Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ జరుపుతున్న సిట్ అధికారులు డిజిటల్ ఆధారాలపై ఫోకస్ పెట్టారు. ట్యాపింగ్ బాగోతాన్ని నడిపించిన సమయంలో ప్రభాకర్ రావు ఉపయోగించిన జీ మెయిళ్లతోపాటు ఐ క్లౌడ్ ఖాతాలపై రెండో రోజు విచారణలో నిశితంగా ప్రశ్నించారు. అమెరికా నుంచి ఇక్కడికి రావటానికి ముందే ప్రభాకర్ రావు ఈ ఖాతాలతోపాటు తాను వాడిన డిజిటల్ పరికరాల్లోని డేటాను ఎరేజ్ చేసినా ఎఫ్ఎస్ఎల్ ద్వారా రిట్రైవ్ చేయించిన సమాచారం ఆధారంగా విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్భాల్ విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా, ముందు ముందు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరికొందరు అధికారుల మెడకు చుట్టుకోనున్నట్టుగా తెలుస్తోంది.
కస్టోడియల్ విచారణ
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఐబీ ఛీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు ఈ బాగోతంలో కీలక పాత్రధారి అని ఇప్పటికే వెల్లడైంది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం ద్వారా ఆయనకు అత్యున్నత న్యాయస్థానం అంతకు ముందు కల్పించిన మధ్యంతర రక్షణ రద్దయ్యేలా చేశారు. కస్టోడియల్ విచారణ జరిపితేనే ప్రభాకర్ రావు నోరు తెరిచే అవకాశాలు ఉన్నాయని సుప్రీం కోర్టుకు తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు వారం రోజులపాటు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణకు అనుమతించింది. దాంతో శుక్రవారం ప్రభాకర్ రావును సిట్ కార్యాలయానికి పిలిపించిన సిట్ అధికారులు విచారణ మొదలు పెట్టారు. రాత్రికి ఇంటికి కూడా పంపించ లేదు. ఇక, శనివారం ఉదయం నుంచే మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు.
Also Read: Room Heater Safety: కొత్త హీటర్ కొనుగోలు చేసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన ప్రభుత్వ సూచనలివే!
ఈ వివరాల ఆధారంగా..
గతంలో జరిపిన విచారణ సమయంలో ప్రభాకర్ రావు అయిదు జీ మెయిల్ అకౌంట్లు, రెండు ఐ క్లౌడ్ ఖాతాలకు సంబంధించిన పాస్ వర్డులను విచారణాధికారులకు తెలిపారు. అయితే, వాటిని పరిశీలించగా డేటా మొత్తం ఎరేజ్ చేసినట్టుగా తేలింది. దీని గురించి అడిగితే డివైస్ ల నుంచి తన వ్యక్తిగత డేటాను మాత్రమే తొలగించానంటూ ప్రభాకర్ రావు చెప్పారు. దాంతో దర్యాప్తు అధికారులు ఎఫ్ఎస్ఎల్ సాయం తీసుకున్నారు. కొంతమేర డేటాను రిట్రైవ్ చేయగలిగిన ఎఫ్ఎస్ఎల్ వర్గాలు ఆ వివరాలను సిట్ అధికారులకు అందచేశాయి. ఈ వివరాల ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, కీలక ప్రశ్నలన్నింటికీ ప్రభాకర్ రావు మౌనం వహిస్తున్నట్టుగా సమాచారం. ఏయే నెంబర్లను ట్యాప్ చేయాలన్న దానిపై మౌఖికంగా ఆదేశాలు వచ్చేవా? వస్తే…ఎవరు ఇచ్చేవారు? ట్యాప్ చేసిన ఫోన్ల సమాచారాన్ని ఎవరికి అందచేశారు? దీనిని స్టోర్ చేసిన పెన్ డ్రైవ్ లను ఏం చేశారు? అన్న ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం లేదని తెలిసింది.
వివరాలను ఇవ్వాలని లేఖలు
ఈ ప్రశ్నలకు నేనేం చేశానో పై అధికారులు అందరికీ తెలుసు.. రివ్యూ కమిటీ అనుమతులతోనే అంతా చేశా అని మాత్రం చెబుతున్నట్టుగా తెలియవచ్చింది. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందు ముందు మరికొందరు అధికారుల తలకు చుట్టుకునే అవకాశాలు ఉన్నట్టుగా పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక, ప్రభాకర్ రావు ఉపయోగించిన జీ మెయిల్ అకౌంట్లు, ఐ క్లౌడ్ ఖాతాల్లో సింక్ అయిన డేటాను సేకరించేందుకు సిట్ అధికారులు చర్యలకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో జీ మెయిల్, యాపిల్ కంపెనీలకు డేటా వివరాలను ఇవ్వాలని లేఖలు రాయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. కేసులో ఈ వివరాలు అత్యంత కీలకం కాగలవని అధికారులు భావిస్తున్నారు. ఒక్కసారి ఈ సమాచారం చేతికి అందితే ప్రభాకర్ రావు నోరు తెరిపించటం సులువవుతుందని అధికారులు చెబుతుండటం గమనార్హం.
Also Read: Akhanda2 Premiere: ‘అఖండ 2’ డే 1 ప్రీమియర్స్ గ్రాస్ ఎంతో తెలుసా?.. ఫ్యాన్స్కు పండగే..

