Polavaram Project: ప్రాజెక్టుల సాంకేతిక అంశాలు తమ పరిధిలోకి రావని పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) అథారిటీ సీఈవో, సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపుల పని కూడా తమది కాదని తెలిపారు. తెలంగాణ అభ్యంతరాలకు తమకేం సంబంధం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్లోని కృష్ణా గోదావరి భవన్ ఆఫీసులో శుక్రవారం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ) 17వ సమావేశం నిర్వహించారు. ఇందులో ఏపీ చేపడుతున్న పోలవరం, బనకచర్ల ప్రాజెక్ట్ విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టును నిర్మించకుండా ఏపీని నిలువరించాలని డిమాండ్ చేశారు.
Also Read: Polavaram Project: పోలవరంతో తెలంగాణకు ముప్పు.. న్యాయ పోరాటానికి రెడీ.. కవిత వార్నింగ్!
అంతా మారిపోయిందని అభ్యంతరం
బనకచర్ల లింక్ ప్రాజెక్ట్కు సోర్స్ పోలవరం ప్రాజెక్టేనని, దీనివల్ల అంతా మారిపోయిందని అభ్యంతరం తెలిపారు. ఏపీ నిర్మించేలా ఎగువ రాష్ట్రాలు సైతం ప్రాజెక్టులను నిర్మించుకుంటూ పోతే దిగువ రాష్ట్రాలకు చుక్క నీరు కూడా రాదని ఆందోళన వ్యక్తం చేశారు. బనకచర్ల కోసం ఏపీ పోలవరం కుడి కాల్వ, ట్విన్ టన్నెల్స్ కెపాసిటీని రెట్టింపు చేస్తున్నదని ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా వివరించారు. ఏపీ అధికారులు మాత్రం రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకునే పోలవరం ప్రాజెక్ట్ విస్తరణను చేపట్టామని, అయినా సముద్రంలో కలిసే నీళ్లనే వాడుకునేలా ప్రతిపాదించామని, అవి వరద జలాలని వాదించారు.
ఫేజ్ 1ను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం
ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ మాట్లాడుతూ, కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, మెయింటెనెన్స్, ఆపరేషన్ మాత్రమే తాము చూస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఫేజ్ 1ను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్తో 6 పెద్ద వాగుల ప్రవాహాలపై పడే ప్రభావం మీద సర్వే చేయాలని, రాష్ట్రంలో ప్రొటెక్షన్ వర్క్స్ చేపట్టాలని 2022 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని, ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే భద్రాచలంలోని ఏటపాక ఔట్ఫాల్ రెగ్యులేటర్, భద్రాచలం మునిగిపోయే ప్రమాదం ఉంటుందని రాహుల్ బొజ్జా ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఏపీ, తెలంగాణ, పీపీఏ అధికారులతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తామని అతుల్ జైన్ పేర్కొన్నారు. తుది నివేదిక అనంతరం ఆ ఔట్ఫాల్ రెగ్యులేటర్ల ఆపరేషన్లపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
Also Read: Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్.. అథారిటీతో కలిసి చేయనున్న సీడబ్ల్యూసీ!
