తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Enforcement Directorate: గ్యాంగ్ స్టర్ నయీం అక్రమాస్తులపై విచారణ జరుపుతున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దూకుడును పెంచారు. నయీం భార్యతోపాటు మరో 9మంది పేరున ఉన్న ఆస్తులను అటాచ్ చేసేందుకు చర్యలకు శ్రీకారం చుట్టారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ వందల కోట్లలో ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టు పార్టీలో పని చేసి బయటకు వచ్చిన తరువాత గ్యాంగ్ స్టర్ గా మారిన నయీం దాదాపు రెండు దశాబ్ధాలపాటు హైదరాబాద్, నల్గొండతోపాటు బెంగళూరులో రౌడీ రాజ్యాన్ని నడిపించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రైతులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు పలువురిని బెదిరించి వందల ఎకరాలను లాక్కున్నాడు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఆ ఆస్తులను తన భార్య హసీనా బేగంతోపాటు కుటుంబ సభ్యులు, గ్యాంగ్ సభ్యులు, చివరకు తన ఇంట్లో పని చేసిన పనిమనిషి ఫర్హానా పేరన రిజిస్ట్రేషన్లు చేయించాడు. 2016, ఆగస్టులో నయీం షాద్ నగర్ లోని మిలీనియం టౌన్ షిప్ లోని ఓ ఇంట్లో తలదాచుకుని ఉన్నట్టు గుర్తించిన గ్రేహౌండ్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవటానికి వెళ్లారు. అయితే, పోలీసులను చూడగానే నయీం వారిపై కాల్పులు జరిపాడు. దీనికి జవాబుగా గ్రేహౌండ్స్ పోలీసులు కూడా కాల్పులు జరిపారు.
ఈ ఎన్ కౌంటర్ లో నయీం హతమయ్యాడు. ఆ తరువాత అతను చేసిన ఘాతుకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. పలువురు రాజకీయ నాయకులతోపాటు పోలీసు అధికారుల అండతో తన రౌడీ సామ్రాజ్యాన్ని విస్తరించిన నయీం వందల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్నట్టుగా తెలిసింది. దీనిపై దర్యాప్తు జరిపేందుకు అప్పట్లో పోలీసు ఉన్నతాధికారులు సిట్ ఏర్పాటు చేశారు. సిట్ జరిపిన విచారణలో నయీం అతని కుటుంబ సభ్యులు, గ్యాంగ్ సభ్యుల పేర్లపై హైదరాబాద్, నల్గొండ, బెంగళూరు, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాల్లో 4 వేల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులు ఉన్నట్టుగా వెల్లడైంది.
వీటిలో వెయ్యి ఎకరాలకు పైగా భూములు, లక్షా 70వేల చదరపు అడుగుల ఇళ్ల స్థలాలు ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. నయీం అడ్డాల్లో జరిపిన తనిఖీల్లో ఈకోట్ల రూపాయలకు పైగా నగదు, దాదాపు రెండు కిలోల బంగారు నగలు, 280కి పైగా సెల్ ఫోన్లు దొరికాయి. వీటితోపాటు నయీం ఏయే పార్టీల నాయకులు, పోలీసు అధికారులకు ఎంతెంత మొత్తాలు ఇచ్చాడన్న వివరాలు రాసి ఉన్న కొన్ని డైరీలు కూడా లభ్యమయ్యాయి. ఆ సమయంలోనే బోనగిరిలోని క్రిస్టియన్ గొస్పెల్ మిషన్ కార్యదర్శి ఏ.ప్రభాకర్ తనను, తన కూతురిని చంపేస్తానని బెదిరించి నయీం, అతని గ్యాంగ్ సభ్యులు నాలుగు ఆస్తులను లాక్కున్నారని సిట్ కు ఫిర్యాదు చేశారు.
Also Read: Sama Rammohan:హెచ్ సీయూ రగడ.. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ సరికొత్త సవాల్!
వీటిని తన కుటుంబ సభ్యులైన అహెలా బేగం, ఫిర్దౌజ్ బేగం, సయ్యద్ నిలోఫర్, అనుచరుడైన పాశం శ్రీనివాస్ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించాడని తెలిపారు. అప్పట్లోనే ఈ ఆస్తుల విలువ 82లక్షల రూపాయలని పేర్కొంటూ తనకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని తెలియచేశారు. అదే సమయంలో వందల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్న నయీం, అతని కుటుంబ సభ్యులు ఆదాయపు పన్ను శాఖకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించలేదని స్పష్టమైంది.
ఈ క్రమంలో సిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, ఆదాయపు పన్ను శాఖ అందించిన వివరాల ఆధారంగా ఈడీ అధికారులు 2022లో నయీం, అతని బినామీలపై ఈసీఐఆర్ జారీ చేసి విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో దూకుడును పెంచిన ఈడీ అధికారులు తాజాగా నయీం భార్య హసీనాబేగం, కుటుంబ సభ్యులు మహ్మద్ తాహేరా బేగం, మహ్మద్ సలీమా బేగం, మహ్మద్ అబ్దుల్ సలీం, అహెలా బేగం, సయ్యద్ నిలోఫర్, ఫిర్దౌజ్ అంజుం, మహ్మద్ ఆరిఫ్, హీనా కౌసర్ పేర్ల మీద ఉన్న 35 ఆస్తులను గుర్తించారు. ఈ ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన వివరాలను అంద చేయాలంటూ అందరికీ నోటీసులు జారీ చేశారు. అయితే, ఏ ఒక్కరు కూడా నోటీసులకు స్పందించ లేదు.
దాంతో ఈ ఆస్తులను ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ యాక్ట్ ప్రకారం బినామీ ఆస్తులుగా ప్రకటించారు. ఈ ఆస్తులన్నింటినీ అటాచ్ చేసేందుకు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈడీ కేసుల ప్రత్యేక కోర్టులో ఆస్తులను జప్తు చేసేందుకుగాను ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేయాలని నిర్ణయించారు. దీనిపై ఈడీకి చెందిన ఓ అధికారితో మాట్లాడగా జప్తు ప్రక్రియ త్వరలోనే ముగియనుందని చెప్పారు.
నయీం కూడబెట్టుకున్న వందల కోట్ల రూపాయల ఆస్తుల వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఇప్పటికే దర్యాప్తులో వెల్లదైందన్నారు. ఇంతకు ముందే కొన్ని ఆస్తులను అటాచ్ చేసినట్టు చెప్పారు. తాజాగా మరో 35 ఆస్తులను జప్తు చేస్తున్నట్టు తెలిపారు. ముందు ముందు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/