In Railways: రైల్వేలో 2,865 ఉద్యోగాలు… శనివారం నుంచి మొదలైన దరఖాస్తులు
పలువురు అధికారుల రిటైర్మెంట్..
పదవీవిరమణ చేసిన పోలీస్ అధికారులు తమ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సుధీర్ఘ కాలం పని చేసి పదవీవిరమణ చేసిన పోలీస్ అధికారులను శనివారం ఆయన ఘనంగా సత్కరించారు. పోలీసు డిపార్ట్మెంట్ తరపున జ్ఞాపికలను అందజేశారు. పదవీ విరమణ పొందిన వారిలో ఎస్ఐలు యాకుబ్ మొహినూద్దీన్, మహమ్మద్ అలీ, రాధే శ్యామ్ శర్మ, యాదగిరి, నందమ చారి, ఏఎస్ఐలు జీలానీ, సురేందర్, హెడ్ కానిస్టేబుళ్లు ముత్తయ్య, యాకుబ్ పాషా, శ్రీనివాస్ ఉన్నారు.
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, ‘‘మీ సేవలు నేటి తరం పోలీసులకు అదర్శంగా నిలుస్తాయి. నేటి ఈ ప్రశాంత వాతావరణానికి మీ సేవలే కారణం. మీరు అందించిన సేవలు మరువబోం’’ అని కమిషనర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, శ్రీనివాస్, ఏసీపీ సురేంద్ర, ఆర్ఐలు సతీష్, స్పర్జన్ రాజ్, శ్రీనివాస్, శ్రీధర్ చంద్రశేఖర్, ఆర్ఎస్ఐ శ్రవణ్తో పాటు పదవీ విరమణ పొందిన సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గోన్నారు.