Kodanda Reddy: పత్తి రైతుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని రైతు కమిషన్ గవర్నర్ ను కోరింది. రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తో రైతు కమిషన్ బృందం భేటీ అయ్యింది.రాష్ట్రంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గవర్నర్ కు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాములు నాయక్, భవానీ రెడ్డి, భూమి సునీల్ వివరించారు. రాష్ట్రంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ ) పత్తి కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా తెరిచిందని, పత్తి రైతులు పత్తి అమ్ముకోవాలన్నా కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ లో నమోదు చేసుకోవాలని నిబంధన పెట్టడంతో తెలియని రైతులు ఇబ్బందులు పడ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Kodanda Reddy: రైతులకు పక్కా రసీదులు ఇవ్వాలి.. రైతుకమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
పత్తి రైతుకు సీసీఐ నిబంధనలు పరేషాన్
ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటామని కండిషన్ పెట్టడంతో రైతుకు తలనొప్పిగా మారిందన్నారు. రాష్ట్రంలో 48 లక్షల ఎకరాల్లో పత్తి సాగైందని తెలిపారు. అధిక వర్షాలు, మొంథా తుఫాన్ వల్ల పత్తి రైతులు తీవ్ర నష్టపోయారని, అయినా ఇబ్బందులు ఎదుర్కొని సాగుచేసిన పత్తి రైతుకు సీసీఐ నిబంధనలు పరేషాన్ చేస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలోని పత్తి రైతుల నుంచి కమిషన్ కార్యాలయానికి నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయనితెలిపారు. కేంద్రం విడుదల చేసిన విత్తన చట్టం ముసాయిదా -2025 పై అభ్యంతరాలు ఉన్నాయన్నారు. పత్తి రైతుల విషయంలో కమిషన్ ఇచ్చిన వినతికి గవర్నర్ సానుకూలంగా స్పందించారు. సీసీఐ విషయంలో కేంద్రంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఇక విత్తన చట్టం ముసాయిదా విషయంలో వివరాలతో మరోసారి కలవాలని గవర్నర్ కోరినట్లు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు.

