Fee Reimbursement: ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ప్రైవేట్ యాజమాన్యాలు కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి. కాగా ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సర్వాత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఉన్నత విద్యాసంస్థల సంఘం ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(FATHI) ప్రతినిధులతో రెండ్రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిపి విజయవంతంగా సమ్మెను విరమింపజేసింది. గతంలో డిమాండ్ల సాధనకు ఎవరైనా సమ్మెకు దిగితే కనీసం వారి బాధలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలకించేది కాదనే విమర్శలు ఉన్నాయి. కానీ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు సమ్మె ప్రకటించిన అదే రోజు కాంగ్రెస్ సర్కార్ వేగంగా స్పందించింది. అర్ధరాత్రి వరకు చర్చలు జరిపి సావధానంగా వారి సమస్యలు వినడమే కాకుండా వాటికి పరిష్కారం చూపడం హర్షనీయమని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో సర్కార్ చర్చించి వేగంగా నిధుల విడుదలకు నిర్ణయం తీసుకోవడం ద్వారా విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా ప్రభుత్వం కృషి చేసిందనే అభిప్రాయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో సంక్షోభంలో కూరుకుపోయిన ఉన్నత విద్యాసంస్థలను ఆర్థిక భారం నుంచి గట్టెక్కించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నత విద్యాసంస్థలను పట్టించుకోలేదనడానికి రూ.5,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టివెళ్లడమే నిదర్శనమని పలువురు విమర్శలు చేస్తున్నారు.
Also Read: Husband Suicide: ‘నా భార్య వేధిస్తోంది.. భరించలేకపోతున్నా’.. అంటూ భర్త సూసైడ్
బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం..
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల పాపం గత బీఆర్ఎస్ సర్కార్ దేనని పేరెంట్స్, ప్రైవేట్ యాజమాన్యాలు విమర్శలు చేస్తున్నాయి. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా తదుపరి పెరిగిన ఆర్థికభారంతో ఇబ్బందుల్లో ఉన్న కాలేజీలు సమ్మె బాటపట్టాయి. ఈ నిర్ణయం కారణంగా రాష్ట్రంలో 13 లక్షల మంది విద్యార్థులు బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఉన్నత విద్యా సంస్థలు సెప్టెంబర్ 15 నుంచి నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. అయితే, దీనిపై వేగంగా స్పందించిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం విద్యార్థుల చదువులు నిలిచిపోకూడదన్న ఆశయంతో చకచకా నిర్ణయాలు తీసుకోవడంపై సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను విడుతలవారీగా విడుదల చేస్తామని సర్కార్ ప్రైవేట్ యాజమాన్యాలకు హామీ ఇచ్చింది. ఈ వారంలోనే రూ.600 కోట్ల విడుదలకు అంగీకరించింది. దీంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తమకు అత్యధిక ప్రాధాన్యత కలిగిన అంశమని మాటలతో కాకుండా కాంగ్రెస్ సర్కార్ చేతలతో నిరూపించుకుందని చర్చించుకుంటున్నారు.
రూ.21 వేల కోట్ల అంచనాలతో..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. విద్యతోపాటు ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించతలపెట్టింది. రూ.21 వేల కోట్ల అంచనాలతో అత్యాధునిక వసతులు, ల్యాబ్లు, స్టేడియాలతో ఈ స్కూళ్ల నిర్మాణానికి పూనుకుంది. అలాగే రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ.9 వేల కోట్లు వెచ్చించనుంది. ఇక యువతకు ఉపాధి కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి మెరుగైన శిక్షణ అందిస్తోంది. యువతను పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దనుంది. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్ది అత్యాధునిక వసతులు కల్పిస్తూ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది.
Also Read: Collector Harichandana: పక్కా ప్రణాళికతో హెల్త్ క్యాంప్లు నిర్వహించాలి: కలెక్టర్ హరిచందన దాసరి