Gadwal District: రెవెన్యూ ఆఫీసర్లు, బ్రోకర్లు కుమ్మక్కై కోట్ల ప్రాపర్టీని కొట్టేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లో వెలుగులోకి వచ్చింది. గద్వాల పట్టణ శివారులోని సర్వేనెంబర్ 868/బి లో 16 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంను వెంచర్ చేసి ప్లాట్లు చేసి అమ్మారు. నాలుగు ఎకరాలు అప్పటి ఓనర్ శారద నుండి సేల్ కం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ తో ఖలీల్, సలీంలకు విక్రయించారు.ఆ సేల్ డిడి తోనే ప్లాట్లు కూడా చేసి అమ్మేశారు. ప్లాట్ చేసి అమ్మేసిన పొలాన్ని ఇప్పుడు విరాసత్ చేయడం జిల్లాలోకలకలం రేపుతోంది. గతంలో ఇదే భూమిని కొట్టేసేందుకు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ డిజిటల్ కీ మిస్ యూస్ చేయడంతో అప్పట్లో కేసు నమోదయింది. అప్పటినుంచి బ్లాక్ లిస్ట్ లో పెట్టిన సర్వే నంబర్ ను రీఓపెన్ చేసి మళ్లీ ఇప్పుడు అదే సర్వే నంబర్ ను విరాసత్ చేయడంతో అందులో ప్లాట్లు కోనుగోలు చేసిన 273 మంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మొత్తం 16 ఎకరాలు
గద్వాల పట్టణ పరిధిలోని సర్వే నంబర్ 868లో మొత్తం 16 ఎకరాల భూమి ఉన్నది. 868/ ఏ అబ్దుల్లా పేరుపై ఎకరా ఖాజా హుస్సేన్ పేరుపై 868/ ఏ లో 2.20 ఎకరాలు, హుస్సేన్ బి868/ఏ లో ఒక ఎకరా, బాబు సాబ్ 868/ ఏ1.10 ఎకరాలు, ఉస్మాన్ సాబ్ పేరుపై 868/ఏ 1.10 ఎకరాలు, ఖాజా హుస్సేన్ పేరు పై 868/సి లో నాలుగు ఎకరాలు, శారద పేరుపై 868/ బి నాలుగు ఎకరాల భూమి ఉన్నది. మొత్తం 16 ఎకరాలలో 2008 నుంచి 2010 మధ్యలో ప్లాట్లుగా చేసి విక్రయించారు.
Also Read: Gadwal District: గ్రామాల్లో జోరందుకున్న ప్రచారం.. అభివృద్ధికై బుజ్జగింపులు ప్రలోభాలు బేరసారాలు
నాలుగు ఎకరాలు సేల్ డిడి ద్వారా అమ్మకాలు
శారద పేరుపై 868/ బి లో ఉన్న నాలుగు ఎకరాల పొలాన్ని 9/2005 సేల్ కం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేసుకుని 20/6/ 2005లో ఖలీల్ సలీం లు ఆ నలుగు ఎకరాల పొలాన్ని ప్లాట్లుగా శారద ఏజెంట్లు గా ఉంటూ అమ్మకాలు సాగించారు. మొత్తం పాటలను 2010 వరకు అమ్మేశారు. వాటిలో కొందరు ఎల్ ఆర్ ఎస్ కూడా కట్టుకున్నారు. మరికొందరు ఇండ్ల కోసం పర్మిషన్లు తీసుకున్నారు. అదేవిధంగా టీపాసులు ద్వారా కూడా పర్మిషన్లు తీసుకొని ఇండ్ల నిర్మాణాలు కూడా చేపట్టారు.
గతంలో డిజిటల్ కీ మిస్ యూస్
2010 వరకు అమ్మకాలు జరగగా ఆ తర్వాత ధరణి పోర్టల్ రావడంతో మళ్లీ గతంలో ఉన్న ల్యాండ్ ఓనర్ పేరుపై రెవెన్యూ రికార్డులలో పొలం ఉండడంతో దానిపై అక్రమార్కుల కన్ను పడింది. దీంతో 2017 లో కలెక్టరేట్ లోని కొందరు ఆఫీసర్లు, కాంటాక్ట్ ఎంప్లాయిస్ కుమ్మక్కై డిజిటల్ కిని మిస్ యుజ్ చేసి పాస్ బుక్ రిలీజ్ చేశారు. దీంతో అప్పట్లో బాధితులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ తో పాటు పాస్ బుక్ తీసుకున్న వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది. రెవిన్యూ ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. ఆ సర్వే నంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టేశారు.
గోప్యంగా విరాసత్
గద్వాల తహసిల్దార్ అడ్డాగా మళ్లీ ఇప్పుడు బ్లాక్ లిస్టులో ఉన్న 868/ బి సర్వే నెంబర్ ను రీఓపెన్ చేసి గుట్టు చప్పుడు కాకుండా పది రోజుల కిందట ఆ సర్వే నెంబర్ లోని నాలుగు ఎకరాల పొలాన్ని శారద వారసులకు విరాసత్ చేయడంతో మళ్లీ వివాదం మొదటికి వచ్చింది. అందులో ప్లాట్లుకొన్నవారు ఆందోళనకు గురవుతున్నారు. బ్లాక్ లిస్టులో ఉన్న సర్వే నంబర్ ను ఎలా విరాసత్ చేశారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ ఆఫీసర్లు పెద్ద ఎత్తున డబ్బులు దండుకొని తమకు అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు.
భూ యజమాని ఎవరో విచారణ చేపడతాం
బ్లాక్ లిస్టులో ఉన్న సర్వే నంబర్ ను విరాసత్ చేసిన దానిపై ఎంక్వయిరీ చేస్తాం. ఆ సర్వే నెంబర్ కు సంబంధించి ల్యాండ్ ఓనర్ ఎవరో ఎంక్వయిరీ చేసి గుర్తిస్తాము. తప్పు జరిగినట్టు నిరూపణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్లాట్లు కొన్న వారికి కూడా అన్యాయం జరగనివ్వం.
లక్ష్మీనారాయణ, అడిషనల్ కలెక్టర్, గద్వాల.
Also Read: Gadwal District: కొత్త వైన్స్ కు పంచాయతీ కిక్క.. ఈ నెల మొత్తం ఎన్నికల మయం!

