Hyd News:
గాంధీ ఆస్పత్రి నుంచి ఖైదీ పరార్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఓ దొంగతనం కేసులో అరెస్టయిన రిమాండ్ ఖైదీ.. హైదరాబాద్లోని (Hyd News) గాంధీ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఓ చోరీ కేసులో బేగంపేట పోలీసులు ఇటీవల సొహైల్ ఖాన్ అనే పాత నేరస్తున్ని అరెస్ట్ చేశారు. జైలుకు రిమాండ్ చేసే ముందు వైద్య పరీక్షలు జరిపించాలన్న నిబంధన ప్రకారం, అతడిని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, కాలకృత్యాలు తీర్చుకొస్తానంటూ బాత్రూం లోపలికి వెళ్లిన సొహైల్ ఖాన్ తిరిగి రాలేదు. ఎంతకీ రాకపోవడంతో పోలీసులు వెళ్లి చూడగా.. కిటికీకి ఉన్న అద్దాన్ని తొలగించి దాంట్లో నుంచి బయటకు వెళ్లి పరారయ్యాడు. ఈ మేరకు బేగంపేట పోలీసులు ఫిర్యాదు చేయగా, చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది.
Read Also- CM Revanth Reddy: చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్లకు సీఎం రేవంత్ ఒక విన్నపం
గంటన్నరలోనే స్నాచర్ పట్టివేత
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ మెడలోంచి మూడు తులాల బంగారు మంగళసూత్రాలు తెంచుకుని ఉడాయించిన ఓ స్నాచర్ను జగద్గిరిగుట్ట పోలీసులు గంటన్నరలోపే పట్టుకున్నారు. నిందితుడి నుంచి గొలుసును కూడా స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్ తెలిపిన ప్రకారం, ఈస్ట్ సాయినగర్లో నివాసముంటున్న అల్వాల్ మౌనిక వృత్తిరీత్యా టైలర్. ఆల్విన్ కాలనీలో షాపు నిర్వహిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం భోజనం చేయటానికి ఇంటికి వెళుతుండగా, ఆగంతకుడు ఆమె మెడలోని మంగళసూత్రాలను తెంచుకుని పారిపోయాడు. ఈ మేరకు ఫిర్యాదు అందిన వెంటనే జగద్గిరిగుట్ట సీఐ నర్సింహ, డీఐ నరేందర్ రెడ్డిలు క్రైం స్టాఫ్ తో కలిసి విచారణ ప్రారంభించి గంటన్నర లోపే నేరానికి పాల్పడ్డ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మామిడి సురేష్ను అరెస్ట్ చేశారు. రికార్డ్ టైమ్లో నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని బాలానగర్ ఏసీపీ నరేశ్ రెడ్డి అభినందించారు.
Read Also- Urea Shortage: యూరియా కృత్రిమ కొరతపై ఎస్పీ వార్నింగ్
ఇద్దరు డ్రగ్ పెడ్లర్ల అరెస్ట్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను దోమలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి మీడియా సమావేశంలో అదనపు డీసీపీ ఆనంద్, గాంధీనగర్ ఏసీపీ యాదగిరితో కలిసి వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర ఔరంగాబాద్ సిటీలోని భీమాశక్తినగర్ ప్రాంతానికి చెందిన కోమల్ సోమినాథ్ పవార్ (23), సాహిల్ మహేశ్ సాలొంకే (18) స్నేహితులు. తేలికగా డబ్బు సంపాదించేందుకు గంజాయి దందా చేయాలని ఇద్దరు కలిసి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వెళ్లారు. అక్కడ బాబు అనే వ్యక్తి నుంచి 18 కిలోల గంజాయి కొన్నారు. అనంతరం బస్సులో హైదరాబాద్ చేరుకున్నారు. లిబర్టీ టీ జంక్షన్ వద్ద ఉన్న సూరజ్ ట్రావెల్స్ వద్ద గంజాయి కొనేవారి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందడంతో దోమలగూడ స్టేషన్ సీఐ కే.శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుళ్లు ఖలీల్, సతీష్ కుమార్, ఆగా తాహేర్ అబ్బాస్, దుర్గా భవానీతో కలిసి దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గంజాయితోపాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు.