KRMB: కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనల రూపంలో వినిపించడంతో పాటు భవిష్యత్తులో న్యాయమైన వాటాను దక్కించుకోడానికి అనుసరించాల్సిన వ్యూహంపై లీగల్ టీమ్కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఢిల్లీలోని కృష్ణా ట్రిబ్యునల్ ముందు జరిగే విచారణను దృష్టిలో పెట్టుకుని సీనియర్ న్యాయవాది వైద్యనాధన్ సహా రాష్ట్రానికి చెందిన అడ్వొకేట్లతో జలసౌధలో ఆదివారం సమీక్ష నిర్వహించారు.
కృష్ణా జలాల వాటా కేవలం అంకెలు మాత్రమే కాదని, రాష్ట్రానికి ఉన్న హక్కు అని నొక్కిచెప్పారు. ఇరిగేషన్ రంగంలో మౌలిక సదుపాయాలను పెంపొందించుకోవడం, లీగల్ చిక్కుల్ని అధిగమించడం, పరివాహక ప్రాంతం, రైతాంగం సాగునీటి అవసరాలు, నైసర్గిక స్వరూపం, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, వాటికి చేయాల్సిన కేటాయింపులు తదితరాలపై వివరించారు.
Also read: CPM Party: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ.. 85 మందితో కేంద్ర కమిటీ ఎన్నిక!
ఇప్పటివరకు ట్రిబ్యునల్లో వినిపించిన వాదనల నేపథ్యం గురించి న్యాయవాదులు మంత్రికి వివరించారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా, చట్టబద్ధంగా కేటాయించాల్సిన అవసరం తదితరాలపైనా ట్రిబ్యునల్ విచారణల్లో వెలిబుచ్చామని తెలిపారు. ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే వాదనల్లో లేవనెత్తాల్సిన అంశాలపైనా సూచనలు చేశారు.
అవసరమైతే న్యాయవాదులకు అందుబాటులో ఉండేలా స్వయంగా తాను కూడా ఆ సమయంలో ఢిల్లీలో ఉంటానని భరోసా కల్పించారు. లీగల్ టీమ్కు అవసరమైన అన్ని రకాల్ ఇన్పుట్స్ తో పాటు ఢిల్లీలో వసతి సౌకర్యాలను కల్పించాల్సిందిగా సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదంలో తెలంగాణ హక్కుల్ని పొందడంలో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి స్పష్టమైన అభిప్రాయం ఉన్నదని, దీర్ఘకాలంగా రాష్ట్రం అన్యాయానికి గురైనందున ఇకపైన ఎట్టి పరిస్థితుల్లో అది కంటిన్యూ కారాదని న్యాయవాదులకు మంత్రి నొక్కిచెప్పారు.