Revanth Vs KTR: కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీ పాట
దాని వెనుకున్న అసలు కథ ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమైంది
సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్లు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణలోని (Telangana) నందమూరి తారక రామారావు (Sr NTR), చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) అభిమానులు బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ (BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Revanth Vs KTR) స్పందించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, అసాంఘిక చర్యలను, నేరాలను ప్రోత్సహించేలా మాట్లాడటం అన్యాయమని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగానే కాకుండా హోంమంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చేయాలని పిలుపునివ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్ల కాలంలో లా అండ్ ఆర్డర్ నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో, నేడు అరాచక పర్వానికి ద్వారాలు తెరిచేవారు అధికారంలో ఉండటం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండాపై ఉన్న చెక్కుచెదరని అభిమానాన్ని చూసి ముఖ్యమంత్రికి మైండ్ బ్లాక్ అయ్యిందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
Read Also- Hyderabad Traffic: హైదరాబాద్ ట్రాఫిక్ చిక్కులకు.. యువ ఐపీఎస్లతో చెక్.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!
కేవలం రెండేళ్ల కాలంలోనే అట్టర్ ఫ్లాప్ పాలనతో ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్న రేవంత్ రెడ్డికి పూర్తిగా మతిభ్రమించిందనే విషయం సభ సాక్షిగా తేలిపోయిందని కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే చురుగ్గా స్పందించి అరెస్టులు చేసే పోలీసు శాఖ, రాష్ట్ర డీజీపీ , ముఖ్యమంత్రి చేసిన ఈ తీవ్రమైన హింసను ప్రేరేపించే వ్యాఖ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందని అన్నారు.
తెలుగు దేశం పాట కుట్ర అర్థమైంది
కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీ పాట పాడటం వెనుక ఉన్న అసలు కుట్ర ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమైందని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. గత రెండేళ్లుగా తన పాత బాసు ఆదేశాల మేరకే తెలంగాణకు తీరని నష్టం చేసేలా జలహక్కులను రేవంత్ రెడ్డి కాలరాశారని, ఇవాళ ఆయన చేసిన ప్రకటనతో నిజస్వరూపం బట్టబయలైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోయే నావ అని అర్థం కావడంతోనే, రేవంత్ రెడ్డి ఏ క్షణమైనా దాని నుంచి బయటకు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక ఒకవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకుంటూ, మరోవైపు తెలంగాణ ప్రజలు తిరస్కరించిన టీడీపిని తిరిగి ఈ గడ్డపైకి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి పన్నాగం పన్నుతున్నారని, దీనిని నాలుగు కోట్ల తెలంగాణ సమాజం తప్పకుండా తిప్పికొడుతుందని హెచ్చరించారు. నీళ్ల నుంచి మొదలుకొని నిధులు, నియామకాల వరకూ తెలంగాణ ప్రయోజనాలను పాతాళంలోకి నెట్టిన కోవర్టు రాజకీయాలకు, రాష్ట్రానికి చేసిన ద్రోహానికి ముఖ్యమంత్రి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
Read Also- AR Rahman: ఎవరినీ బాధపెట్టాలని కాదు.. వెనక్కి తగ్గిన రెహమాన్.. వీడియో వైరల్!

