MLA KP Vivekananda: ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్ ఓవైసీ (Akbaruddin Owaisi), అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi)లు తమ స్వార్ధ రాజకీయాల కోసం పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ (MLA KP Vivekanand Goud) ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థిని బరిలో నిలుపకుండా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు పలకడాన్ని మైనారిటీ ప్రజలు గమనిస్తున్నారని, దీనికి నవంబర్ 11న జరిగే ఎన్నికల్లో వారే సరైన సమాధానం చెబుతారన్నారు. అభివృద్ధిలో కాకుండా అవినీతి వసూళ్లలో కాంగ్రెస్ (Congress) మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధిలో పోటీపడుతూ దేశంలోనే అగ్ర భాగంగా ఉన్న హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవినీతి కోరల్లో అదఃపాతాళానికి దిగజార్చిందని మండిపడ్డారు.
Also Read- Maoist Links: రాజకీయ నాయకులకు మావోయిస్టులతో సంబంధాలు.. తెలంగాణ బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
గంగా జమున తహజీబ్
దేశానికి స్వతంత్రం రాకముందే హైదరాబాద్ నగరంలో సర్వ కులాలు, సర్వ రాష్ట్రాలు, అనేక జాతుల వారు ఇక్కడ నివసించగా స్వతంత్ర రాష్ట్రంగా, స్వతంత్ర దేశంగా అభివృద్ధి చెందిన ఘనత హైదరాబాద్ నగరానిది.. అందుకే హైదరాబాద్ నగర సంస్కృతి ‘గంగా జమున తహజీబ్’ గా తన ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. కోట్ల పెట్టుబడులతో 9 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు కల్పించిన ఘనత నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కే దక్కుతుందన్నారు. గొడుగులు పట్టి పెట్టుబడిదారులకు స్వాగతం పలికిన చరిత్ర బీఆర్ఎస్ ది అయితే, గన్నులు పెట్టి వసూలు చేసే చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు.
స్వార్థ రాజకీయాల కోసమే
హైదరాబాద్ నగరాన్ని శాంతియుతంగా ఉంచి, శాంతియుత వాతావరణాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి విషయంలో దేశంలోని ఇతర నగరాలకు దీటుగా పనిచేసిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. అసెంబ్లీ వేదికగా నాడు ముస్లింల సంక్షేమం, అభివృద్ధికై పని చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పిన అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీలు నేడు స్వార్థ రాజకీయాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పడాన్ని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అట్టర్ ప్లాప్ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. హైదరాబాద్ నగరాభివృద్దే లక్ష్యంగా పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. జూబ్లీ హిల్స్లో చేసిన అభివృద్ధితోనే ఉప ఎన్నికల్లో మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
