Miryalaguda: రూ.245 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన
ఇరిగేషన్ పనులకు రూ. 101 కోట్లు
రూ. 250 కోట్లతో రోడ్డు నిర్మాణాలు
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి
నలగొండ, స్వేచ్ఛ: ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు మిర్యాలగూడ (Miryalaguda) నియోజకవర్గ డెవలప్మెంట్పై ఫోకస్ చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) వెల్లడించారు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని కాల్వపల్లి వద్ద రూ. 74 కోట్లతో శెట్టి పాలెం నుంచి అవంతీపురం మీదుగా వెళ్లే రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించే పనులు ప్రారంభించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో రూ.171.5 కోట్లతో కలిపి 245 కోట్లతో చేపట్టనున్న సీసీ, బీటీ, ఇతర అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన, కేఎన్ఎ డిగ్రీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.7.25 కోట్లతో నిర్మించిన అదనపు భవనాలను స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్తో కలిసి ప్రారంభించారు.
అనంతరం స్థానిక ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ముందుగా మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. గత ప్రభుత్వం పదేళ్లలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. నియోజకవర్గంలో సాగర్ ప్రధాన ఎడమ కాలువ మెయిన్ కెనాల్ లైనింగ్కు రూ. 57 కోట్లతో పాటు దుబ్బ తండ, శాంతినగర్, రావులపెంట వద్ద చెక్ డ్యామ్లు, ఫీడర్ ఛానల్ను నిర్మించేందుకు రూ.44 కోట్లతో మొత్తం 101 కోట్లను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ఉందన్నారు.
అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో విలేజ్ టూ మండల కేంద్రాలకు ఉండే రోడ్లను డబుల్ రోడ్లుగా (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) పద్ధతిలో నిర్మించేందుకు రూ. 250 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో రూ. 800 కోట్లతో చేపట్టనున్న రోడ్లకు టెండర్లను పిలుస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 65 వేలకోట్లతో రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ – విజయవాడ రోడ్డును రూ.10,500 కోట్లతో, హైదరాబాద్- చిట్యాల రహదారిని రూ. 7వేల కోట్లతో నిర్మించనున్నట్లు వెల్లడించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడారు. ఇరిగేషన్ పనులకు, రోడ్డు నిర్మాణాలకు నిధులు కేటాయించిన మంత్రులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. మంత్రులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
ఏరియా ఆస్పత్రి ఫ్రీజర్ బాక్స్కు రూ. 25 లక్షలు
మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో ఫ్రీజర్ బాక్స్ ఏర్పాటుకు రూ. 25 లక్షల చెక్కును మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ మంత్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, డీఎస్పీ రాజ శేఖర రాజు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఆర్అండ్ బీ ఈఈ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఉన్నారు.
Read Also- Dhandoraa Teaser: హైదరాబాద్, అమెరికా.. యాడికైనా బో.. చస్తే ఇడీకే తేవాలె!
