KTR criticises Congress: దశాబ్దాల పాటు తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్
అన్ని రంగాల్లో ప్రభుత్వం అట్టర్ ప్లాప్
రుణమాఫీపై మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరితీయాలి
దోచుకోవడం దాచుకోవడం తప్ప ఈ ప్రభుత్వం తెలిసిందేమీ లేదు
తెలంగాణకు జరిగిన ద్రోహానికి పరిపూర్ణమైన బాధ్యత కాంగ్రెస్దే
దేవాదుల ఏ బేసిన్లో ఉందని అడిగిన వ్యక్తి ఇరిగేషన్ గురించి వ్యాఖ్యలా?
ఇరిగేషన్లో ద్రోహం చేసిందే కాంగ్రెస్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: దశాబ్దాల పాటు తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు, కొనసాగుతున్న అన్యాయాల పరంపర, వాటి వల్ల తెలంగాణ ఎదుర్కొన్న నష్టాలను వివరంగా ప్రజల ముందుంచే ప్రయత్నమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉద్దేశమని (KTR criticises Congress) ఆయన అన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మాట్లాడారు. మాట తప్పిన హామీలకు లెక్క వేస్తే కాంగ్రెస్ నాయకులను ఎన్నిసార్లు ఉరితీయాలో కూడా తెలియదన్నారు. అశోక్ నగర్ అడ్డా మీద ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చని రాహుల్ గాంధీపై, రైతు రుణమాఫీ హామీ అమలు చేయని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హామీ తప్పించినందుకు కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజలు తీర్పు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
420 హామీల ఎగవేతకు 420 సార్లు కాంగ్రెస్ను ప్రజలు శిక్షించాల్సిన పరిస్థితి వచ్చిందని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డికి తిట్టడం తప్ప మరో భాష రాదని, కాని తాము కావాలంటే మూడు నాలుగు భాషల్లో సమాధానం చెప్పగల శక్తి ఉందన్నారు. ఐఐటీకి, ఐఐఐటికి తేడా తెలియదని, బచావత్ ట్రిబ్యునల్కు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తేడా తెలియని అజ్ఞానం ఉన్న వ్యక్తి తెలంగాణ భవితవ్యంపై మాట్లాడటం హాస్యాస్పదమని కేటీఆర్ విమర్శించారు.
కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ అంటే ఏమిటో కూడా తెలియని వ్యక్తికి తెలంగాణకు ఏం కావాలో ఎలా తెలుస్తుందన్నారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఇంకేమీ తెలియని అజ్ఞాని, ఉష్ట్రపక్షి పాలన ఇది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటికే వందలాది రైతులు, ఆటో డ్రైవర్లు, గురుకుల విద్యార్థులు, నేతన్నలు ప్రాణాలు కోల్పోయారని, ఈ ప్రాణాలకు ఎవరు సమాధానం చెప్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వాదులపై తుపాకీ ఎత్తిన చరిత్రను ప్రజలు మర్చిపోలేదన్నారు. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వికృతమైన మాటలతో కేసీఆర్ స్థాయిని తగ్గించలేడని స్పష్టం చేశారు.
నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నది కేవలం నేటి సమస్య కాదని, నిజాం కాలం తర్వాత 65 ఏళ్ల కాంగ్రెస్ పాలన, ఆపై 17 ఏళ్ల చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ పాలనలోనే ఈ ద్రోహం జరిగిందని గుర్తుచేశారు. 2014 వరకు రాష్ట్రాన్ని నిరాటంకంగా పాలించిన కాంగ్రెస్, టీడీపీ పార్టీలే ఈ అన్యాయాలకు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే నదీ జలాల్లో తెలంగాణకు జరిగిన ద్రోహాన్ని ఎలా సరిచేయాలనే ప్రయత్నాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎలా చేసిందో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల ముందుంచామని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటం ఆగదని, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, అహంకారం, ద్రోహపూరిత విధానాలను ప్రజల ముందు నిరంతరం ఎండగడతామని స్పష్టం చేశారు. రైతుబంధు వంటి మానవీయ పథకాలు ప్రవేశపెట్టి రైతులకు అండగా నిలిచిన కేసీఆర్పై అనరాని మాటలు అనడం దుర్మార్గమన్నారు. అహంకారంతో, ద్వేషంతో మాట్లాడటం తెలంగాణ ప్రజల గుండెలను రగిలిస్తోందన్నారు.
Read Also- Narsa Reddy Slams KCR: గజ్వేల్ పెండింగ్ పనుల పూర్తి బాధ్యత కేసిఆర్దే.. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సంచలన ఆరోపణలు!
నదీ జలాలపై చర్చ పెట్టిన ముఖ్యమంత్రికి అసలు బేసిన్ల అర్థమే తెలియదని విమర్శించారు. దేవాదుల ఏ బేసిన్లో ఉందో కూడా తెలియని వ్యక్తి ఇరిగేషన్పై ఉపన్యాసాలు ఇవ్వడం విడ్డూరమన్నారు. వడ్డేపల్లి పంప్ హౌస్ మునిగిపోయినా చర్యలు లేవని, ఎస్ ఎల్ బి సి టన్నెల్ కూలి ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినా ఇప్పటికీ శవాలను వెలికి తీయలేని అసమర్థత ఈ ప్రభుత్వ పాలనకు నిదర్శనమన్నారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలినప్పుడు నిర్మాణ సంస్థను బ్లాక్లిస్ట్ చేయాలని అధికారులే సూచించినా అమలు చేయలేని అశక్తతను ఎండగట్టారు.ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ఒక్క మాటలో చెప్పాలంటే పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలే తప్ప అభివృద్ధి లేదన్నారు. పేదల ఇళ్లను కూల్చడం తప్ప ఒక్క ఇల్లు కూడా కట్టని ప్రభుత్వం ఇదని ధ్వజమెత్తారు. అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్, సర్వే సర్వత్రా విఫలమైన సర్వభ్రష్ట ప్రభుత్వం ఇదేనని, అలాంటి ప్రభుత్వానికి అధినేతగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర దౌర్భాగ్యమన్నారు. ఇరిగేషన్ పై తెలంగాణకు ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు

