TG Engineering Colleges: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీలు అడ్డగోలు దోపడీకి తెరదీశాయి. అడ్డూ అదుపు లేకుండా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దోచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవ్వకున్నా విద్యార్థులను తమ కాలేజీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తమ కాలేజీలకు ఫుల్ డిమాండ్ ఉందని ఆలస్యం చేస్తే సీటు దొరకడం కష్టమని కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి.
కాగా పలువురు విద్యార్థులు సైతం తమకు మంచి కాలేజీలో సీటు వస్తుందో? లేదో? అని భావించి ఆయా యాజమాన్యాలను ఆశ్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. దీన్ని ఆయా యాజమాన్యాలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. ఒకవైపు డొనేషన్లతో పాటు ఫీజులు సైతం భారీగా దండుకోవాలని పలు యాజమాన్యాలు స్కెచ్ వేశాయి.
విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో ఫీజు దండుకునేందుకు స్కెచ్ వేసిన పలు ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజు రెగ్యులేటరీ కమిటీకి ఫీజు పెంచుకునేందుకు ప్రతిపాదనలు సైతం పంపించినట్లు తెలిసింది. ఒక వైపు ఫీజులు అడ్డగోలుగా పెంచి దోచుకోవడాన్ని నియంత్రించాలని సర్కార్ భావిస్తుంటే పలు యాజమాన్యాలు మాత్రం ఫీజుల పెంపునకు ప్రతిపాదనలు చేయడంతో ఫీజు రెగ్యులేటరీ కమిటీ సైతం దీనిపై చీవాట్లు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
Also read: Hyderabad: భాగ్యనగర ప్రజలకు షాకింగ్ న్యూస్.. రోడ్డే కదా అని చెత్త వేస్తే?
కాగా మేనేజ్ మెంట్ కోటాలో పలు ప్రైవేట్ కాలేజీలు సీఎస్ఈ సీటు కనిష్టంగా రూ.15 లక్షల నుంచి మొదలుకుని గరిష్టంగా రూ.25 లక్షల వరకు వసూలు చేస్తుండటం గమనార్హం. ఈస్థాయిలో ఫీజుల దోచుకోవడంపై విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అలాంటి ప్రైవేట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో ప్రతి మూడేండ్లకు ఒకసారి ఫీజులు పెంచుకునేందుకు అవకాశం ఉంది. అయితే ప్రైవేట్ యాజమాన్యాలు అడ్డగోలుగా దోచుకోకుండా ఫీజు రెగ్యులేటరీ కమిటీ నియంత్రిస్తుంది. అలాంటి కమిటీకి తప్పుడు ఆడిట్ లెక్కలు చూపుతూ పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుకునేందుకు ప్రతిపాదనలు పంపించడం గమనార్హం.
ఈ అంశంపై రెగ్యులేటరీ కమిటీ తాత్కాలికంగా తిరస్కరించినా ఫీజుల పెంపు అంశంపై త్వరలో కమిటీ మీటింగ్ నిర్వహించి తేల్చనున్నారు. కాగా ఇష్టారీతిన ఫీజులు పెంచి పేదలకు విద్యను అందకుండా చేయొద్దని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సులకు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేయడమే కాకుండా రూ.లక్షల్లో డొనేషన్లు సైతం వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.
ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని, ఇంజినీరింగ్ బీ కేటగిరీ అడ్మిషన్లను కూడా మెడికల్ కాలేజీల విధానంలా ఆన్ లైన్ లో నిర్వహించాలని ప్రధానంగా ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. టీచింగ్, నాన్ టీచింగ్, లైబ్రరీ, ల్యాబ్స్ వంటి వసతులు లేకున్నా తప్పుడు ఆడిట్ రిపోర్టులతో పలు కాలేజీలు ఏకంగా రూ.2 లక్షలు పెంచుకునేందుకు ప్రతిపాదనలను పెట్టడంపై ఆగ్రహంగా ఉన్నారు.
Also read: CM Revanth Reddy: రైతులకు అండగా.. ఇందిరా సౌర గిరి జల వికాసం..
తప్పుడు ఆడిట్ లెక్కలు చూపించిన కళాశాలలను అధికారులు బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా కళాశాలలు సమర్పించిన ఆడిట్ రిపోర్టుపై సమగ్ర విచారణ జరిపి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని పట్టుపడుతున్నారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల తీరు చూస్తుంటే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య అందని ద్రాక్షగా మారే పరిస్థితి ఏర్పడింది.
వెంటనే విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి పేద విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య అందుబాటులో ఉండేలా ఫీజులను నిర్ణయించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి దీనిపై అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారనేది సస్పెన్స్ గా మారింది. పేద విద్యార్థులకు గుదిబండగా మారకుండా ఫీజులను అలాగే కొనసాగిస్తారా? పెంచుతారా? అనేది చూడాల్సిందే.