Harish Rao: తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మరోమారు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. స్థానిక ఎన్నికల బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే విధించడంపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీల తరహాలోనే.. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఓ డ్రామా అని ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా? అని ప్రశ్నించారు. బీసీల పట్ల చిత్త శుద్ది ఉంటే దిల్లీ వేదికగా జాతీయ కాంగ్రెస్ నాయకులతో కలిసి పోరాడాలని సూచించారు.
‘సీఎంకు చిత్తశుద్ధి లేదు’
మాయమాటలు చెప్పిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసగించిందని హరీశ్ రావు మండిపడ్డారు. ఆ తరహాలోనే స్థానిక ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని కాంగ్రెస్ చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం దిల్లీ కొట్లాడాల్సిందిపోయి.. గత 22 నెలలుగా గల్లీలో కొట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి డ్రామా చేశారని హరీశ్ రావు ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం పట్ల సీఎం ఏనాడూ చిత్తశుద్ధి ప్రదర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరు గ్యారెంటీల లాగే,
కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా..55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా..?
చిత్తశుద్ధి ఉంటే మీ @INCIndia జాతీయ నాయకులతో డిల్లీ వేదికగా కోట్లాట పెట్టండి..
కలిసి రావడానికి @BRSparty ఎల్లప్పుడూ సిద్ధం..…
— Harish Rao Thanneeru (@BRSHarish) October 9, 2025
‘తూతూ మంత్రంగా జీవో ఇచ్చారు’
కామారెడ్డి డిక్షరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన కాంగ్రెస్.. దాని చట్టబద్దత కోసం కేంద్రాన్ని ఒప్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. తెలివిగా సమస్యను పక్కదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉందని చాటుకునేందుకు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెర తీశారని మండిపడ్డారు. తద్వారా స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారని హరీశ్ రావు అన్నారు. సీఎం రేవంత్ ఇప్పటికైనా తన డ్రామాలు ఆపాలని హితవు పలికారు. బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్త శుద్ధి ఉంటే దిల్లీలో కొట్లాడాలని పునరుద్ఘటించారు. ఈ విషయంలో ఉధ్యమ పార్టీగా బీసీల కోసం బీఆర్ఎస్ సైతం గొంతెత్తుతుందని అన్నారు.
Also Read: TG High Court: హైకోర్టు సంచలన తీర్పు.. బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై స్టే
తెలంగాణ హైకోర్టు స్టే
అంతకుముందు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తీసుకొచ్చిన జీవో 9 పై స్టే విధించింది. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ల విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. నాలుగు వారాల్లోగా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాల దాఖలుకు రెండు వారాల గడువు సైతం పిటిషనర్లకు ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై రెండ్రోజుల పాటు విచారించిన హైకోర్టు.. ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
