తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : Drunken Drive: మందు కొట్టి బండి నడుపుతూ రోడ్డు పైకి వచ్చారా?…మీరు కటకటాలు లెక్కబెట్టాల్సిందే. డ్రంకెన్ డ్రైవింగ్ పై సీరియస్ గా దృష్టిని కేంద్రీకరించిన ట్రై కమిషనరేట్ల ఉన్నతాధికారులు మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి చెక్ పెట్టటానికి కట్టుదిట్టమైన చర్యలను అమలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఆయా కమిషనరేట్ల పరిధుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే మద్యం మత్తులో ప్రమాదం చేసి ఎవరిదైనా ప్రాణం పోవటానికి కారణమైతే బీఎన్ఎస్ సెక్షన్ 105 ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టంగా చెబుతుండటం. ఈ సెక్షన్ ప్రకారం నమోదయ్యే కేసుల్లో గరిష్టంగా పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తుండటం.
ట్రై కమిషనరేట్ల పరిధుల్లో ఏయేటికాయేడు వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అధికారులు చెబుతున్న ప్రకారం ప్రస్తుతం మూడు కమిషనరేట్లలో కలిపి కోటీ 20లక్షల వాహనాలు ఉన్నాయి. వీటికి అదనంగా ఇతర రాష్ట్రాల నుంచి దాదాపుగా మరో లక్ష వాహనాల వరకు ప్రతీరోజూ రహదారులపై తిరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండటంతోపాటు అవతలి వారిని ప్రమాదంలోకి నెడుతున్నారు.
Also Read Plane crash: ఇంటిపై కుప్పకూలిన విమానం.. భారీగా ఎగసిపడ్డ మంటలు.. వీడియో వైరల్
ఏ రోజు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించినా మూడు కమిషనరేట్ల పరిధుల్లో కలిపి 15వందల మందికి పైగానే ఫుల్లుగా మందు కొట్టి వాహనాలు నడుపుతూ దొరికిపోతున్నారు. గత సంవత్సరం ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 52వేలకు పైగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక, తాగి దొరుకుతున్న వారిలో ద్విచక్ర వాహనదారులు ఎనభైశాతం వరకు ఉంటున్నారు. ఆ తరువాతి స్థానంలో కార్లు నడుపుతూ పట్టుబడుతున్న వారు ఉన్నారు.
ఇలా పరిమితికి మించి మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వస్తున్న వారు మత్తులో ప్రమాదాలు చేస్తున్నారు. కొన్నిసార్లు వాహనాలపై నియంత్రణ కోల్పోయి ఫుట్ పాత్ లపైకి దూసుకెళుతున్నారు. మరికొన్నిసార్లు ముందు వెళుతున్న వారిని ఢీకొడుతున్నారు. ఇలా తాగి యాక్సిడెంట్లు చేస్తున్నవారిలో యువతులు కూదా ఉంటుండటం గమనార్హం.
దీనికి నిదర్శనంగా ఇటీవల కూకట్ పల్లి ప్రాంతంలో జరిగిన ప్రమాదాన్ని పేర్కొనవచ్చు. మద్యం సేవించి కారు నడిపిన ఓ యువతి ముందుగా వెళుతున్న బైక్ ను ఢీకొట్టింది. తప్పు తనదే అయినా మత్తులో యువకులతో గొడవ పెట్టుకుంది. మీ కారణంగానే యాక్సిడెంట్ జరిగిందంటూ వారిపై చిందులు వేసింది. విషయం తెలిసి అక్కడకు వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా సదరు యువతి పరిమితికి మించి మద్యం సేవించి ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దాంతో పోలీసులు ఆమెపై కేసులు పెట్టారు. ఇలా చెబుతూ పోతే డ్రంకెన్ డ్రైవింగ్ కారణంగా జరుగుతున్న ప్రమాదాల జాబితా చాంతాడంత అవుతుంది.
Also Read: Vizag: నకిలీ బంగారం కలకలం.. ఏకంగా రూ.68లక్షలకు టోకరా!
చనిపోవటానికి కారకులైతే...
కొన్నిసార్లు డ్రంకెన్ డ్రైవింగ్ కారణంగా జరుగుతున్న యాక్సిడెంట్లలో ప్రాణాలు కూడా పోతున్నాయి. పోలీసువర్గాలు చెబుతున్న ప్రకారం యేటా ట్రై కమిషనరేట్లలో జరుగుతున్న యాక్సిడెంట్లలో చనిపోతున్న వారి సంఖ్య 7వందల వరకు ఉంటోంది. వీరిలో 80 నుంచి 100 మంది వరకు మద్యం సేవించి చేస్తున్న డ్రైవింగ్ కారణంగా అసువులు బాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు కమిషనరేట్ల ఉన్నతాధికారులు డ్రంకెన్ డ్రైవింగ్ కు అడ్డుకట్ట వేయటానికి పకడ్భంధీ చర్యలను అమలు చేస్తున్నారు.
దీంట్లో భాగంగా ప్రతీ శనివారం రాత్రి వ్యూహాత్మక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మిగితా రోజుల్లో కూడా ఆకస్మిక తనిఖీలు జరుపుతున్నారు. దీంట్లో పెద్ద సంఖ్యలో మందుబాబులు పట్టుబడుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో జరిపిన తనిఖీల్లో 11వందల మందికి పైగా మందుబాబులు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ఇక, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శనివారం ఒక్క రోజు జరిపిన తనిఖీల్లో 222మంది దొరికిపోయారు.
Hyderabad Metro: హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. ఇకపై మెట్రో సేవలు మరింతగా..
ప్రాణాలు పోవటానికి కారణమైతేన..
పీకలదాకా మందు కొట్టి వాహనాలు నడుపుతూ అవతలి వారి ప్రాణాలు పోవటానికి కారణమైన వారికి కఠిన శిక్షలు తప్పవని ట్రై కమిషనరేట్ల ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 105 ప్రకారం కేసులు పెడతామని చెబుతున్నారు. దీని ప్రకారం నమోదయ్యే కేసుల్లో గరిష్టంగా 10 సంవత్సరాల కారాగార శిక్ష పడుతుందని తెలిపారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు