Jupally Krishna Rao: హైదరాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో అంతర్జాతీయ పతంగుల, మిఠాయిల పండుగ ను అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) మాట్లాడుతూ, శతాబ్దాల చరిత్ర కలిగిన పతంగుల పండుగ, మన సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణ కోసం ప్రభుత్వం ఇలాంటి ఉత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు.
యువతకు ఉపాధి అవకాశాలు
ఈ వేడుకల్లో భాగంగా వివిధ దేశాల, రాష్ట్రాల నుండి తరలివచ్చి ఎగురవేస్తున్న రంగురంగుల పతంగులు ఆకాశాన్ని మురిపిస్తున్నాయని పేర్కొన్నారు. తన చిన్నతనంలో పతంగులు ఎగురవేసిన మధుర జ్ఞాపకాలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.గాలిపటాల తయారీని హైదరాబాద్లోనే పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
వ్యాపారులకు ఆర్థికంగా చేయూత
ప్రజలు తమ బిజీ జీవితంలో కనీసం నెలకు రెండు రోజులైనా పర్యాటక ప్రదేశాలను సందర్శించాలి. దీనివల్ల మానసిక ఉల్లాసంతో పాటు, స్థానిక కళాకారులకు, వ్యాపారులకు ఆర్థికంగా చేయూత లభిస్తుంది” అని మంత్రి పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ను ప్రజలందరూ సందర్శించి విజయవంతం చేయాలని కోరుతూ, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల మిఠాయిల స్టాళ్లను మంత్రి జూపల్లి సందర్శించి, రుచులను ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎం.డి క్రాంతి వల్లూరి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహ రెడ్డి, హెరిటేజ్ డైరెక్టర్ అర్జున్ రావు, కైట్ ఫెస్టివల్ కన్సల్టెంట్ పవన్ డి సోలంకి, క్లిక్ ప్రతినిధులు లింబీ బెంజిమన్, పరమానంద శర్మ , అభిజిత్, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Jupally Krishna Rao: కేసీఆర్ కుటుంబ రాజకీయాలే ఆ పార్టీ పతనానికి కారణం : మంత్రి జూపల్లి కృష్ణారావు

