Congress Party: స్థానికమే అజెండా.. ఆరు గ్యారెంటీలే ప్రధానాస్త్రం
సర్పంచ్ అభ్యర్థుల విజయానికి పక్కా వ్యూహం
వ్యూహాలను సెలక్ట్ చేయాల్సిందిగా డీసీసీలకు ఆదేశాలు
హమీలు, భరోసాలపై ప్లాన్
తెలంగాణ బ్యూరో,స్వేచ్ఛ: స్థానిక సంస్థల ఎన్నికల సంగ్రామంలో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) తన ప్రచార సరళిని పూర్తిగా మార్చింది. కేవలం రాష్ట్ర స్థాయి అంశాలపైనే ఆధారపడకుండా, నియోజకవర్గాల వారీగా ఉన్న క్షేత్రస్థాయి సమస్యలనే ప్రధాన అజెండాగా మార్చుకుంది. ‘ఆరు గ్యారెంటీ’లనే బ్రహ్మాస్త్రంగా మలుచుకుంటూనే, స్థానిక అంశాలను జోడించి ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. ఈ మేరకు డీసీసీలకు పీసీసీ స్పష్టమైన బాధ్యతలను అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన ప్రచారం కాకుండా, ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో తరహాలో వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. స్థానికంగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ లేదా స్థానికంగా ఉన్న పరిశ్రమల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ప్రచారం సాగనుంది. దీంతో పాటు ఓటరును ప్రభావితం చేసేది గల్లీ సమస్యే అని గుర్తించిన అధిష్టానం, అభ్యర్థులు స్థానిక అంశాలపైనే ఎక్కువ గళం విప్పాలని సూచించింది. ఈ మేరకు ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు, భరోసాలపై ప్లాన్ తయారు చేయాలని పీసీసీ అన్ని జిల్లాలకు సూచించింది.
Read Also- Shobha Shetty VS Divya: ‘చిక్కులు, దిక్కులు, లెక్కలు’ టాస్క్ విజేత ఎవరు? యోధురాలిని దివ్య ఓడించిందా?
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే…
క్షేత్రస్థాయి ఎలక్షన్స్ను లైట్ తీసుకోవద్దని సూచించిన పీసీసీ.. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కష్టపడాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చింది.ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్లను అభ్యర్ధించాల్సిందేనని ముఖ్య నేతలకూ ఆదేశాలిచ్చారు. ఓటర్లకు కేవలం వాగ్దానాలు చేయడమే కాకుండా, వాటిని అమలు చేస్తామనే నమ్మకాన్ని కల్పించడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. నాయకులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి, గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ, భవిష్యత్తు హామీలపై భరోసా ఇస్తున్నారు. ఇక రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రకటించిన ‘ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి తదితర పథకాలు ప్రజల్లోకి వెళ్లాయి. అయితే, వీటి అమలుతో పాటు అదనపు ఆకర్షణగా లోకల్ అస్త్రాలను సిద్ధం చేయాలని పార్టీ ఆదేశించడం గమనార్హం. సంక్షేమ పథకాలతో పేదవర్గాలను ఆకట్టుకోవడం, స్థానిక అభివృద్ధి మంత్రంతో మధ్యతరగతి, యువతను చేరుకోవడం ఈ వ్యూహం ప్రధాన లక్ష్యం.
Read Also- Telangana High Court: సిగాచీ పేలుడు ఘటన.. దర్యాప్తుపై హైకోర్టు అసహనం.. పోలీసులకు చివాట్లు!
అభ్యర్థుల విజయానికి ప్రత్యేక స్ట్రాటజీ…
కాంగ్రెస్ సానుకూల అభ్యర్థులు ఉన్న చోట గెలుపును ఖాయం చేసుకోవడానికి, పోటీ ఎక్కువగా ఉన్న చోట పట్టు సాధించడానికి ప్రత్యేక వ్యూహరచన చేస్తున్నారు. నియోజకవర్గంలోని గ్రామ పంచాయితీల్లో సామాజిక వర్గాల వారీగా ఓట్లను సమీకరించడం, కుల సంఘాలు, యువజన సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని టార్గెట్ పెట్టుకున్నారు. దీంతో పాటు టికెట్ దక్కని ఆశావహులు రెబల్స్ గా మారకుండా, వారికి భవిష్యత్తులో పదవులపై హామీ ఇస్తూ కలుపుకుపోవాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దీంతో పాటు స్థానిక పరిస్థితులపై ఎప్పటికప్పుడు రిపోర్టు పంపాలని అన్ని జిల్లాల డీసీసీలకు గాంధీభవన్ నుంచి ఆదేశాలు వెళ్లాయి.

