VC Sajjanar: సంచలనం సృష్టించే కీలక కేసుల్లో విచారణ కోసం సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం (సీఐటీ)ను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్(V.C. Sajjanar) ప్రకటించారు. నిందితులను అరెస్ట్ చేయడంతో సరిపెట్టకుండా, వారికి న్యాయస్థానాల్లో శిక్షలు పడేలా చూడటమే లక్ష్యమని, ఇందుకోసం పక్కా ప్రణాళికను అమలు చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. బంజారాహిల్స్లోని ఐసీసీసీ ఆడిటోరియంలో అక్టోబర్ నెలలో జరిగిన నేరాలపై శుక్రవారం ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెరిగిపోతున్న కేసులు, కొట్టివేయబడ్డ పాత కేసుల గురించి ఆరా తీశారు. అనంతరం కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుపై తక్షణం స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఫిర్యాదులను పక్కన పెట్టినా, నేర తీవ్రతను తగ్గించి చూపినా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. విధి నిర్వహణలో అలసత్వం కనబరిచే అధికారులపై సస్పెన్షన్ వేటు తప్పదన్నారు. చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కేసులపై సమీక్షించి, ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. కేసుల దర్యాప్తులో లోపాలు లేకుండా ప్రతీ కేసుకు స్పష్టమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకోవాలని చెప్పారు.
Also Read: Kolipaka Srinivas: చెక్ డ్యామ్ ధ్వంసంపై కాంగ్రెస్ వైఖరి దారుణం : కొలిపాక శ్రీనివాస్ ఫైర్!
ఉక్కుపాదం, ప్రత్యేక ఫోకస్
డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలు, ఆన్లైన్ గేమింగ్, బెట్టింగు తదితర కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని సజ్జనార్ ఆదేశించారు. సైబర్ క్రైం, మహిళా భద్రత, వీధి నేరాలు, ఆహార కల్తీల కేసులపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా ఉంచి, వారు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా చూసే బాధ్యత ఆయా స్టేషన్ల ఇన్స్పెక్టర్లదేనని స్పష్టం చేశారు. తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని చెప్పారు. ఆయా కేసుల్లో భౌతిక ఆధారాలతో పాటు సాంకేతిక ఎవిడెన్సులను పక్కాగా సేకరించాలన్నారు. తద్వారా ఎక్కువ శాతం కేసుల్లో శిక్షలు పడేలా చూడాలన్నారు. అప్పుడే నేరాలకు పాల్పడే వారిలో భయం ఏర్పడుతుందన్నారు. సైబర్ నేరాలకు చెక్ పెట్టడానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు అధికారులు తప్పనిసరిగా వెపన్ను వెంట ఉంచుకోవాలని కమిషనర్ చెప్పారు. ప్రతీ 15 రోజులకొకసారి వెపన్ డ్రిల్ జరపాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు, అన్ని జోన్లు, ఆయా విభాగాల డీసీపీలు, సబ్ డివిజన్ల ఏసీపీలు, స్టేషన్ల ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
Also Read: AV Ranganath: ఉత్తమ విధులు నిర్వర్తించిన మెట్ టీమ్లను.. అభినందించిన హైడ్రా కమిషనర్ రంగనాధ్!

