Ganesh Immersion: అన్ని విభాగాల అధికారులకు ప్రశంసలు
తెలంగాణ బ్యూరో,స్వేచ్ఛ: హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు (Ganesh Immersion) ప్రశాంతంగా ముగియడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 9 రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని సీఎం ప్రస్తావించారు. 9 రోజులపాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, రెవెన్యూ, విద్యుత్, రవాణా, మున్సిపల్, పంచాయతీ రాజ్ పారిశుద్ధ్య, ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల నిర్వాహకులు, క్రేన్ ఆపరేటర్లు, భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో లక్షలాది విగ్రహాలు క్రమపద్ధతిలో నిర్దేశిత సమయానికి ట్యాంక్బండ్తో పాటు మిగతా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం సాఫీగా, ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
సిబ్బంది అందరికీ అభినందనలు: హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: లక్షలాది మంది పాల్గొన్న వినాయక నిమజ్జన శోభా యాత్ర ప్రశాంతంగా ముగిసిందని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. సిబ్బంది సమష్టి కృషితోనే ఈ ఫలితాన్ని సాధించగలిగామన్నారు. నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు కంటి మీద కునుకు లేకుండా పని చేసి శాంతిభద్రతలను కాపాడిన సిబ్బంది అందరికీ పేరు పేరునా అభినందనలు తెలిపారు. రెండో రోజు నిమజ్జన ఊరేగింపును పర్యవేక్షించిన అనంతరం తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
Read Also- Saiyaara OTT: రూ. 600 కోట్లు కొల్లగొట్టిన సెన్సేషనల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే?
వినాయక చవితి వేడుకలు మొదలైన 3వ రోజు నుంచి 11వ రోజు వరకు 1.40లక్షల వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగినట్టు సీపీ ఆనంద్ చెప్పారు. వీటిలో 1.20లక్షల విగ్రహాలు బేబీ పాండ్స్, చిన్న చిన్న చెరువుల్లో నిమజ్జనమైనట్టు తెలిపారు. ఇక, ఆన్ లైన్ ద్వారా సేకరించిన వివరాల ప్రకారం హైదరాబాద్ లో 12,030 విగ్రహాలను ప్రతిష్ట జరిగినట్టు చెప్పారు. వీటిలో ప్రధాన నిమజ్జనానికి ముందు 7,330 విగ్రహాల నిమజ్జనం జరిగిందన్నారు. మిగితా 4,700 విగ్రహాలు ప్రధాన నిమజ్జనం రోజున ఊరేగింపులో పాల్గొన్నట్టు చెప్పారు. వీటిలో రెండో రోజు మధ్యాహ్నం సమయానికి ఇంకా 900 విగ్రహాలు నిమజ్జనార్థం క్యూలో ఉన్నట్టు తెలిపారు.
నిమజ్జన శోభా యాత్ర 40గంటలకు పైగా కొనసాగిందన్నారు. ఈసారి కొన్ని విగ్రహాల ఎత్తు 40 అడుగుల కంటే ఎక్కువగా ఉండటం వల్ల శోభా యాత్ర కొంత ఆలస్యమైందని చెప్పారు. 9 డ్రోన్లు, 35 హై రైజ్ భవనాలపై కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెట్టామన్నారు. ఇక, నిర్వాహకుల సహకారంతో ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం అనుకున్న సమయానికన్నా ముందుగానే నిమజ్జనమైనట్టు చెప్పారు. ఇక, ఊరేగింపులో చిన్న చిన్న గొడవలు జరిగాయని, వీటికి సంబంధించి 5 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అలాగే మహిళల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన 170మందితోపాటు కొందరు పిక్ పాకెటర్లను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.
Read Also- Mahesh Kumar Goud: బండి సంజయ్ బీసీ కాదు.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
రెండో రోజు కూడా నిమజ్జన ఊరేగింపు కొనసాగుతోందన్నారు. ట్రాఫిక్ మళ్లింపులు పూర్తిగా తొలగించినపుడే నిమజ్జనం పూర్తయినట్టుగా భావిస్తామన్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, విద్యుత్, ఆర్టీఏ, హెచ్ఎండీఏ తదితర ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయం…ఉత్సవ నిర్వాహకుల సహకారం వల్లనే నిమజ్జన ఊరేగింపు ప్రశాంతంగా పూర్తయ్యేలా చూడగలిగామన్నారు. కమిషనర్ వెంట అదనపు సీపీ (లా అండ్ ఆర్డర్) విక్రమ్ సింగ్ మాన్, అదనపు సీపీ (క్రైం) విశ్వప్రసాద్, జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్, నేరపరిశోధక విభాగం డీసీపీ శ్వేత, సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తదితర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.