స్పాన్సర్ల విషయంలోనూ ఫెయిల్
సడెన్ కార్యక్రమాలతో ఇబ్బందులు
ప్రచార కార్యక్రమాల్లో కమీషన్ల వ్యవహారాలు?
మిస్ యూకే వ్యాఖ్యలతో పోయిన పరువు!
ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన వ్యవహారం
నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు కమిటి?
Miss World 2025:
ప్రపంచవ్యాప్తంగా మిస్ వరల్డ్ పోటీలకు క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటి పోటీలు తెలంగాణలో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్నారనగానే రాష్ట్రం పేరు ఓ లెవెల్లో మార్మోగుతుందని అంతా అనుకున్నారు. ప్రభుత్వం కూడా అలాగే ఆలోచించి ఏర్పాట్లు చేసింది. కానీ, పలు విషయాల్లో అధికారుల తీరు ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తున్నది. తాజాగా మిల్లీ మ్యాగీ వ్యవహారంతో ఇప్పటిదాకా జరిగిన విషయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.
Read Also- OG Release Date: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ రిలీజ్ డేట్ కూడా ఫిక్సయింది.. ఎప్పుడంటే?
స్పాన్సర్ల విషయంలో..
అందాల పోటీల్లో పాల్గొనేందుకు 112 దేశాలకు చెందిన భామలు హైదరాబాద్కు వచ్చారు. వారికి సంబంధించిన వసతులు, బస, మౌలిక సదుపాయాల ఖర్చు భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇదే క్రమంలో రూ.25 కోట్ల దాకా ఆదాయం వస్తుందని భావించింది. చివరకు స్పాన్సర్లు ముందుకు రాక, వచ్చినవారిని అధికారులు వెయిట్ చేయించి పంపించడంతో ప్రభుత్వానికి అదనపు భారం తప్పలేదు. ఏప్రిల్ 27 వరకు స్మితా సబర్వాల్ టూరిజం డైరెక్టర్ హోదాలో మిస్ వరల్డ్ పనులను చూసుకున్నారు. ఆ సమయంలో స్పాన్సర్ల విషయంలో ఆమె ఫెయిల్ అయ్యారు. ఎస్బీఐ బ్యాంకు అధికారులకు విసుగు వచ్చేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో టూరిజం ఈడీగా పని చేసిన విజయ్ తీరు కూడా అలాగే ఉండడంతో స్పాన్సర్లు ఎవరూ ముందుకు రాలేదు.
షెడ్యూల్లో లేకుండా కార్యక్రమాలు
నిధుల విషయంలో అడ్డంకులు ఉన్నా కూడా ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది. నిర్వాహకులు కూడా స్పాన్సర్లను అందించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో షెడ్యూల్లో లేని కార్యక్రమాలను సడెన్గా నిర్వహించడం పోటీదారులను ఇబ్బందికి గురి చేసింది. ఇదే సమయంలో మిస్ యూకే మిల్లీ మ్యాగీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చౌమహుల్లా ప్యాలెస్ సందర్శన సమయంలో తనను వేశ్యలా చూశారని, అందుకే పోటీల నుంచి తప్పుకుంటున్నానని ఆమె చేసిన ప్రకటన ప్రతిపక్షాలకు ఓ అస్త్రంగా మారింది. అయితే, అధికారులు, నిర్వాహకులు ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.
విచారణకు ఆదేశించారా?
మిస్ యూకే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ పరువు తీసిందని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలపై వచ్చిన ఆరోపణల్లో నిజమెంతో తేల్చేందుకు డీజీ శిఖా గోయెల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆమెతోపాటు రమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నట్టు తెలుస్తున్నది. మొత్తంగా మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ మొదలు పలు విషయాల్లో అధికారులు ఫెయిల్ అయ్యారు. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేశారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది.
Read Also- Miss Indonesia: నంబర్ వన్ మిస్ ఇండోనేషియా.. ముగిసిన వరల్డ్ టాలెంట్ షో గ్రాండ్ ఫైనల్!