Ind Pak War: రాష్ట్ర పోలీసులు స్లీపర్ సెల్స్ పై ఫోకస్ పెట్టారు. కేంద్ర నిఘా వర్గాల నుంచి స్లీపర్ సెల్స్ పట్ల జాగ్రత్త అంటూ హెచ్చరికలు అందిన నేపథ్యంలో ఇటు కౌంటర్ ఇంటెలిజెన్స్అటు ఇంటెలిజెన్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. గతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి పట్టుబడిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిహాదీ కార్యకలాపాలకు సానుకూలంగా ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలు కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో చిన్నపాటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలో సృష్టించిన రక్తపాతానికి ప్రతీకారంగా భారత భద్రతా బలగాలు ఆపరేషన్ సింధూర్ను జరిపిన విషయం తెలిసిందే.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ తోపాటు పాకిస్తాన్ లోపలికి చొచ్చుకుపోయిన మన మిస్సయిళ్లు తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి. పదుల సంఖ్యలో ఉగ్రవాదులను కాటికి చేర్చాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ జవాన్లు అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తూ సరిహద్దుల వెంట విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్నారు. మన దేశంలోని కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసి డ్రోన్లు, మిస్సయిళ్లను ప్రయోగించారు. అయితే, మన బలగాలు ఈ దాడులను సమర్థంగా అడుకున్నాయి. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సయిళ్లను ఆకాశంలోనే కుప్పకూల్చాయి. పాక్ యుద్ద విమానాలను సైతం నేలకూల్చాయి. దాంతో పాకిస్తాన్ తోపాటు ఆ దేశ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కుతకుతలాడుతున్నాయి.
డర్టీ వార్
ఈ క్రమంలో పాకిస్తాన్ తోపాటు ఆ దేశ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు డర్టీ వార్ జరిపే అవకాశాలు ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని కోసం స్లీపర్ సెల్స్ ను యాక్టివేట్ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్ తోపాటు చెన్నై, బెంగళూరు, మహారాష్ట్ర తదితర సిటీల్లో వందల సంఖ్యలో స్లీపర్ సెల్స్ ఉన్నట్టుగా సమాచారం. పాక్, ఆ దేశ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు చేస్తున్న ఈ కుట్రలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర నిఘా సంస్థలకు సమాచారం కూడా అందినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే స్లీపర్ సెల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర నిఘా సంస్థలు తెలంగాణతోపాటు ఆయా రాష్ట్రాల పోలీసు యంత్రాంగాలకు సూచనలు పంపించాయి.
Also Read: S-400 Sudarshan Chakra: రంగంలోకి ఎస్-400.. ఇక భారత్ సేఫ్.. పాక్కు మాత్రం చుక్కలే!
మన మధ్యే ఉంటూ
లేజర్షో ఆడిటోరియం, గోకుల్ ఛాట్ పేలుళ్లతోపాటు హైదరాబాద్ లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన ప్రతీసారి స్లీపర్ సెల్స్ కీలకపాత్ర వహించారు. దీనిపై ఓ సీనియర్ పోలీసు అధికారితో మాట్లాడగా స్లీపర్ సెల్స్ మన మధ్యనే ఉంటారన్నారు. ఉద్యోగులు చేస్తూ చిన్న చిన్న వ్యాపారాలు నడిపిస్తూ సాధారణ పౌరుల్లానే కనిపిస్తారని చెప్పారు. ఉన్నత విద్యలు చదువుకున్న వారితోపాటు రోజువారీ కూలీలు కూడా స్లీపర్ సెల్స్గా పని చేస్తుంటారని చెప్పారు. రెచ్చగొట్టే వీడియోలు చూపిస్తూ సాహిత్యం చదివిస్తూ యువకులను ఉగ్ర బాటలోకి నడిపిస్తారన్నారు. ఇక, స్లీపర్ సెల్స్గా ఉన్న వారి మధ్య పరిచయాలు ఉండవని చెప్పారు.
హ్యాండ్లర్ల నుంచ ఆదేశాలు రాగానే
తమ హ్యాండ్లర్ల నుంచి ఆదేశాలు రాగానే స్లీపర్ సెల్స్గా ఉన్నవాళ్లు యాక్టివేట్ అవుతారని సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు. అప్పుడే ఒకరికొకరు పరిచయమవుతారన్నారు. స్లీపర్ సెల్స్ గా పని చేస్తున్న వారిలో కొందరు పేలుడు పదార్థాలు సమకూరిస్తే మరికొందరు ఐఈడీ బాంబులను తయారు చేస్తారన్నారు. ఇంకొందరు వాటిని లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల్లో పెట్టి పేలుళ్లు సృష్టిస్తారని వివరించారు. అయితే, అయిదు నుంచి ఎక్కువలో ఎక్కువగా పదిమంది స్లీపర్ సెల్స్ మాత్రమే కుట్రలను అమలు చేస్తారన్నారు.
దీనికి నిదర్శనంగా రెండేళ్ల క్రితం పట్టుబడ్డ ఓ మెడికల్ కాలేజీ హెచ్వోడీ డాక్టర్ మహ్మద్ సలీం, ఎంఎన్సీ కంపెనీ క్లౌడ్ ఇంజనీర్ అబ్దుల్ రహమాన్, పాతబస్తీలో డెంటిస్టుగా పని చేస్తున్న జునైద్, రోజు కూలీలు మహ్మద్ అబ్బాస్, మహ్మద్ సల్మాన్ ల ఉదంతాన్ని పేర్కొనవచ్చన్నారు. ఈ గ్యాంగ్ హైదరాబాద్ తోపాటు భోపాల్ లో విధ్వంసం సృష్టించటానికి కుట్రలు చేసిందన్నారు. దీని కోసం వికారాబాద్ అడవుల్లో ఆయుధాలను ఎలా ఉపయోగించాలన్న దానిపై శిక్షణ కూడా తీసుకున్నట్టు చెప్పారు.
ఇప్పటికీ స్లీపర్ సెల్స్
ఇప్పటికీ హైదరాబాద్ లో ఇలా స్లీపర్ సెల్స్ గా ఉన్నవారు వందల్లోనే ఉంటారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్న తరుణంలో కేంద్ర నిఘా సంస్థల నుంచి హెచ్చరికలు అందటంతో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు వీరిపై దృష్టిని సారించారు. స్లీపర్ సెల్స్ ఆచూకీ తెలుసుకోవటానికి కౌంటర్ ఇంటెలిజెన్స్ తోపాటు ఇంటెలిజెన్స్ సిబ్బందిని రంగంలోకి దింపారు. వీళ్లు గతంలో ఉగ్రవాద కుట్రలు చేసి పట్టుబడిన వారి వివరాలు సేకరిస్తున్నారు.
ప్రస్తుతం వీళ్లు జైళ్లలో ఉన్నారా? బెయిల్ పై విడుదలై బయటకు వచ్చారా? వస్తే ఎక్కడ ఉంటున్నారు? అన్న వివరాలు సేకరిస్తున్నారు. వీరి సన్నిహితులపై నిఘా పెట్టారు. అనుమానాస్పద ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి ఉంటున్నారా? అనుమానాస్పదంగా ఎవరైనా వ్యవహరిస్తున్నారా? అన్నది తెలుసుకోవాలని ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులను కూడా అలర్ట్ చేశారు. ఇక, సోషల్ మీడియాపై కూడా నిఘా పెట్టారు.
Also Read: Nuclear Bomb: పాక్ నుంచి అణు ముప్పు.. ఏం చేయాలి? ఏం చేయకూడదు?