Thummala Nageswara Rao: ఏడాదికి రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సచివాలయంలో ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 2.74 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, ఇందులో 73,696 మంది రైతులు భాగస్వామ్యమయ్యారని తెలిపారు. 2021-22నుంచి ఇప్పటి వరకు 2.28 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1.25లక్షల ఎకరాల లక్ష్యం నిర్ధేశించగా, ఇప్పటివరకు 31,158 ఎకరాల్లో మాత్రమే సాగు జరిగినట్టు చెప్పారు. మార్చి నాటికి మిగిలిన 93,842 ఎకరాలు సాగులోకి రావాల్సి ఉందని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగుకు 12లక్షలకు పైగా అనువైన భూమి ఉందన్నారు.
6.54 లక్షల ఎకరాల లక్ష్యం
వచ్చే నాలుగేళ్లపాటు ప్రతి ఏడాది రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పని చేయాలని ఆదేశించారు. మూడేళ్లల్లో 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగుతో తెలంగాణ దేశంలోనే ఆయిల్ పామ్ ఉత్పత్తిలో మొదటి రాష్ట్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి 6.54 లక్షల ఎకరాల లక్ష్యం కేటాయించగా, కేవలం 2.28 లక్షల ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చిందన్నారు. ఆయిల్ పామ్ విస్తరణలో నిర్లక్ష్యం వహించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తక్కువ పురోగతి ఉన్న జిల్లాలుగా వరంగల్, నారాయణపేట, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, గద్వాల్, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలను గుర్తించినట్టు తెలిపారు. ఈ జిల్లాల్లో ఆయా కంపెనీలు లక్ష్యాలకు అనుగుణంగా వేగంగా పనిచేయాలని ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణలో కంపెనీలు మరింత బాధ్యతతో వ్యవహరించాలన్నారు.
రైతులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండాలి
ప్రతి కంపెనీ తమ పరిధిలోని జిల్లాల్లో సరిపడా సిబ్బందిని నియమించుకొని, రైతులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండాలని సూచించారు. తోటల యాజమాన్యంలో నీటి వినియోగం, ఎరువుల పంపిణీ, అంతర పంటలు, కలుపు నివారణ వంటి అంశాలపై పూర్తి దృష్టి సారించాలని చెప్పారు. కొత్త తోటలలో గెలల దిగుబడులు తగ్గకుండా పర్యవేక్షణ చేయడం, విజయవంతమైన రైతుల అనుభవాలను కొత్త రైతుల ప్రోత్సాహానికి వినియోగించడం అవసరమన్నారు. తక్కువ ఎత్తు, తక్కువ ఆకు పొడవు, అధిక దిగుబడి ఇచ్చే కొత్త వేరైటీ మొలకలను దిగుమతి చేసుకోవాలని, రాబోయే ఏడాదికి ఆయిల్ పామ్ మొక్కల డిమాండ్ పెరగనున్నందున ప్రతి కంపెనీ తన లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలను ఏర్పాటు చేసుకొని, నాణ్యమైన మొక్కలు రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు.
ప్రణాళికలు సిద్ధం చేయాలి
వచ్చే ఏడాది కల్లా ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఆయిల్ పామ్ విస్తరణలో వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్, సహకార శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతుల సందేహాల నివృత్తి కోసం కంపెనీలు తమ పరిధిలో రైతు సలహా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, రైతు వేదికల కార్యక్రమాల్లో కంపెనీ ప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొని రైతులతో చర్చించాలని ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణలో విజయవంతమైన రైతులను ప్రతి రైతువేదిక కార్యక్రమంలో మాట్లాడించేందుకు ప్రయత్నించాలన్నారు. వచ్చే సంవత్సరానికల్లా ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఆయిల్ పామ్ విస్తరణలో వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్, సహకార శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలి
తక్కువ పురోగతి ఉన్న జిల్లాలపై ఉద్యానశాఖ సీనియర్ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని, ప్రతి జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా విస్తరణ కార్యక్రమాలు జరిగేటట్టు మార్గదర్శనం చేయాలన్నారు. నర్మెట్ట (సిద్దిపేట)లో ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ 30-120 టన్నుల సామర్థ్యంతో నవంబర్ 2025లో, పెద్దపల్లి జిల్లాలో తిరుమల ఆయిల్ ఫ్యాక్టరీ 15 టన్నుల సామర్థ్యంతో జనవరి 2026లో, ఖమ్మంలో గోద్రేజ్ అగ్రోవెట్ ఫ్యాక్టరీ 15-60 టన్నుల సామర్థ్యంతో జనవరి 2026లో, వనపర్తిలో ప్రీ యూనిక్ ఫ్యాక్టరీ 15-30 టన్నుల సామర్థ్యంతో ఫిబ్రవరి 2026లో, కల్లూరు గూడెం (ఖమ్మం)లో ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ 15-60 టన్నుల సామర్థ్యంతో జూన్ 2026లో, బీచుపల్లి (గద్వాల్)లో ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ 15 టన్నుల సామర్థ్యంతో జూన్ 2026లో, ములుగు జిల్లాలో కె.ఎన్ బయో సైన్సెస్ ఫ్యాక్టరీ 10 టన్నుల సామర్థ్యంతో ఆగస్టు 2026లో ప్రారంభం కానున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులు, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.
Also Read: Thummala Nageswara Rao: మొoథా తుఫాన్ నేపథ్యంలో.. పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి తుమ్మల
