IBomma Ravi: కస్టడీకి తీసుకున్న ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని దర్యాప్తు అధికారులు నాలుగో రోజు విచారించారు. ప్రధానంగా మూవీ రూల్జ్ వెబ్ సైట్ వివరాలు తెలుసుకునేందుకు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే, షరా మామూలు అన్నట్టుగా రవి పెద్దగా సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. పట్టుకోండి చూద్దామంటూ సవాల్ విసిరిన ఐ బొమ్మ(I Bomma) నిర్వాహకుడు రవి(Ravi)ని ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతితో అతన్ని కస్టడీకి తీసుకున్న విచారణ అధికారులు నాలుగో రోజు కూడా రవిని పలు అంశాలపై ప్రశ్నించారు.
20 మంది యువకులు నియామకం
ఐ బొమ్మ, బప్పం వెబ్ సైట్లను క్లోజ్ చేయించగా తాజాగా శుక్రవారం విడుదలైన సినిమాలను శనివారం మూవీ రూల్జ్ వెబ్సైట్(Movie Rules website)లోకి పైరసీ దారులు అప్లోడ్ చేసిన విషయం తెలిసిందే. రవిని జరిపిన విచారణలో అతను మూవీ రూల్జ్ వెబ్సైట్ నిర్వాహకుల నుంచి సినిమాలను కొని తాను నడిపిన ఐ బొమ్మ, బప్పం వెబ్ సైట్లలోకి అప్లోడ్ చేసినట్టు ఇప్పటికే వెల్లడైంది. ఈ క్రమంలోనే దర్యాప్తు అధికారులు మూవీ రూల్జ్ వెబ్సైట్ నిర్వాహకులకు సంబంధించి రవిని విచారించారు. సినిమాలు కొనడానికి ఎవరిని కాంటాక్ట్ చేసేవాడివి? చెల్లింపులు ఎవరికి జరిపేవాడివి? అని అడిగారు. అయితే, ఈ ప్రశ్నలకు రవి నిర్దిష్టమైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. అంతా ఆన్ లైన్ ద్వారానే జరిపేవాడినని చెప్పినట్టు సమాచారం. మూవీ రూల్జ్ వెబ్ సైట్ నిర్వాహకులు ఎవరు? అన్నది తనకు తెలియదని అన్నట్టుగా తెలిసింది.
Also Read: Small Budget Films: నిజంగా ఇవి చిన్న సినిమాలా? అర్థం మారిపోతుంది..
విదేశాల్లో సర్వర్లు..
ఇక, పైరసీ చేసిన సినిమాలను వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయటానికి రవి 20మంది యువకులను నియమించుకున్నట్టుగా ఇప్పటికే విచారణలో తేలింది. వీరికి సంబంధించిన ప్రశ్నలకు కూడా రవి సరైన జవాబులు ఇవ్వలేదని సమాచారం. రవి ఉపయోగించిన సర్వర్లు విదేశాల్లో ఉన్నా వాటిని ఇండియా నుంచే యాక్సెస్ చేసినట్టుగా పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ ఫొరెన్సిక్ ద్వారా ఆధారాలను సేకరించే ప్రయత్నాలను మొదలు పెట్టారు. ఎథికల్ హ్యాకర్ల సహాయంతో పైరసీ వెబ్ సైట్లకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంలోకి కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా తెలుస్తున్నది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంల నిర్వాహకుల ఫిర్యాదుల మేరకు ఇప్పటికే యూ ట్యూబ్, డొమైన్ హోస్టింగ్ కంపెనీలకు నోటీసులు కూడా పంపించారు.
నిర్మాత సి. కళ్యాణ్ వ్యాఖ్యలపై..
ఇక, సినిమాలను పైరసీ చేయడం ద్వారా టాలీవుడ్కు కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చిన రవిని ఎన్ కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి. కళ్యాణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై విశాఖపట్టణంలో ఉంటున్న రవి తండ్రి అప్పారావు స్పందించారు. ఎన్ కౌంటర్ చేయాలన్న నిర్మాతను గానీ, అతని కొడుకును గానీ ఎన్ కౌంటర్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుందన్నారు. తన కొడుకు చేసింది తప్పే అన్న అప్పారావు దానికి ఎలాంటి శిక్ష విధించినా ఎదుర్కొంటామన్నారు. తప్పితే ఎన్ కౌంటర్ చేయాలని చెప్పే హక్కు సినిమా వాళ్లకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. టిక్కెట్ల రేట్లను ఇష్టానుసారంగా పెంచి జనాలపై ఆర్థిక భారం మోపడాన్ని సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాయర్ను పెడతానని రవితో చెప్పగా దానికి అంగీకరించలేదన్నారు.
Also Read: Jangaon RTA Office: జనగాం రవాణా శాఖ కార్యాలయంలో జోరుగా దందా.. అన్నీ ఉన్నా చెయ్యి తడపాల్సిందే!

