Bhu Bharathi Portal: రాష్ట్రంలో అందరి భూములకు భద్రత కల్పించడమే ప్రధాన ధ్యేయంగా భూ భారతి చట్టాన్ని (Bhu Bharathi Act) , భూభారతి పోర్టల్ (Bhu Bharathi Portal)ను అందుబాటులోకి తెస్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) వెల్లడించారు. ఆదివారం ఆయన సచివాలయంలోని తన ఛాంబర్లో మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్ .అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఈ భూభారతి చట్టాన్ని, పోర్టల్ను ప్రజలకు అంకితం చేస్తారని తెలిపారు.
ఆందోళన వద్దు
రాష్ట్రంలో రైతుల భూముల పరిరక్షణ బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ‘అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని మేమిచ్చిన హామీని విశ్వసించి ప్రజలు మాకు అధికారం కట్టబెట్టారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ధరణిని బంగాళాఖాతంలో వేసి అందరికీ ఆమోదయోగ్యమైన భూ భారతి చట్టాన్ని తీసుకురావడం ఇందులో రెవెన్యూశాఖ మంత్రిగా తనకు భాగస్వామ్యం అయ్యే అవకాశం వచ్చినందుకు తన జన్మ ధన్యం’ అన్నారు.
3 మండలాల్లో అమలు
రాష్ట్రంలో తొలుత మూడు జిల్లాలలోని మూడు మండలాలలో ప్రయోగాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలు చేయబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మూడు మండలాలలో వచ్చిన ఫలితాలను దృష్టిలో పెట్టుకొని జూన్ 2వ తేదీ నాటికి పూర్తిస్ధాయిలో అమలు చేస్తామని తెలిపారు. భూభారతి చట్టం 2029 శాసనసభ ఎన్నికలకు మాకు రిఫరెండమని గతంలో శాసనసభలోనే ప్రకటించడం జరిగిందని అన్నారు. ఇప్పుడు కూడా మరో మారు స్ఫష్టం చేస్తున్నానని తెలిపారు. భూములపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి ఒక భరోసా , భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ చట్టం రూపొందించినట్లు చెప్పారు.
గతంలో చెప్పినట్లే..
గతంలో మాదిరిగా రాత్రికి రాత్రే ఇద్దరు వ్యక్తులు కలిసి చట్టాన్ని రూపొందిస్తే మా ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రైతులు, మేధావులు, నిపుణులతో చర్చించి చట్టాన్ని రూపొందించిందని మంత్రి అన్నారు. గతంలో చెప్పినట్లుగానే భూ భారతి అమలులోకి వచ్చిన తర్వాత ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామని తెలిపారు.
Also Read: Fire Accident: ఏపీలో భారీ పేలుడు.. గాల్లోకి ఎగిరిపడ్డ శరీర భాగాలు.. ఎక్కడంటే!
అలా చేస్తే చర్యలు
అయితే ఒకేసారి భూ యజమానులు తమ భూమి వివరాలు తెలుసుకునేందుకు పోర్టల్ను సందర్శించవద్దని మంత్రి పొంగులేటి విజ్ఞప్తి చేశారు. దీనివలన మొత్తం పోర్టల్ ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. అంతేగాక కొంతమంది ఉద్దేశ పూర్వకంగా పోర్టల్ను స్టక్ చేయాలని భావిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి.. పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారు.
స్వయంగా పర్యటిస్తా
మే మొదటివారంలో గ్రామ రెవెన్యూ పాలనా అధికారులను అమలులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో ధరణిని తీసుకువచ్చిన సమయంలో దాదాపు 4 నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని ఇప్పుడు ఆ పరిస్ధితి లేకుండా క్రమ క్రమంగా పోర్టల్ను అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. అటు భూభారతి చట్టం, పోర్టల్ కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో స్వయంగా తాను పర్యటిస్తామని మంత్రి తెలిపారు. అదేవిధంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహనా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.