MLAs Defection: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు గడువు కోరిన స్పీకర్
రెండు నెలల సమయం కావాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి
నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తి
మరో ఆరుగురు ఎమ్మెల్యేలు విచారణ పెండింగ్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణకు (MLAs Defection) గడువు కావాలని శాసనసభ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును కోరింది. సుప్రీంకోర్టు ఇచ్చిన 3 నెలల గడువు అక్టోబర్ 30తో ముగిసింది. దీంతో మరో 2 నెలల సమయం కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కార్యాలయం అత్యున్నత న్యాయస్థానాన్ని శుక్రవారం కోరింది. నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయిందని వివరించింది. దీంతో, కోర్టు గడువు ఇస్తుందా? లేదా అనేదానిపై ఆసక్తి నెలకొంది.
ఆగస్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన అసెంబ్లీ స్పీకర్ సెప్టెంబర్ 29 నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభించారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, గూడెం మహిపాల్రెడ్డి, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్రెడ్డిని బీఆర్ఎస్ న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డిలను కూడా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
అయితే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిరాయింపులకు సంబంధించి మౌఖిక, లిఖిత పూర్వక వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరారు. అయితే అక్టోబర్ 4 వరకు ఇరు పక్షాల ఎమ్మెల్యేల వాదనలను స్పీకర్ విన్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) సదస్సులో పాల్గొనేందుకు ఉత్తర అమెరికా ఖండంలోని బార్బడోస్కు 18 రోజుల పర్యటకు వెళ్లారు. విదేశీ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మౌఖిక వాదనలు వినిపించేందుకు అక్టోబర్ 24కు వాయిదా వేశారు. విదేశీ పర్యటన తర్వాత విచారణ చేపట్టారు. తీర్పును మాత్రం ఇంకా వెల్లడించలేదు.
Read Als0 – Hydra: రూ. 30 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
పది మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటుండగా వీరిలో కేవలం నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ షెడ్యూలు మాత్రమే స్పీకర్ గతంలో ప్రకటించారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్రెడ్డి, తెల్లం వెంకటరావుపై బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్లపై విచారణ చేపట్టాల్సి ఉంది. కోర్టు విధించిన అక్టోబర్ 30 గడువు ముగిసింది. మరోవైపు స్పీకర్ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ వరకు ఇప్పటి వరకు స్పందించలేదని సమాచారం. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్కు తమ వివరణ ఇవ్వలేదని సమాచారం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియడంతోనే 6గురు ఎమ్మెల్యేలను విచారణ పూర్తి చేసేందుకు రెండు నెలల గడువు కోరింది. సుప్రీంకోర్టు గడువు ఇస్తే పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్యేలను విచారణను స్పీకర్ చేపట్టనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు నిర్ణయంపైనే మిగిలిన ఎమ్మెల్యే విచారణ ప్రారంభం కానుంది. అందుకు స్పీకర్ సైతం తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.
