Drug Racket: దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ డ్రగ్స్ దందా (Drug Racket) చేస్తున్న నైజీరియన్ల ఆయువుపట్టుపై ఈగల్ టీం అధికారులు దెబ్బ కొట్టారు. మాదక ద్రవ్యాల విక్రయాల ద్వారా ఈ నైజీరియన్లు కొల్లగొడుతున్న కోట్లాది రూపాయలను ఆయా దేశాలకు హవాలా రూపంలో పంపిస్తున్న నెట్ వర్క్ ను విచ్ఛిన్నం చేశారు. ఈ క్రమంలో హవాలా రాకెట్ లోని ఓ కింగ్ పిన్ ను అరెస్ట్ చేశారు. అతని నుంచి 3 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈగల్ టీం డీసీపీ సీతారాం తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అయిదు నెలల క్రితం గోవాలో స్పెషల్ ఆపరేషన్ జరిపిన ఈగల్ టీం అధికారులు డ్రగ్స్ దందా చేస్తున్న మ్యాక్స్ వెల్ అనే నైజీరియన్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Also Read: Shivadher Reddy: ఇలా ఉండండి.. రాష్ట్ర పోలీసులకు కొత్త డీజీపీ శివధర్ రెడ్డి మార్గనిర్దేశనం
అతన్ని విచారించినపుడు డ్రగ్స్ దందాలో వస్తున్న డబ్బును నైజీరియన్లు హవాలా రూపంలో తమ తమ స్వస్థలాలకు పంపిస్తున్నట్టుగా వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఇన్స్ పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ జీవన్ రెడ్డి, ఏఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ శ్రీసంతోష్ తో కలిసి మనీ లాండరింగ్ నెట్ వర్క్ పై దృష్టి సారించారు. ఈ క్రమంలో ముంబయిలోని కల్బాదేవి ప్రాంతంలోని ఫూల్ గల్లీలో నడుస్తున్న భరత్ కుమార్ ఛగన్ లాల్ అండ్ కంపెనీ ద్వారా నైజీరియన్లు ఎక్కువగా మనీ లాండరింగ్ వ్యవహారాలు నడిపిస్తున్నట్టు వెల్లడైంది. దాంతో సదరు కంపెనీపై ఈగల్ టీం అధికారులు కొన్ని రోజుల క్రితం దాడి జరిపారు. ఆ సమయంలో కంపెనీని నడిపిస్తున్న దర్గారాం రాటాజీ ప్రజాపతి తప్పించుకుని పారిపోయాడు. అప్పటి నుంచి తరచూ వేర్వేరు ప్రాంతాలకు వెళుతూ దొరకకుండా తిరుగుతున్నాడు.
3కోట్ల రూపాయల నగదును స్వాధీనం
అదే సమయంలో అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఫోన్ కాల్స్ వివరాలు, వాట్సాప్ చాటింగ్ మెసెజీలను చెరిపి వేశారు. తన ఫోన్ నెంబర్లను కూడా మార్చుకుని పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినా, పట్టువదలకుండా ఈగల్ టీం అధికారులు అతని కోసం వేటను కొనసాగిస్తూ వచ్చారు. చివరకు శుక్రవారం ప్రజాపతిని అరెస్ట్ చేశారు. అతను నడుపుతున్న కంపెనీ నుంచి 3కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మనీ లాండరింగ్ లో తనకు చేతన్ సింగ్, రోనక్ ప్రజాపతి, చేతన్ మావ్జీలు సహకరించే వారని ప్రజాపతి వెల్లడించాడు. అహమదాబాద్ రాష్ట్రం రత్నాపూర్ లోని జవేరీ ఛాంబర్స్, న్యూ ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతాల్లో మరో రెండు హవాలా సంస్థలు నడిపిస్తున్నట్టుగా చెప్పాడు. వీటి నిర్వహణను దేవ్ జీ దిలీప్, ముఖేశ్ లు చూసుకునే వారని తెలియచేశాడు.
ఉత్పత్తుల రూపంలో
దేశవ్యాప్తంగా నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్ల నుంచి గోవాకు చెందిన ఉత్తమ్ సింగ్ ఎలియాస్ జశ్వంత్, ఖీమా రామ్ ఎలియాస్ రాజు ఎలియాస్ రాజ్ లక్ష్మిలు డబ్బు కలెక్ట్ చేసేవారని ఈగల్ అధికారుల దర్యాప్తులో తేలింది. ఇలా కలెక్ట్ చేసిన డబ్బును నైజీరియాకే చెందిన సన్నీ పాస్కల్ సూచనల మేరకు చేతన్ మావ్జీ హవాలా రూపంలో నైజీరియన్ దేశాలకు తరలించేవాడని వెల్లడైంది. ప్రధానంగా దుస్తులు, తల వెంట్రుకలు, ఇతర ఉత్పత్తుల రూపంలో ముంబయిలోని పైడోనీ, మాండ్వీ ప్రాంతాల్లోని కార్గో సంస్థల నుంచి నైజీరియన్ దేశాలకు పంపించే వారని తేలింది.
వెంటనే 1908 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి
వీటికి సంబంధించిన డబ్బును ఉత్తమ్ సింగ్, చేతన్ సింగ్ లు భరత్ కుమార్ ఛగన్ లాల్ అండ్ కంపెనీలో జమ చేసేవారని నిర్ధారణ అయింది. హవాలా డ్రగ్ మనీ రాకెట్ కేసులో ఇప్పటివరకు 25మందిని అరెస్ట్ చేసినట్టు డీసీపీ సీతారాం తెలిపారు. ఇక, డ్రగ్స్ దందా గురించి తెలిసిన వారు వెంటనే 1908 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. దాంతోపాటు 87126 71111 నెంబర్ కు వాట్సాప్ కూడా చేయవచ్చన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచటంతోపాటు తగు రివార్డులు ఇస్తామన్నారు. పరారీలో ఉన్న ప్రజాపతిని అరెస్ట్ చేసిన టీంను అభినందించారు.
Also Read: Drug Racket: భారీ డ్రగ్ రాకెట్ బయటపెట్టిన హైదరాబాద్ పోలీసులు.. వామ్మో ఇంత విలువైనవా?
