Etela Rajender: తెలంగాణ రాష్ట్ర బీజేపీలో తలెత్తిన అంతర్యుద్ధం తారా స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన భాజాపా ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం శామీర్ పేట నివాసంలో ఆయన హుజురాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తనకు స్ట్రెయిట్ ఫైట్ తప్ప.. స్ట్రీట్ ఫైట్ రాదని తెగేసి చెప్పారు. బయటకు ఒకటి.. లోపల ఇంకొటి మాటలు మట్లాడటం తనకు రాదని అన్నారు. తను భాజపాలోకి చేరిన తర్వాతే కరీనంగర్ లో బీజేపీకి క్యాడర్ వచ్చిందంటూ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కు పరోక్షంగా చురకలు అంటించారు.
నా ఓటమికి కుట్రలు చేశారు..
హుజురాబాద్ చైతన్యానికి మారు పేరన్న ఈటల రాజేందర్.. బీఆర్ఎస్ నుంచి తనకు తానుగా బయటకు రాలేదని స్పష్టం చేశారు. 2021లో ఆ పార్టీలో నరకం అనుభవించానని పేర్కొన్నారు. తాను పదవుల కోసం పార్టీ మారలేదన్న ఈటల.. కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అవమానాలు, హేళనలు ఉంటాయన్న ఈటల.. అవి తట్టుకొని నిలబడాల్సిన అవసరముందని కార్యకర్తలకు సూచించారు. ప్రజలు మనల్ని ఎప్పటికీ మోసం చేయరని స్పష్టం చేశారు. అయితే గత ఎన్నికల్లో హుజురాబాద్ లో ఓడిపోవడం అస్సలు ఊహించలేదని ఈటల రాజేందర్ అన్నారు. తన ఓటమికి చాలా మంది కుట్రలు చేశారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో తన అడుగు పడని గ్రామం లేదన్న ఈటల.. తాను చేసిన పోరాటాలకు కరీంనగర్ ప్రజలు అండగా నిలిచారని ఈటల అన్నారు.
శత్రువుతో నేరుగా కొట్లాడుతా
తనపై కుట్రలు చేస్తున్న సొంత పార్టీ నేతలకు ఈటల పరోక్షంగా చురకలు అంటించారు. శత్రువుతో తాను నేరు కొట్లాడతానని.. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడం తనకు రాదని వ్యాఖ్యానించారు. తన చరిత్ర ఎంటో ప్రజలకు తెలుసున్న ఈటల.. ధీరుడు వెనుదిరగడంటూ క్యాడర్ లో ఉత్తేజాన్ని నింపారు. ఎంతవరకు ఓపిక పట్టాలో తనకు తెలుసన్న ఈటల.. పదవులే పరమావదిగా భావించే వ్యక్తిని తాను కాదని స్పష్టం చేశారు. ఏ పార్టీలో పనిచేస్తే ఆ పార్టీకి అంకిత భావంతో సేవ అందిస్తానని.. తన అనుభవం వాడుకుంటే అది పార్టీకే మేలు చేస్తుందని అన్నారు. అంతేకాదు వ్యక్తులు ఎదగకుండా ఏ పార్టీ బలపడలేదని పరోక్షంగా బీజేపీ పెద్దలకు చురకలు అంటించారు. కార్యకర్తల ఆవేదనను తను అర్థం చేసుకోలనన్న ఈటల.. వాళ్ల రాజకీయ అవసరాలు తీర్చలేనంత నిస్సహాయ స్థితిలో తాను లేనని స్పష్టం చేశారు.
Also Read: Mohan Lal: చేతికి గాజులు.. మెడలో ఆడవారి హారం.. మోహన్లాల్కు ఏమైంది!
ఎవరి దయా దాక్షిణ్యాలు వద్దు!
కొందరు సోషల్ మీడియా వేదికగా తనపై కుట్రలు చేస్తున్నారని.. అబద్దపు పునాదులపై బతుకున్నారని విమర్శించారు. తాను వచ్చాకే కరీంనగర్ లో బీజేపీకి 50వేల మెజారిటీ వచ్చిందన్న ఈటల.. తాను రాకముందు హుజూరాబాద్ లో బీజేపీకి క్యాడరే లేదని పేర్కొన్నారు. హుజురాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనవాళ్లే నిల్చుంటారని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. బీజేపీలో కొత్త, పాత వాళ్లు అన్న భావన లేదని ఈటల అన్నారు. ఉన్న దాంట్లో గుర్తించి మనకి పదవులు ఇస్తారని హుజూరాబాద్ క్యాడర్ ను ఉద్దేశించి ఈటల అన్నారు. అంతేకానీ ఎవరి దయా దాక్షిణ్యాలు తమకు అవసరం లేదని క్యాడర్ కు స్పష్టం చేశారు. ఇక రాజకీయాల్లో కోవర్టులు ప్రతీ పార్టీలో ఉంటారని.. దాని గురించి ఎక్కువగా దిగులు చెందవద్దని ఈటల అన్నారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ లాంటి వాళ్లతోనే తాను కొట్లాడానని గుర్తుచేశారు. తనలాంటి వారు మాట్లాడితే సమాజం రియాక్ట్ అవుతుందని తాను ప్రజల నుంచి వచ్చిన వ్యక్తినని.. వారే తనకు న్యాయ నిర్ణేతలని ఈటల అన్నారు.