KTR on Congress: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ (CM Revanth Reddy) సహా రాష్ట్ర మంత్రులపై విరుచుకుపడ్డారు. పాలన చేతగాక గత 17 నెలలుగా ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలను ప్రభుత్వం ఆడుతోందని విమర్శించారు. కమిషన్లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలో నేరుగా కాంట్రాక్టర్లు ధర్నా చేయడం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోందని కేటీఆర్ అన్నారు.
కమిషన్ లేనిది పనులు జరగడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే స్వయంగా చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కమిషన్ల పాలన నడుస్తోందని.. ప్రజల పాలన కాదని ఆరోపించారు. SLBC టన్నెల్ కూలి.. 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. ఈ ఘటనకు సంబంధించి సహాయక చర్యలు చేపట్టే తెలివి కూడా సీఎంకు లేకపోయిందా? అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మీ కమిషన్ల అరాటంలో పడి మృతదేహాలను వెలికితీయడానికి కూడా సాహసం చేయలేకపోయారా? అంటూ నిలదీశారు. టన్నెల్ లో ఏం జరిగిందో ఇప్పటికీ చెప్పలేని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని మండిపడ్డారు.
నల్గొండలో సుంకిషాల ప్రాజెక్ట్ కూలిందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని బలిగొంటున్నారని విమర్శించారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయని.. నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదని కేటీఆర్ అన్నారు. మీరు ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం ఇదని మండిపడ్డారు. తులం బంగారం ఏమైంది? 4 వేల రూపాయల పింఛన్లు ఏమయ్యాయి? అంటూ నిలదీశారు.
Also Read: National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు.. రాహుల్, సోనియాపై ఈడీ సంచలన ఆరోపణలు
కాళేశ్వరానికి సంబంధించి మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా అవి దూది పింజల్లా ఎగిరిపోతాయని కేటీఆర్ అన్నారు. రాష్ట్రం ప్రభుత్వం చేసేవన్ని చిల్లర ప్రయత్నాలు మాత్రమేనని మండిపడ్డారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రజలు తిరగబడే రోజులు ప్రస్తుతం రాష్ట్రంలో వచ్చాయని అన్నారు.
