Jubliee Hills Bypoll: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ (BRS) తరపున ఎన్నికల బరిలో నిలిచిన మాగంటి సునీత (Maganti Sunita Gopinath)కు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) బీ ఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.40 లక్షల చెక్కును సైతం కేసీఆర్ అందించినట్లు బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది.
కుటుంబ సభ్యుల సమక్షంలో..
మాగంటి సునీత బీఫామ్ తీసుకునే క్రమంలో ఆమె వెంట కుటుంబ సభ్యులు తరలివచ్చారు. దివంగత మాగంటి గోపీనాథ్ కూతుళ్లు, కుమారుడు హాజరయ్యారు. వీరితో పాటు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
గెలుపు అత్యవసరం..
బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిట్టింగ్ స్థానం కావడంతో దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పై ఉంది. ఆయనకు ఈ ఉపఎన్నిక రాజకీయ భవిష్యత్ సైతం ఆధారపడి ఉంది. దీంతో ఆయన జూబ్లీహిల్స్ పై ఫోకస్ పెట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన తన సత్తాను చాటాలంటే గెలవాల్సిందే. అంతేకాదు లీడర్ గా ఆయనలోని రాజకీయ చతురతకు ఇది కీలకంగా మారనుంది. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు ఇన్ చార్జీలను నియమించారు. పోలింగ్ బూత్ ల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించారు.
Also Read: Best Smartphones: మెుబైల్ ప్రియులకు పండగే.. రూ.15,000లో తోపు ఫోన్స్ ఇవే.. ఫీచర్స్కు ఫిదా కావాల్సిందే!
కాంగ్రెస్ నుంచి యువనేత
మరోవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నికను అధికార కాంగ్రెస్ (Congress) సైతం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో ఆ పార్టీ తన తరపున యువ నేత నవీన్ యాదవ్ (Naveen Yadav) కు అవకాశం కల్పించింది. నవీన్ కు జూబ్లీహిల్స్ పై గట్టి పట్టుంది. నియోజకవర్గంలో ఆయన తిరగని గల్లీ, తొక్కని గడప దాదాపుగా లేదంటే అతిశయోక్తి కాదేమో. నియోజకవర్గంలో సంప్రదాయక కార్యక్రమాలు, ఫంక్షన్లకు ఎవరూ ఆహ్వానించినా ఆయన తప్పకుండా హాజరై, అక్కడివారిని పలకరిస్తుంటారు. 2014లో ఎంఐఎం పార్టీ (MIM Party) అభ్యర్థిగా ఆ తర్వాత 2018లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపు కోసం నవీన్ పోరాడినప్పటికీ విజయం వరించలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జుబ్లీహిల్స్ టికెట్ ఆశించి నవీన్.. కాంగ్రెస్ లో చేరారు. కానీ టికెట్ రాలేదు. మాగంటి గోపినాథ్ అకస్మిక మరణంతో నవీన్ యాదవ్ కు అనూహ్యంగా అవకాశం లభించింది.
