Kodanda Reddy: మళ్లీ రైతుల చేతులకి విత్తనం రావాలని, రైతులు ప్రకృతి సాగు వైపు దృష్టిపెట్టాలని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి కోరారు. అల్మాస్ పల్లి గ్రామంలో నిర్వహించిన విత్తనాల పండుగ ఆదివారం ముగిసింది. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా లోని రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా ఈ విత్తనాల పండుగలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతు కమిషన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. విత్తనం రైతు ప్రాథమిక హక్కుని, కానీ గత మూడు దశాబ్దాలుగా అది మల్టీ నేషనల్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిందన్నారు. ఫలితంగానే రైతు ఆత్మహత్యలు మొదలయ్యాని గుర్తుచేశారు. విత్తనం రైతు హక్కు అనేది నినాదం కాదని, అది రైతు జీవన విధానానికి మార్గదర్శకమన్నారు.
ఒకప్పుడు రైతు తాను పండించిన పంటలో నుంచే విత్తనం పెంచుకొని భద్రపరిచి మళ్లీ వచ్చే పంటకు వాడుకునే వాడని, అంతటి ప్రాధాన్యత ఉన్న విత్తనం నేడు క్రమంగా రైతు చేతిలో నుంచి బయటకు పోయిందన్నారు. విత్తనం రైతు చేతుల్లో లేకపోతే దేశానికి ఆహార భద్రతే లేకుండా పోవచ్చన్నారు. కమిషన్ సభ్యుడు కేబీఎన్ రెడ్డి మాట్లాడుతూ ఇక భూసారం తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతు పై ఉందన్నారు.
Also read: KRMB: కృష్ణా జలాల వాటాపై సర్కార్ సీరియస్.. నేనున్నాను అంటున్న మంత్రి ఉత్తమ్..
పెస్టిసైడ్ చల్లడం తగ్గించి, సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మళ్లాలన్నారు. భూసారం తగ్గడం వల్ల పంట దిగుబడి పడిపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని గుర్తు చేశారు. మన పూర్వికులు చేసిన పద్ధతుల్లో మళ్లీ పంటల సాగు చేయాలనీ సూచించారు. పురుగుమందులు ఎరువుల వాడకం తగ్గిస్తే మంచిదని సూచించారు.