She Teams: ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చాలు వెంటపడి వేధించే పోకిరీలు, స్నేహం నటిస్తూ బ్లాక్ మెయిల్ చేసే కంత్రీగాళ్లు, కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేసే సహోద్యోగులు.. ఇలా అడుగడుగునా మహిళలను వేధించే మృగాళ్లకు హైదరాబాద్ ‘షీ టీమ్స్’ సింహస్వప్నంలా నిలుస్తున్నాయి. మైనర్ బాలికలను సైతం వదలకుండా వేధిస్తున్న వారి ఆట కట్టిస్తూ, పక్కా ఆధారాలతో కటకటాల వెనక్కి పంపిస్తున్నాయి. గత ఒక్క ఏడాదిలోనే 1,149 ఫిర్యాదులను పరిష్కరించిన షీ టీమ్స్, డెకాయ్ ఆపరేషన్ల ద్వారా ఏకంగా 3,826 మంది పోకిరీలను పట్టుకుని బాధితులకు కొండంత భరోసాను అందించాయి.
బ్లాక్ మెయిల్కు చెక్
స్మార్ట్ ఫోన్ల యుగంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా పరిచయాలు పెంచుకుని మహిళలను వేధించే వారి సంఖ్య పెరుగుతోంది. తొలుత మంచి మాటలతో నమ్మించి, సన్నిహితంగా మారిన తర్వాత వీడియో కాల్స్ను రికార్డ్ చేయడం లేదా వ్యక్తిగత ఫోటోలు సేకరించి బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోయినా, పెళ్లికి ఒప్పుకోకపోయినా ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పెడతామని పరువు తీస్తామని భయపెడుతున్నారు. గత ఒక్క ఏడాదిలోనే ఇలాంటి వేధింపులకు గురైన 366 మంది బాధితురాళ్లు షీ టీమ్స్ను ఆశ్రయించగా, రంగంలోకి దిగిన పోలీసులు ఆ కంత్రీగాళ్ల ఆట కట్టించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Hyderabad SHE Teams: గణేష్ ఉత్సవాలు.. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన.. 1612 మంది పోకిరీల అరెస్ట్
సాంకేతిక ఆధారాలతో
అర్ధరాత్రుళ్లు కాల్స్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడి వేధిస్తున్న ఘటనలకు సంబంధించి షీ టీమ్స్కు ఏడాదిలో 121 ఫిర్యాదులు అందాయి. ఈ వేధింపుల వల్ల తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నామంటూ 50 మంది మహిళలు ఫిర్యాదు చేయగా, షీ టీమ్స్ రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాలతో నిందితులను కటకటాల వెనక్కి పంపాయి. అదేవిధంగా, నకిలీ ఐడీలతో సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడుతున్న మరో 82 కేసుల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నారు.
ప్రేమ పేరుతో
ప్రేమ పేరుతో నమ్మించి నయవంచనకు పాల్పడుతున్న కేసులు కూడా భారీగా నమోదయ్యాయి. ‘నువ్వు లేకపోతే బతకలేను’ అంటూ వలలోకి లాగి, శారీరక వాంఛలు తీర్చుకున్నాక పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేస్తున్న 98 మంది ప్రబుద్ధులపై షీ టీమ్స్ క్రిమినల్ కేసులు నమోదు చేయించాయి. ఈ క్రమంలో కృంగిపోయిన బాధితులకు డిప్రెషన్ నుంచి బయటపడేలా నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించి వారికి అండగా నిలిచాయి.
మఫ్టీలో షీ టీమ్స్ నిఘా
బస్టాండ్లు, కాలేజీలు, మార్కెట్లు ఇలా రద్దీ ఉండే ప్రతీ చోటా మహిళలు, యువతులను వేధిస్తున్న పోకిరీలకు షీ టీమ్స్ చెక్ పెడుతున్నాయి. మఫ్టీలో రంగంలోకి దిగుతున్న సిబ్బంది డెకాయ్ ఆపరేషన్లు జరిపి ఆవారాగాళ్లను అదుపులోకి తీసుకుంటున్నారు. వెంట ఉన్న కెమెరాలతో ఫోటోలు, వీడియోలు తీసి పక్కా ఆధారాలతో పట్టుకుంటున్నారు. గత ఒక్క సంవత్సరంలో కమిషనరేట్ వ్యాప్తంగా 15 ప్రత్యేక బృందాలు డెకాయ్ ఆపరేషన్లు జరపటం ద్వారా 3,826 మంది పోకిరీలను పట్టుకోవటం గమనార్హం. వీరిలో పలువురికి వారి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. కొంతమందిపై ఎఫ్ఐఆర్లు జారీ చేసి జైలుకు రిమాండ్ చేశారు.
కమిషనర్ అభినందనలు
సమర్థవంతంగా పని చేస్తూ మహిళలకు అండగా నిలుస్తున్న హైదరాబాద్ఉమెన్సేఫ్టీ వింగ్ డీసీపీ డాక్టర్ లావణ్య నాయక్ జాదవ్తో పాటు షీ టీమ్స్ సిబ్బందిని కమిషనర్ వీ.సీ. సజ్జనార్ అభినందించారు.
‘మహిళల జోలికొస్తే ఇక మీ ఆటలు సాగవు. ముఖ్యంగా బ్లాక్మెయిలింగ్ పేరుతో ఆడబిడ్డలను భయపెట్టాలని చూస్తే, మీ భవిష్యత్తు జైలు గోడల మధ్యే అంతమవుతుంది. సోదరీమణులారా అధైర్యపడకండి. మీ వివరాలు బయటపడతాయన్న భయం అస్సలు వద్దు, వాటిని అత్యంత గోప్యంగా ఉంచుతాం. వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి. మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. మీకు రక్షణ కవచంలా నిలబడటానికి షీ టీమ్స్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆపదలో ఉన్నా, వేధింపులకు గురవుతున్నా తక్షణమే డయల్ 100 లేదా షీ టీమ్స్ వాట్సప్ నెంబర్ 9490616555 ను సంప్రదించండి’ అని సజ్జనార్ సూచించారు.
Also Read: Rachakonda Police: ఆవారాల అంతు చూస్తున్న షీ టీమ్స్ బృందాలు.. 310 మంది పోకిరీలను అరెస్టు!

