Gummadi Narsaiah biopic:
కొత్తగూడెం: ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా (Gummadi Narsaiah biopic) నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి ఈ సినిమాను ప్రోత్సహించటం అభినందించాల్సిన విషయమని అన్నారు. అయితే, తమిళనాడు, కేరళ, హిందీ రాష్ట్రాలు రాయితీ ఇవ్వలేదంటూ చెబుతున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికి కూడా సౌత్ ఇండియన్, తెలుగు సినిమా మీద ఉన్న చులకన భావాన్ని ఈ పరిమాణం చూపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పటికైనా సరే సినిమా పెద్దలు, ముఖ్యంగా దిల్ రాజు గారు మిగతా భాషల్లో కూడా ఈ సినిమాకు రాయితీలు ఇప్పించేందుకు ప్రయత్నించాలి. మనమందరం గర్వించే ఈ సినిమాను ఒక పెద్ద సినిమాగానే భావించాలని నేను కోరుతున్నా. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో తీస్తుండటం మనస్ఫూర్తిగా అభినందించే విషయం. ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషించేందుకు శివ రాజ్ కుమార్ అంగీకరించటం ద్వారా సినిమాకు వన్నె వచ్చింది. ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎంతో మంది యువకులు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఈ సినిమా స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తున్నా’’ అని కవిత పేర్కొన్నారు.
Read Also- India vs South Africa: బాదుడే బాదుడు.. వైజాగ్ వన్డేలో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన భారత్
డైరెక్టర్ పరమేష్ మన కామారెడ్డి బిడ్డనే
‘గుమ్మడి నర్సయ్య మీద సినిమా తీస్తున్న డైరెక్టర్ పరమేష్ తమ్ముడు మన కామారెడ్డి బిడ్డనే’ అని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. ‘‘గుమ్మడి నర్సయ్య లాంటి గొప్ప వ్యక్తి మీద సినిమా తీస్తున్నాం. ఆ కార్యక్రమానికి రావాలని నన్ను కోరారు. మేము జాగృతి జనం బాటలో బిజీగా ఉన్నప్పటికీ సమయం తీసుకొని ఇక్కడకు రావటం జరిగింది. గుమ్మడి నర్సయ్య లాంటి వ్యక్తి మన తెలంగాణ బిడ్డ అని తలుచుకుంటేనే గర్వంగా ఉంది. అవినీతి రహిత, మానవత విలువలను కాపాడుతూ ప్రజలకు ఎలా సేవలు చేయాలో ఎప్పుడు మాట్లాడినా సరే… మనం గుమ్మడి నర్సయ్య గారినే ఆదర్శంగా తీసుకొని మాట్లాడుతాం. అందరికీ ఆదర్శప్రాయుడు. గుమ్మడి నర్సయ్య జీవితాన్ని సినిమా గా తీసే ప్రయత్నం చాలా గొప్పది. వారి చరిత్ర మన తెలంగాణ సరిహద్దులు దాటి యావత్ భారత దేశంలో సినిమాగా రావటం… తెలంగాణ బిడ్డలుగా మనం గర్వించదగ్గ విషయం’’ అని కవిత ప్రశంసల జల్లు కురిపించారు.
తగిన గౌరవం దక్కలేదు
‘‘ఖమ్మంలో పాల్వంచలో 1969, 2001లలో నాటి తెలంగాణ ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. కానీ వారందరికీ కూడా లభించాల్సిన ఆదరణ, రాజకీయ అవకాశాలు, ఆర్థిక స్వావలంభన, గౌరవం ఏదీ దక్కలేదు. వారికి అవన్నీ కూడా దక్కే వరకు పోరాటం చేస్తామని జనం బాట ప్రారంభంలోనే చెప్పాం. ఇక ముందు కూడా అదే విధంగా పోరాటం చేస్తాం. ఇవాళ అంబేద్కర్ వర్థంతి ఉంది. అందరం వారిని స్మరించుకుంటున్నాం. సబ్బండ వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యం లభించాలంటే సామాజిక తెలంగాణ అవసరం. ఈ పోరాటంలో ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, అధికారానికి దూరంగా ఉన్న వర్గాలను కలుపుకొని పోతాం. ముఖ్యంగా అధికారానికి దూరంగా ఉన్న మా మహిళలను కలుపుకొని సామాజిక తెలంగాణ సాధిస్తాం’’ అని కవిత పేర్కొన్నారు.

