తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ:Ramakrishna Rao: రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు తనదైన ముద్రవేశారు. పదేళ్లకుపైగా బడ్జెట్ రూపకల్పనలో ఆయన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఏకంగా 14 బడ్జెట్లను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తూ, తన అనుభవాన్ని సమర్థంగా వినియోగించారు. మొత్తం పన్నెండు రెగ్యులర్ బడ్జెట్లు, మరో రెండు ఓట్ ఆన్ ఎకౌంట్లను తయారు చేయటంలో ఆయన రికార్డును సొంతం చేసుకున్నారు. రెండు ప్రభుత్వాల్లో పదేళ్ల పాటు ఆర్థికశాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన రామకృష్ణారావు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శిగా నిలిచారు.
బడ్జెట్ అంచనాల మేరకు ఆదాయం రాబట్టడంలో, వచ్చిన రాబడితో వ్యయాలను సమన్వయం చేయటంలో తన ప్రత్యేక శైలిని ప్రదర్శించి, సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అఖిల భారత సర్వీసులకు చెందిన 1991 బ్యాచ్ ఐ.ఏ.ఎస్ అధికారిగా అటు ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఇటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ రామకృష్ణారావు తనదైన ముద్ర వేసుకున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గా, ఆతర్వాత ఎం.బీ.ఏ చేసిన ఆయన ఆల్ ఇండియా సర్వీస్ కు ఎంపికయ్యారు. ఆ తర్వాత ఆర్థికరంగంలో నిపుణుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
ప్రభుత్వాలు మారినా ఆర్థిక శాఖలో ఆయన రోల్ మారక పోవటం ఒక అధికారి సమర్థతకు నిదర్శనమని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. గత పదేళ్లలో ఇద్దరు ముఖ్యమంత్రుల నమ్మకాన్ని సంపాదించిన ఏకైక అధికారిగా పేరుపొందారు. ఆర్థిక సంక్షోభ సమయంలోనూ ఆయన తన అనుభవంతో సులభతర మార్గాలను అన్వేషించి, ప్రణాళికాబద్దంగా మార్గదర్శనం చేశారనే పేరుంది. వివిధ శాఖల్లో ఖర్చులను సమతుల్యం చేయడం, ఆదాయ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించడం వంటి అంశాల్లో ఆయన విశేషమైన ప్రతిభ కనపరిచారు.
Also Read: CM Revanth Reddy: ఆ ఎమ్మెల్యేకు క్లాస్ తీసుకున్న సీఎం.. వెయిట్ అంటూ సూచన
ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు, ఇతర మంత్రుల ప్రశంసలూ పొందారు. కీలకమైన పదవిలో ఉండి కూడా ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు, ముఖ్యమంత్రుల లైన్ తప్పకుండా పనిచేశారనే పేరును సొంతం చేసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఆయన చేసిన సేవలు, బడ్జెట్ రూపకల్పనలో చూపిన విశేష ప్రతిభ భవిష్యత్ ఆర్థిక విధానాలకు పునాదులుగా నిలుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత విభిజన చట్టం ప్రకారం స్టేట్ రీ ఆర్గనైజేషన్ డిపార్టుమెంట్ ను కూడా ఆయన ఆధ్వర్యంలోనే సమర్థవంతంగా నడిపారు.
విభజన అంశాలు, వివాదాల పరిష్కారమార్గాల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అటు కేంద్రంతో సంప్రదింపులు, ఇటు విభాజిత ఆంధ్రప్రదేశ్ తోనూ సమన్వయం చేసుకున్న అధికారిగా పేరుపొందారు. సుదీర్ఘకాలంగా ఆర్థిక శాఖలో పనిచేస్తున్న రామకృష్ణారావు త్వరలో చీఫ్ సెక్రటరీ కూడా అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం.
ప్రస్తుత సీఎస్ శాంతికుమారి వచ్చే నెల ఏప్రిల్ నెలాఖరుకు పదవీ విరమణ పొందనున్నారు. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ నియామకం కోసం చాలా మంది అధికారులు పోటీలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రామకృష్ణారావు వైపే మొగ్గుచూపే అవకాశం ఉందని అధికారిక వర్గాలు అంటున్నాయి. అయితే ఆయన పదవీ విరమణకు కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే ఉంటోంది. ఒక వేళ ప్రభుత్వం పొడిగింపును ఇస్తే మరో మూడు నెలల పాటు నవంబర్ నెలాఖరు వరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగే అవకాశముంది.
Also Read: TPCC Chief Mahesh Kumar: సంబరాలు అంబరాన్ని తాకాలి.. టీపీసీసీ చీఫ్ పిలుపు..