Nagarkurnool: ప్రతి రైతుకు సమానంగా యూరియా అందేలా చర్యలు
ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు
సమీక్షించిన నాగర్కర్నూల్ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్
నాగర్కర్నూల్, స్వేచ్ఛ: ప్రతి రైతుకు సమానంగా యూరియా అందేలా చూడాలని, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ (Nagarkurnool) ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయంలో నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల వ్యవసాయ అధికారులు, సింగిల్ విండో చైర్మన్లు, సింగిల్ విండో సీఈవోలు, వ్యవసాయ ఎరువుల విక్రయ డీలర్లతో యూరియా సరఫరాపై ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ… నియోజకవర్గ రైతులందరికీ యూరియా అందేలా, ఎరువుల దుకాణాల్లో అందుబాటులో ఉంచేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా, ప్రైవేట్ డీలర్లు యూరియాతో పాటు ఇతర క్రిమిసంహారక మందులను ఇవ్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా యూరియాను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అదే తరహాలో క్షేత్రస్థాయిలో అధికారులు, డీలర్లు తప్పనిసరిగా స్టాక్ అందుబాటులో ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఎక్కడా యూరియాను బ్లాకుల్లో అమ్మకుండా, ఎక్కడైనా బ్లాక్లో అమ్మినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి రైతుకు అవసరమైన ఎరువులు సరఫరా చేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రస్తావించారు.
Read Also- OG Premieres: అక్కడ అంచనాలు మించిపోతున్న ‘ఓజీ’.. ఈ తుఫాన్ ధాటికి రికార్డుల గల్లంతు
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ, యూరియాను ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. యూరియాతో పాటు ఇతర ఎరువులను రైతులకు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ప్రస్తుతం 120 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, శుక్రవారం రాత్రి వరకల్లా మరో 100 మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. యూరియా సరఫరా చేసేటప్పుడు ప్రతి రైతు నుంచి పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ జిరాక్స్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. రైతు పాస్ బుక్ ఆధారంగా ప్రతి రైతుకు రోజుకు 2 కంటే ఎక్కువ బస్తాలు ఇవ్వవొద్దని స్పష్టం చేశారు.
Read Also- Team India Jersey: జెర్సీ స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ బరిలోకి టీమిండియా!.. ఎందుకంటే?
జిల్లా ఆస్పత్రిలో సమీక్ష
మరోవైపు, జిల్లా ఆసుపత్రిలో కూడా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఆసుపత్రిలో వార్డులను పరిశీలించారు. వైద్య సదుపాయాలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వైద్యశాఖా మంత్రి దామోదర రాజనర్సింహతో ఫోన్లో మాట్లాడి ఆసుపత్రి కి కావాల్సిన సదుపాయాలను వివరించారు. అలాగే జిల్లా కేంద్రంలోని పలు వినాయక మండపాలను ఎమ్మెల్యే దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో నాగర్కర్నూల్ పట్టణ, మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు.