CM Revanth in Japan: జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆ దేశంలోని భారత రాయబారి షిబూ జార్జితో బుధవారం భేటీ అయ్యారు. వారం రోజుల టూర్లో భాగంగా తెలంగాణ, జపాన్లోని వివిధ నగరాల మధ్య ఉన్న సంబంధాలను, అక్కడి తెలంగాణ ప్రవాసుల అంశాన్ని పరస్పరం చర్చించుకున్నారు. దాదాపు వందేళ్ళుగా అక్కడ వినియోగంలో ఉన్న ఇండియా హౌజ్ను సందర్శించారు. తెలంగాణ ప్రతినిధి బృందానికి భారత రాయబారి విందు ఇచ్చారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్బాబు, అధికారులు, ప్రతినిధులు ఉన్నారు. అక్కడ పర్యటిస్తున్న తమిళనాడుకు చెందిన డీఎంకే ప్రతినిధి బృందం (ఎంపీలు కనిమొళి, నెపోలియన్) కూడా తెలంగాణ టీమ్తో భేటీ అయ్యారు. వివిధ కంపెనీలతో పెట్టుబడుల విషయమై చర్చించనున్న సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం రాబోయే రెండు రోజుల్లో సోనీ, టొషీబా, మజ్దా, టొయోటా తదితర కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నది.
ఇండియన్ జస్టిస్ రిపోర్టు (2025)లో తెలంగాణ పోలీసింగ్ భేషుగా ఉందని కితాబు ఇవ్వడంతో పాటు అన్ని రాష్ట్రాలకంటే ఉత్తమంగా ఉందని, అందువల్లనే తొలి స్థానం సంపాదించిందని వెల్లడించడంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. రాష్ట్ర పోలీసులను అభినందించారు. రాష్ట్ర హోంశాఖ బాధ్యతలను కూడా ముఖ్యమంత్రే చూస్తున్నారు. “తెలంగాణ పోలీసులారా.. మీ కర్తవ్యదీక్షతో తెలంగాణ కీర్తి పతాకను రెపరెపలాడించినందుకు యావత్ రాష్ట్ర ప్రజల తరుపున మీకు ధన్యవాదాలు, అభినందనలు… తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నంబర్ వన్ అనిపించుకోవడం తెలంగాణ పౌరులందరికీ గర్వకారణం.
Also read: Good News To Students: విద్యార్థులకు ఈ న్యూస్ తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు.. అదేంటంటే?
శాంతిభద్రతల పరిరక్షణలో భవిష్యత్లోనూ ఇదే అంకితభావాన్ని కొనసాగించండి.. మీ భవిష్యత్ సంక్షేమాన్ని మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది.. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్తో సరికొత్త పోలీస్ సంక్షేమానికి శ్రీకారం చుట్టాం.. వృత్తిలో మీరు చూపిన నిబద్ధతలాగే మీ సంక్షేమం పట్ల ప్రభుత్వం సైతం అంతే నిబద్ధతతో ఉంటుందని మాటిస్తున్నాను..” అని ట్వీట్ ద్వారా భరోసా కల్పించారు.