Jubilee Hills Bypoll:
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills Bypoll) ప్రశాంతంగా ముగిసింది. అందరూ ఊహించినట్లుగానే అసెంబ్లీ ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరిగింది. ఎన్నికల్లో గెలుపుకోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సర్వశక్తులు ఒడ్డాయి. సాధ్యమైనంతవరకు ఓటర్లను పోలింగ్ బూత్ లకు తీసుకొచ్చేందుకు కృషిచేశారు. నిజానికి, పోలింగ్ ప్రారంభం నుంచి మధ్యాహ్నం వరకు మందకూడిగా సాగింది. ఓటర్లు ఆశించినమేరకు రాకపోవడంతో పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ప్రలోభాలకు తెరదీసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కొన్ని పార్టీల నేతలు నగదు, చీరలు పంపిణీ చేసిన వీడియోలు సైతం చక్కర్లు కొట్టాయి. అంతేకాదు పంపిణీలకు తెరదీశారనని తెలుసుకొని మరో పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడం, ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది బాజాప్తాగా ఓటర్ లిస్టు పట్టుకొని మరీ పంపిణీ చేస్తున్న వీడియోలు సైతం చక్కర్లు కొట్టాయి. ఒక్కో ఓటరుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేశారనే ప్రచారం జరిగింది.
ఎవరి అంచనాలు వారివి
పోలింగ్ శాతం పెరగడం తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ, లేదు తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇరుపార్టీల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. పోలింగ్ ప్రారంభం అయిన ఉదయం 7 గంటల నుంచి ఇరుపార్టీల నేతలు పోటాపోటీగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చారు. దీంతో నియోజకవర్గంలోని 6 డివిజన్లలో పోలింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికల్లో కీలకంగా మారిన బోరుబండ, ఎర్రగడ్డ, రహమత్ నగర్ డివిజన్ లో ఓటర్లు ఎక్కువగా ఉండటంతో వీరిలో మెజార్టీ ప్రజలు ఎవరిపక్షాన నిలబడితే వారే విజేయం సాధించనున్నారు.
పోలింగ్ ముగియడంతో ఇరుపార్టీల నేతలు అంచనాల్లో నిమగ్నమయ్యారు. ఎవరి అంచనాల్లో వారు వేసుకుంటున్నారు. పోలింగ్ బూత్ లవారీగా పార్టీలకు పడిన ఓట్లను లిస్టులవారీగా నమోదు చేసుకుంటున్నారు. ఎంతపర్సంటేజీ వస్తుంది.. ఇతరపార్టీల కంటే మనకు ఎన్నిట్లు పడ్డాయి అనే వివరాలు సేకరిస్తున్నారు. పోలింగ్ ఏజెంట్లను సైతం వివరాలను ఇవ్వాలని పార్టీ అధినేతలు కోరినట్లు సమాచారం. మరోవైపు గెలుపుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కీలక నేతలంతా నియోజకవర్గంలో పర్యటించడం, పోలింగ్ తీరును పర్యవేక్షించడం, ఎప్పటికప్పుడు నేతలకు సూచనలు చేశారు.
Read Also- Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బై పోలింగ్ లో హీట్ ట్రెండ్.. మాస్ లోని మెజార్టీ లంతా నవీన్ వైపే?
ఇది ఇలా ఉంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన నేతలు మాత్రమే పోలింగ్ రోజూ ఉండాలని ఇతర నియోజకవర్గాలకు చెందిన వారు వెళ్లాలని ఈసీ సైతం ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ పోలింగ్ రోజూ అన్నిపార్టీలకు చెందిన నేతలు నియోజకవర్గంలో ఉండటం చర్చనీయాంశమైంది. అంతేకాదు పోలింగ్ కేంద్రాల వద్ద కుర్చీలు వేసుకోవడం, నియోజకవర్గంలో ప్రచార సరళీని పరిశీలించడం, ఓటర్లను సైతం ప్రలోభాలకు గురిచేయడంతో కొన్ని చెదురుమదురు ఘటనలు జరిగాయి. అంతేకాదు ఎన్నికల కమిషన్ కు సైతం ఫిర్యాదులు చేసుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలపై సైతం కేసులు అయ్యాయి. ఏది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎవరు గెలుస్తారు? ఎంతమెజార్టీతో గెలుస్తారనేది ఇప్పుడు ఇరుపార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ తీవ్రం అయింది.
మరోవైపు బీజేపీ నేతలు మాత్రం ఉప ఎన్నికలకు లైట్గా తీసుకున్నారనేది స్పష్టం అయింది. గెలుస్తామని తొలుత ప్రకటించిన బీజేపీ నేతలు పోలింగ్ రోజూ కనిపించకపోవడం, రెండు మూడు డివిజన్లలో మాత్రమే కనబడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వారు గెలువమనే నిర్ణయానికి వచ్చి ఉప ఎన్నికను సీరియస్గా తీసుకోలేదని స్పష్టమవుతోంది. అయితే, వారికి పడే ఓట్లు కూడా పోటీపడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధుల గెలుపును, మెజార్టీని నిర్ణయించనున్నట్లు సమాచారం. ఎక్కువగా బీజేపీకి పడాల్సిన ఓట్లు ఎవరికి పడ్డాయనేది ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది.

