Ganesh Chaturthi festival: ఈ నెల 27 నుంచి మొదలుకానున్న గణేష్ ఉత్సవాల నిర్వహణకు ఎలాంటి నిధుల కొరత లేదని, గతం కంటే ఈ సారి ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnan) తెలిపారు. రానున్న గణేష్ ఉత్సవాలు గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) పరిధిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతియుత వాతావరణంలో జరిగేలా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు అందరూ సహకరించాలని కమిషనర్ కోరారు. జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయంలో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కమిషనర్ అధ్యక్షతన సన్నాహాక సమన్వయ సమావేశం జరిగింది.
గత సంవత్సరం కంటే ఎక్కువ క్రేన్లు
ఈ సందర్భంగా కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరి గానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఘనంగా గణేష్ ఉత్సవాలు జరిగేలా జీహెచ్ఎంసీ(GHMC), పోలీస్(Police), సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సహకారం అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నగర పరిధిలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. గణేష్ ప్రతిమల ఊరేగింపు జరిగే జాతీయ రహదారుల్లో ఏమైనా రోడ్లు రిపేర్ ఉంటే, వాటిని కూడా చేపడతామని తెలిపారు. పోలీస్ శాఖ సూచన మేరకు నిమజ్జనం సజావుగా, వేగంగా పూర్తి చేసేందుకు గత సంవత్సరం కంటే ఎక్కువ క్రేన్ లు కూడా ఉపయోగిస్తామని కమిషనర్ వెల్లడించారు. గణేష్ ఉత్సవాలకు వివిధ పనుల నిమిత్తం గతం కంటే కూడా అధిక నిధులు కేటాయిస్తామని కమిషనర్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు తెలిపారు.
Also Read: TCS: టీసీఎస్ ఉద్యోగులకు పండుగలాంటి వార్త.. 1వ తేదీ నుంచి అమల్లోకి..
ప్రభుత్వ శాఖల సమన్వయంతో
వేడుకలు సజావుగా జరిగేందుకు జోనల్ పరిధిలో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. గత లోటు పాట్లను సమీక్షించుకుంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గణేష్ ఉత్సవాలను జరిగేలా చూస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. లా అండ్ ఆర్డర్(Law & Order) అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్(Vikram Singh Mann) గణేష్ ఉత్సవాలు సజావుగా జరిగేందుకు పలు సూచనలు చేశారు. ప్రతి సంవత్సరం భాగ్యనగర్, ఇతర గణేష్ ఉత్సవ సమితిలు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో పండుగ సజావుగా జరుపుకుంటున్నామని తెలిపారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశమున్నందున గణేష్ పండాలు, మండపాల నిర్మాణానికి క్వాలిటీ మెటీరియల్, క్వాలిటీ వైరింగ్ తో సహా నాణ్యమైన లాజిస్టిక్ ఉపయోగించాలని చెప్పారు. ఊరేగింపు సమయంలో ప్రతిమల అధిక ఎత్తుతో ఇబ్బందులు, ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు ముందే రూట్ మ్యాప్, వాహనం హైట్ ఆధారంగా ప్రతిమలను ప్రతిష్టించాలని కోరారు. ప్రతి మండపం వద్ద కనీసం ఒక్క సీసీ కెమెరా ఏర్పాటు చేసుకునేలా చూడాలని సూచించారు.
గణేష్ ఉత్సవ సమితి సభ్యులు
పెద్ద మండపాల్లో ముగ్గురికి తగ్గకుండా వాలంటీర్ సేవలను ఉపయోగించుకోవాలన్నారు. పెద్ద మండపాలలో సందర్శనం కోసం వచ్చే మార్గాలను వేర్వేరుగా ఏర్పాటు చేయాలన్నారు. ఖైరతాబాద్, బాలాపూర్ సహా నగరంలోని అన్ని గణేష్ విగ్రహాల ఊరేగింపు సకాలంలో ప్రారంభమయ్యేలా సహకరిస్తే నిమజ్జనం సజావుగా సాగుతుందని చెప్పారు. అంతకుముందు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు గణేష్ ఉత్సవాలు సజావుగా జరిగేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్(CP Joel Davie), అడిషనల్ కమిషనర్ లు రఘు ప్రసాద్, సుభద్ర, హెచ్ఎండీఏ(HMDA) జాయింట్ కమిషనర్ కోట శ్రీవాత్సవ, చీఫ్ ఇంజనీర్ రత్నాకర్ సహదేవ్, జోనల్ కమిషనర్ లు అనురాగ్ జయంతి, రవి కిరణ్, వెంకన్న, హేమంత్ సహదేవరావు, అపూర్వ చౌహాన్ లతో పాటు మెట్రో రైలు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీస్ అధికారులు, జలమండలి, అగ్నిమాపక, నీటిపారుదల, పర్యాటకం, ఆరోగ్యం, కాలుష్య నియంత్రణ బోర్డు, ట్రాన్స్కో అధికారులు పాల్గొన్నారు.
Also Read: Sand Scam: ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుక దందా.. పట్టించుకోని అధికారులు