Ponguleti Srinivasa Reddy: హౌసింగ్ బోర్డు భూములు పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. హౌసింగ్ బోర్డు భూములపై సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. హౌసింగ్ బోర్డు భూముల లీజు, అగ్రిమెంట్లు, కోర్టు కేసులు, అద్దెలు తదతర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఒకవైపు భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే మరో వైపు లీజు, కమర్షియల్, అద్దెలు, రెగ్యులరైజేషన్ తదితర అంశాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
షాపును రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది
నిజాం కాలం నుంచి 115 సంస్థలకు హౌసింగ్ బోర్డు భూములను లీజుకు ఇచ్చినట్లు చెప్పారు. ఇందులో ప్రధానంగా ఇనిస్ట్యూషన్స్, రెసిడెన్షియల్, కమర్షియల్, స్కూల్స్, టెంపుల్స్ తదితరాలు ఉన్నాయని , ఏడు స్థలాలకు సంబంధించి కోర్టు కేసులు, అలాగే అద్దెబకాయిలు ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. లీజు అగ్రిమెంట్ పునరుద్ధరణ చేసుకుని సంస్థలకు హౌసింగ్ బోర్డు తరపున లేఖలు రాసి వాటి రెగ్యులరైజేషన్కు అవకాశం ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో హౌసింగ్ బోర్డుకు వివిధ ప్రాంతాల్లో 301 కమర్షియల్ షాపులు ఉండగా 2007లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మేరకు 14 మంది షాపులు కొనుగోలు చేయగా మిగిలిన 287 షాపులకు గాను 62 షాపులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయని, హౌసింగ్ బోర్డు నిబంధనల ప్రకారం ప్రతి షాపు యజమాని ప్రతి ఏడాది 10 శాతం అద్దెను పెంచుతూ షాపును రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలి
అయితే ఈ నిబంధన అమలు కాకపోవడంతో షాపు యజమానుల నుంచి హౌసింగ్ బోర్డుకు కోట్లాది రూపాయిలు రావాల్సి ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి ప్రస్తుతం షాపులు నిర్వహిస్తున్నవారు ఆ షాపులను కొనుగోలు చేయడానికి ముందుకువస్తే మార్కెట్ ధర ప్రకారం విక్రయించడానికి అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు. అలాగే షాపు నిర్వహణకు అనువుగా లేకపోతే ఆ స్థలాన్ని వేలంలో విక్రయించాలని సూచించారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములు హౌసింగ్ బోర్డుకు చెందేలా పటిష్టమైన వాదన వినిపించేలా ప్రత్యేకంగా అడ్వకేట్ను నియమించుకోవాలని సూచించారు.
కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం
హౌసింగ్ బోర్డుల్లో గతంలో కేటాయించిన ఇండ్లకు పక్కనే ఉన్న వంద గజాల లోపు స్థలాలను ఆ ఇంటి యజమానికి ఆసక్తి ఉంటే విక్రయించాలని మంత్రి అధికారులకు స్పష్టంచేశారు. అలాగే గతంలో ఇంటి కోసం హౌసింగ్ బోర్డు కేటాయించిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పక్కనే ఉన్న వంద గజాల లోపు స్థలాన్ని కూడా కొనుగోలు చేసుకుంటే మొత్తం స్థలానికి రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించాలని సూచించారు. మార్కెట్ ధర, సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ కార్డు విలువ వంద గజాల లోపు స్థలాల వివరాలు, రిజిస్ట్రేషన్ కాని ప్లాట్ల వివరాలు, రిజిస్ట్రేషన్ చేసుకొని పక్కనే ఉన్న వంద గజాల్లోపు స్థలాన్ని అడుగుతున్నవారి వివరాలు తదితర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక తయారుచేయాలని అధికారులకు సూచించారు. వీటన్నింటిపై కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్, సీఈ వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

