Phone Tapping Case: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విచారణకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) దాఖలు చేసిన పిటిషన్ పై విచారించేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) నిరాకరించింది. తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన ఉత్తర్వులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం దాఖలకు చేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. దీంతో హరీశ్ రావుకు భారీ ఊరట లభించనట్లైంది.
వివాదం ఏంటంటే?
సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ (Chakradhar Goud) గతంలో తనతోపాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను హరీశ్ రావు ట్యాప్ చేయించారని ఆరోపించారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులకు సైతం ఫిర్యాదు చేయడంతో హరీశ్ రావుపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. సంబంధిత ఎఫ్ఐఆర్ పై గతంలో స్క్వాష్ ఉత్తర్వులు జారీ చేసింది.
ద్విసభ్య ధర్మాసనం తీర్పు
ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకున్నందున ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హరీశ్ రావును సైతం విచారించాలని దర్యాప్తు వర్గాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన స్క్వాష్ పిటిషన్ ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసి.. హరీశ్ రావు విచారణకు అనుమతివ్వాలని కోరింది. చక్రధర్ గౌడ్ ను ప్రతివాదిగా చేర్చింది. అయితే ఈ పిటిషన్ పై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ భూయాన్ ద్విసభ్య ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది.
Also Read: Trump on India: మోదీ నన్ను సంతోషపెట్టాలి.. లేదంటే ట్యాక్స్ పెంచుతా.. ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
ఫోన్ ట్యాపింగ్ కేసు వివాదం
ఇటీవల సిట్ విచారణకు హాజరైన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (Special Operations Team)ను ఏర్పాటు చేశారు. డీఎస్పీ ప్రణీత్ రావు (D. Praneeth Rao), ఏఎస్పీ మేకల తిరుపతన్న (Mekala Thirupathanna), ఎన్. భుజంగరావు (N. Bhujanga Rao), రాధా కిషన్ రావు (Radha Kishan Rao) లను కలిపి ఒక టీమ్ గా ఫామ్ చేశారు. అయితే మావోయిస్టులపై నిఘా కోసం ఉపయోగించే సాధనాలను ఈ SOT టీమ్.. రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి.

