Phone Tapping Case: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావుకు ఉచ్చు బిగుసుకుంటోంది. ప్రభాకర్ రావును ప్రకటిత నేరస్తునిగా ప్రకటించాలంటూ దర్యాప్తు అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజులలోపు ప్రభాకర్ రావు కోర్టులో లొంగిపోవాలని పేర్కొంది. ప్రభాకర్ రావు సరెండర్ కాకపోతే కోర్టు ఆయనను ప్రకటిత నేరస్తునిగా ప్రకటిస్తుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.
అదే జరిగితే ప్రభాకర్ రావు ఆస్తులను సీజ్ చేయవచ్చని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. క్రితంసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్ఐబీ అధికారులు వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు, వారి బంధుమిత్రుల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా బయటపడింది. దాంతోపాటు కొందరు వ్యాపారులు, హైకోర్టు జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు వెల్లడైంది.
Also Read: Etela Rajender: బెదిరిస్తే భయపడం.. సీఎంకు ఎంపీ ఈటల సవాల్!
ఈ మేరకు మొదట పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఆ వెంటనే ఎస్ఐబీలో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్ రావును అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నతోపాటు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పని చేసిన రాధాకిషన్ రావును కూడా అరెస్ట్ చేశారు. ఇదే కేసులో నిందితునిగా ఉన్న శ్రవణ్ రావును పలుమార్లు ప్రశ్నించారు. వీరందరిని జరిపిన విచారణలో అప్పట్లో ఎస్ఐబీ ఛీఫ్ గా పని చేసిన ప్రభాకర్ రావు సూచనల మేరకే ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో దర్యాప్తు అధికారులు ప్రభాకర్ రావును కేసులో ప్రధాన నిందితునిగా చేర్చారు.
ఆ వెంటనే ప్రభాకర్ రావు అమెరికా పారిపోయాడు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. దాంతో పోలీసులు సీబీఐ ద్వారా అతనిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించారు. పాస్ పోర్టును కూడా రద్దు చేయించారు. ఈ క్రమంలో అరెస్ట్ తప్పదని భావించిన ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ముందస్తు బెయిల్ ఇస్తే స్వదేశానికి తిరిగి వచ్చి విచారణకు సహకరిస్తానని కోర్టుకు తెలిపారు. అయితే, ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వటానికి నిరాకరించిన హైకోర్టు ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. దాంతో ప్రభాకర్ రావు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అదే సమయంలో అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి తనను రాజకీయ శరణార్థిగా పరిగణించాలంటూ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Also Read: Rajiv Gandhi Death Anniversary: రాజీవ్ గాంధీ చొరవతోనే.. అప్పటి టెక్నాలజీ ఇప్పుడు వాడుతున్నారు!
నాంపల్లి కోర్టులో…
అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాకర్ రావును ఇక్కడికి రప్పించి విచారణ జరపాలని నిర్ణయించిన దర్యాప్తు అధికారులు ఈ దిశలో కీలక చర్య తీసుకున్నారు. దీంట్లో భాగంగా ప్రభాకర్ రావును ప్రకటిత నేరస్తునిగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేయాలంటూ కొంతకాలం క్రితం బీఎన్ఎస్ సెక్షన్ 84 ప్రకారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభాకర్ రావు తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే ఇక్కడికి వచ్చి విచారణకు సహకరించటానికి తమ క్లయింట్ సిద్ధంగా ఉన్నట్టు తెలియచేశారు. అయితే, ప్రభుత్వ న్యాయవాది దీనిని వ్యతిరేకించారు. కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడని చెప్పారు. ఆయనను క్షుణ్నంగా విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సూత్రధారులు ఎవరన్నది బయట పడుతుందని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే ఆయన కేసు దర్యాప్తుపై ప్రభావం కనబరిచే అవకాశాలు ఉన్నాయన్నారు.
Also Read: Admit Card – UPSC: అడ్మిట్ కార్డు లేకుంటే నో ఎంట్రీ.. 25న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష!
ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నెల రోజుల లోపు కోర్టులో లొంగిపోవాలని ప్రభాకర్ రావుకు సూచించింది. ఈ క్రమంలో మొదట లిఖిత ప్రకటనను వెలువరించనున్నారు. నిందితునిగా ఉన్న ప్రభాకర్ రావు నివాసంతోపాటు కోర్టు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఈ ఉత్తర్వుల ప్రతిని అతికించనున్నారు. దాంతోపాటు దిన పత్రికల్లో ప్రకటన రూపంలో ప్రచురిస్తారు.
ఈ ప్రక్రియ తరువాత నిర్దేశించిన గడువులోపు ప్రభాకర్ రావు సరెండర్ కాకపోతే ఆయనను కోర్టు ప్రకటిత నేరస్తునిగా ప్రకటిస్తుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే ప్రభాకర్ రావుకు చెందిన స్థిర చరాస్తులను బీఎన్ఎస్ సెక్షన్ 85 ప్రకారం జప్తు చేయవచ్చన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభాకర్ రావు స్వదేశానికి వచ్చి లొంగిపోవటం తప్ప మరో మార్గం లేదన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు