TG Global Summit: ప్రపంచ స్థాయి గ్లోబల్ సమ్మిట్కు హైదరాబాద్(Hyderabad) ఆతిథ్యమివ్వనున్నది. ఈ సమ్మిట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడంలో భాగంగా సర్కార్ ముందడుగు వేస్తున్నది. అంతటి ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్కు విద్యుత్ శాఖ కీలకంగా వ్యవహరించనున్నది. అంతర్జాతీయ ఖ్యాతిని పెంచడంలో ఆ ప్రాంగణాన్ని జిగేల్ మంటూ మెరిపించేందుకు విద్యుత్ శాఖ తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఈ నెల 8, 9 తేదీల్లో ఈ గ్లోబల్ సమ్మిట్ జరగనున్నది. కాగా, ఈ సమ్మిట్ సజావుగా సాగేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
అదనంగా 5 ట్రాన్స్ఫార్మర్లు
33 /11 కేవీ మీర్ఖాన్పేట్ సబ్ స్టేషన్ నుంచి సదస్సు జరిగే ప్రాంతానికి ప్రత్యేకంగా 2 కిలో మీటర్ల మేర కలిగిన డబుల్ సర్క్యూట్ అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను విద్యుత్ శాఖ ఏర్పాటు చేసింది. ఒక 100 కేవీఏ, రెండు 160 కేవీఏ, రెండు 315 కేవీఏ కెపాసిటీలు కలిగిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లను ప్రాంగణంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు అదనంగా 5 ట్రాన్స్ఫార్మర్లను, అత్యవసర పరిస్థితులను తక్షణమే ఎదుర్కొనేందుకు ఒక 315 కేవీఏ కెపాసిటీ కలిగిన మొబైల్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ డీటీఆర్ను కూడా అందుబాటులో ఉంచారు. ఈ వ్యవహారాలన్నీ పర్యవేక్షించేందుకు సంస్థ ఇన్ఛార్జ్గా ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్స్ నర్సింహులు(SPDCL Director Operations Narsimhulu)ను నియమించింది. పర్యవేక్షణకు దాదాపు 150 మంది విద్యుత్ అధికారులు, సిబ్బందిని సైతం నియమించింది. శనివారం నుంచి సదస్సు ముగిసే వరకు సరఫరా తీరును ఈ బృందం పర్యవేక్షించనుంది. ఎలాంటి అంతరాయాలు కలగకుండా ఉండేలా ప్రణాళిక రచించుకుంది.
Also Read: Drainage Water: రోడ్డు పైకి ఇష్టా రాజ్యంగా అపార్ట్మెంట్ డ్రైనేజీ నీళ్లు.. అవస్థలో వాహనదారులు
విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా..
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతంలో ఎస్పీడీసీఎల్ ఏర్పాటు చేసిన స్టాళ్లు, యూజీ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు పనులపై సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ(CMD Musharraf Farooqui) చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండెంట్ ఇంజినీర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ ఫరూఖీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్(Global Summit)కు దేశ, విదేశాలకు సంబంధించిన పలువురు ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొంటారని తెలిపారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది, అధికారులు తప్పనిసరిగా సేఫ్టీ జాకెట్లు ధరించాలని, క్విక్ రెస్పాన్స్ టీం వాహనాలు, ఇతర పరికరాలు నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read: IndiGo Flight Crisis: ఇండిగో తప్పు చేసింది.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. విమానయాన మంత్రి వార్నింగ్

