Jagriti Janam Baata: జాగృతి జనంబాట (Jagriti Janam Baata) కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సోమవారం సత్తుపల్లిలోని జీవీఆర్ ఓపెన్ కాస్ట్ను సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులతో ఆమె మాట్లాడారు. సత్తుపల్లిలోని ఓపెన్ కాస్ట్ మైన్లో పర్మినెంట్ ఉద్యోగుల కన్నా, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ఎక్కువ మంది ఉన్నారని, వారిని పర్మినెంట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘‘కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కూడా పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తారు. వాళ్లకు కూడా పర్మినెంట్ కావాలి. సంస్థ లాభాల ఆర్జన మీద మాత్రమే దృష్టి పెట్టింది. కార్మికుల భద్రత, ఇన్సూరెన్స్, వారి ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. సింగరేణిలో పనిచేసే కార్మికులు, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కోసం హెచ్ఎంఎస్, జాగృతి కలిసి ఐక్య ఉద్యమాలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం డిపెండెంట్ ఉద్యోగాలు తెచ్చుకున్నాం. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో డిపెండెంట్ ఉద్యోగాలు లేకుండా చేసింది. డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాలి’’ అని కవిత డిమాండ్ చేశారు.
19న సింగరేణి భవన్ ముట్టడి
తమ డిమాండ్లతో ఈ 19న హెచ్ఎంఎస్, జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సింగరేణి భవన్ను ముట్డడిస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ‘‘పెద్ద ఎత్తున కార్మికుల పక్షాన పోరాటం చేస్తాం. కార్మికులకు ఇన్కం ట్యాక్స్ రద్దు చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ కారణంగా కార్మికులు పెద్ద ఎత్తున అమౌంట్ నష్టపోతున్నారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈ అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించాను. కానీ కేంద్రం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ అంశంపై దృష్టి పెట్టటం లేదు. ఐఎన్టీయూసీ లాంటి సంస్థలతో ఢిల్లీలో పరపతిని ఉపయోగించి కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు మేలు చేయాలి. ఇక్కడి ఏరియా హాస్పిటల్స్ నిర్వహణ ఆధ్వాన్నంగా మారింది. వెంటనే హాస్పిటల్స్లో అన్ని సౌకర్యాలను కల్పించాలి. ఆర్టీసీ కార్మికులకు ఉన్నట్లుగానే హైదరాబాద్లో సింగరేణి కార్మికుల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి. జాగృతి జనం బాటలో భాగంగా సింగరేణి ప్రాంతాలకు వచ్చినప్పుడు ‘బాయి బాట’ అనే కార్యక్రమం చేస్తున్నాం. సింగరేణి కార్మికుల్లో ధైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నాం’’ అని కవిత పేర్కొన్నారు.
Read Also- Dhandoraa Teaser: హైదరాబాద్, అమెరికా.. యాడికైనా బో.. చస్తే ఇడీకే తేవాలె!
సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన కవిత, వైరాలోని కూరగాయల మార్కెట్ను కూడా సందర్శించారు. అక్కడి వ్యాపారులు, రైతులతో ఆమె మాట్లాడారు. సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన రైతు సదస్సులో పాల్గొని మాట్లాడారు.
