Shivadhar Reddy: హైదరాబాద్ సీపీగా మహేశ్ భగవత్!
ఇంటెలిజెన్స్కు సజ్జనార్ కేటాయింపు!
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ రాష్ట్ర తదుపరి డీజీపీగా సీనియర్ అధికారి, ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డిని నియమించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన స్థానంలో ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ను నియమించనున్నట్టు సమాచారం. ఇక, అత్యంత కీలకమైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ బాధ్యతలు మహేశ్ భగవత్ రానున్నట్టుగా తెలియవచ్చింది. ప్రస్తుతం ఈ స్థానంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీవీ ఆనంద్ను ఏసీబీ డీజీగా నియమించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం.
ఈ నెలాఖరుకి ప్రస్తుత డీజీపీ జితేందర్ రిటైర్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పోస్టును దక్కించుకోవటానికి ఐపీఎస్ అధికారులు కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎలాగైనా సరే పోలీస్ బాస్ స్థానాన్ని దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దల దృష్టిలో పడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలను కూడా ముందుకు తెస్తున్నారు. ఎవరు చెబితే ప్రభుత్వంలో మాట చెల్లుబాటు అవుతుందో వారిని సంప్రదిస్తున్నారని సమాచారం. భారం మీదేనంటూ కొందరు విన్నపాలు చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.
Read Also- Bigg Boss 9 Telugu: ఇద్దరు సెలబ్రిటీల అనంతరం.. మూడో హౌస్మేట్గా కామనర్.. ఎవరంటే?
‘సుప్రీం’ మార్గదర్శకాల ప్రకారం…
ఈనెల 30న ప్రస్తుత డీజీపీ జితేందర్ పదవీ విరమణ పొందనున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, డీజీపీ రిటైర్మెంట్కు 3 నెలల ముందే రాష్ట్ర ప్రభుత్వం ఆ పోస్టుకు అర్హులైన అధికారుల పేర్లతో జాబితాను సిద్ధం చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపించాల్సి ఉంటుంది. దీనిని పరిశీలించి కమిషన్ ముగ్గురు అధికారుల పేర్లను సిఫార్సు చేస్తూ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని డీజీపీగా నియమించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన అధికారుల పేర్లతో జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పంపించినట్టుగా పోలీసువర్గాల ద్వారా తెలిసింది. ఇక, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం డీజీపీ పోస్టులో నియమితులయ్యే అధికారి పోలీసు శాఖలో 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. పోలీసు శాఖలోని ఏదో ఒక విభాగానికి డీజీ స్థాయిలో పని చేసిన అనుభవాన్ని కలిగి ఉండాలి. డీజీపీగా నియమితులైతే రెండేళ్లపాటు ఆ పోస్టులో కొనసాగుతారు. 6 నెలల సర్వీస్ ఉన్న అధికారి పేరును కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపించవచ్చు. అలాంటి అధికారి డీజీపీగా నియమితులైతే ఆయన సర్వీస్ను పొడిగిస్తారు.
Read Also- Saiyaara OTT: రూ. 600 కోట్లు కొల్లగొట్టిన సెన్సేషనల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే?
డీజీపీ రేసులో ఎవరున్నారంటే?
ప్రస్తుతం డీజీపీ పోస్ట్ రేసులో ఇంటెలిజెన్స్ ఛీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్
శిఖా గోయల్ ఉన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి రానున్నట్టుగా తెలుస్తోంది. 1994వ సంవత్సరం బ్యాచ్కు చెందిన శివధర్ రెడ్డికి 2026 ఏప్రిల్ వరకు సర్వీస్ ఉంది. ఇక, ప్రస్తుతం హైదరాబాద్ కమిషనర్గా ఉన్న సీ.వీ ఆనంద్ను ఏసీబీకి బదిలీ చేయవచ్చని సమాచారం. ఆయన స్థానంలో అదనపు డీజీపీగా (శాంతిభద్రతలు) ఉన్న మహేశ్ భగవత్ను నియమించనున్నట్టుగా తెలిసింది. ఇక, ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్కు ఇంటెలిజెన్స్ పగ్గాలు అప్పజెప్పనున్నట్టుగా సమాచారం. ఆర్టీసీ ఎండీగా ఈసారి ఐఏఎస్ అధికారిని నియమించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.