Drugs: ప్రాణాలు కాపాడాల్సిన వృత్తిలో ఉండి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి దొరికిపోయిన డాక్టర్ నమ్రత కేసులో ఆసక్తికర వివరాలు వెలుగు చూస్తున్నాయి. ఉన్నత విద్యలు అభ్యసించటానికి ఆమె స్పెయిన్ వెళ్లినపుడే డ్రగ్స్ అలవాటయ్యాయని పోలీసుల విచారణలో తేలింది. స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత కూడా మాదక ద్రవ్యాలు తీసుకోవటం మానేయలేక పోయిన నమ్రత డ్రగ్స్ కోసం లక్షలు ఖర్చు పెట్టినట్టుగా వెల్లడైంది. ఇక ఈ కేసులో నమ్రత బాధితురాలు మాత్రమే అని రాయదుర్గం పోలీసులు చెబుతున్నారు. అందుకే ఆమెను రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించినట్టు చెప్పారు. అయితే, డ్రగ్స్ దందా చేయటానికి సప్లయర్ వంశ్ టక్కర్ ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ వివరాలను సేకరిస్తున్నామన్నారు.
ఇదిలా ఉండగా డ్రగ్స్ కొంటూ పట్టుబడ్డ డాక్టర్ నమ్రతకు తమ ఆస్పత్రితో ఎలాంటి సంబంధం లేదని ఒమెగా హాస్పిటల్ సీఎం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం షేక్ పేటలో నివాసముంటున్న నమ్రత 2014లో ఎంబీబీఎస్చదివిన ఆ తరువాత కొచ్చిలో రేడియేషన్ఆంకాలజీలో ఎండీ పూర్తి చేశారు. అనంతరం ఎంబీఏ చదవటానికి స్పెయిన్దేశానికి వెళ్లారు. అక్కడే నమ్రతకు డ్రగ్స్ అలవాటైనట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మొదట్లో సరదాగా తీసుకున్న మాదక ద్రవ్యాలను మానుకోలేక స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత కూడా వాటిని తీసుకోవటం కొనసాగించారు.
మొదట్లో డీజేల నుంచి
స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత నమ్రత మొదట్లో పబ్బులకు తరచూ వెళ్లేదని పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో పరిచయం అయిన కొందరు డీజేల నుంచి ఆమె డ్రగ్స్ కొనుగోలు చేసేదని వెల్లడైంది. ఆ తరువాత ఓ పార్టీలో తన స్నేహితురాలి బాయ్ఫ్రెండ్ ద్వారా ఈ మొత్తం వ్యవహారంలో కింగ్ పిన్ అయిన వంశ్ టక్కర్ తో పరిచయం అయినట్టుగా తెలిసింది. అప్పటి నుంచి వంశ్ టక్కర్ నుంచే నమ్రత కొకైన్ కొనుగోలు చేస్తూ వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది.
వాట్సాప్ ద్వారా ఆర్డర్లు
దేశంలోని వేర్వేరు సిటీలకు కొకైన్ సప్లయ్ చేస్తున్న వంశ్ టక్కర్ తన క్లయింట్ల కోసం ఓ వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసినట్టుగా దర్యాప్తులో తేలింది. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుని ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు జరిగిన తరువాత తన వద్ద పని చేస్తున్న కొరియర్ల ద్వారా ఆయా నగరాలకు మాదక ద్రవ్యాలను చేర్చేవాడని నిర్ధారణ అయ్యింది. డ్రగ్స్ ఎప్పుడు? ఎక్కడ? డెలివరీ చేసేదన్న దానికి సంబంధించి వాట్సాప్ లోనే వివరాలు పంపించే వాడని వెల్లడైంది.
Also Read: Karregutta Mulugu Effects: ఆదివాసీల ఊచకోతలు.. మావోయిస్టుల హింస.. కర్రెగుట్టల వాస్తవ కథనం!
ఇటీవల నమ్రత ఆన్ లైన్ద్వారా 5లక్షల రూపాయలు పంపించగానే తన వద్ద కొరియర్ గా పని చేస్తున్న బాలకృష్ణతో కొకైన్ పంపించినట్టుగా తెలిసింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే వంశ్ టక్కర్ తన క్లయింట్లు అందరితో వాట్సాప్లో మెసెజ్ డిసప్పియరింగ్ ఆప్సన్ను ఆన్ చేయించి పెట్టటం. దాంతో డ్రగ్స్ కోసం చేసిన ఆర్డర్ మెసెజీలు డెలివరీ మెసెజీలు నిర్ణీత సమయం పూర్తి కాగానే వాటంతట అవే ఫోన్ నుంచి తొలగిపోయేవి.
వివరాలు సేకరిస్తున్నాం
డాక్టర్ నమ్రత ఉదంతంలో పక్కాగా సమాచారాన్ని సేకరించి నిఘా పెట్టి మరీ ఆమెతోపాటు డ్రగ్స్డెలివరీ చేయటానికి వచ్చిన బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నట్టు రాయదుర్గం సీఐ వెంకన్న తెలిపారు. ఇద్దరి మొబైల్ ఫోన్లను సీజ్ చేశామన్నారు. ఆ ఫోన్లలో ఉన్న వాట్సాప్గ్రూపులు వాటిల్లో ఎవరెవరు సభ్యలుగా ఉన్నారన్న వివరాలను సేకరిస్తున్నట్టు చెప్పారు.
ఈ కేసులో కింగ్పిన్అయిన వంశ్ టక్కర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడన్నారు. అతని మొబైల్ ఫోన్లు కూడా స్విచాఫ్ ఉన్నట్టుగా తెలిపారు. అతని కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. ఇక ఈ కేసులో నమ్రత బాధితురాలు మాత్రమే అని సీఐ వెంకన్న చెప్పారు. అందుకే ఆమెను రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించినట్టు తెలిపారు.
మా ఆస్పత్రితో సంబంధం లేదు
ఇదిలా ఉండగా డాక్టర్ నమ్రతకు ప్రస్తుతం తమ ఆస్పత్రితో ఎలాంటి సంబంధం లేదని ఒమెగా హాస్పిటల్ సీఎండీ డాక్టర్ మోహన వంశీ ఓ ప్రకటనలో తెలిపారు. నమ్రత తమ ఆస్పత్రిలో పని చేయటం లేదన్నారు. ఆంకాలజీ విభాగంలో తమ హాస్పిటల్ అత్యుత్తమ సేవలను అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
Also Read: Miss World 2025: ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు.. ఆహా అనిపించిన అందాలు!