Cherlapally Drug Case: ఒక్క మహారాష్ట్రకే 100 కిలోలకు పైగా రవాణా
గురుగ్రామ్ నుంచి ముడిసరుకులు
రెండో రోజూ ఫ్యాక్టరీలో మహారాష్ట్ర పోలీసుల తనిఖీలు
మెఫెడ్రోన్ ముడిసరుకు సీజ్.. మహారాష్ట్రకు తరలింపు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: చర్లపల్లి డ్రగ్ కేసులో (Cherlapally Drug Case) సంచలన వివరాలు వెలుగు చూస్తున్నాయి. గురుగ్రామ్ నుంచి ముడిసరుకు తెప్పించుకుంటూ గుట్టు చప్పుడు కాకుండా ఫ్యాక్టరీలో మెఫెడ్రోన్ను తయారు చేస్తూ వచ్చిన గ్యాంగ్, తమ నెట్ వర్క్ ద్వారా ఒక్క మహారాష్ట్రకే ఏకంగా 100 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది. దేశంలోని మరికొన్ని రాష్ట్రాలకు కూడా ఈ ముఠా మాదక ద్రవ్యాలు సప్లయ్ చేసినట్టుగా ఇప్పటికే నిర్ధారణ అయిన నేపథ్యంలో ఈ లెక్క అంతా తేలిస్తే మార్కెట్లోకి వెళ్లిన డ్రగ్ టన్నుల్లో ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, ఆదివారం కూడా ఫ్యాక్టరీలో తనిఖీలు నిర్వహించిన మహారాష్ట్ర పోలీసులు సీజ్ చేసిన ముడిసరుకు, డ్రగ్ను లారీలో మహారాష్ట్రకు తరలించారు.
చర్లపల్లి నవోదయ కాలనీలో వాగ్దేవి ల్యాబ్స్ పేరిట ఫ్యాక్టరీ ప్రారంభించిన శ్రీను విజయ్ వోలేటి, తన సహచరుడైన తానాజీ పండరీనాథ్ పట్వారితో కలిసి నిషేధిత మెఫెడ్రోన్ డ్రగ్ను తయారు చేస్తూ వచ్చాడు. దీనికి అవసరమైన ముడి సరుకులను హర్యానాలోని గురుగ్రామ్లో ఉన్న కిమియా బయో సైన్స్ నుంచి తెప్పించుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు దినసరి కూలీలతో పని చేయించుకుంటూ మెఫెడ్రోన్ ఉత్పత్తి చేశాడు. ఇక, పెడ్లర్లతో పకడ్భంధీ నెట్ వర్క్ ఏర్పాటు చేసి దేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు సప్లయ్ చేస్తూ వచ్చాడు. కాగా, పెడ్లర్ నెట్వర్క్లో ఉన్న బంగ్లాదేశీ మహిళ ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్ల (23)తోపాటు మరో 9 మంది మీరా భయందర్ వసాయ్ విరార్ కమిషనరేట్ క్రైమ్ డిటెక్షన్ యూనిట్ సిబ్బందికి పట్టుబడటంతో ఈ డ్రగ్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. రెండు రోజుల క్రితం చర్లపల్లి నవోదయ కాలనీలోని వాగ్దేవి ల్యాబ్స్పై దాడి జరిపిన మహారాష్ట్ర పోలీసులు శ్రీను విజయ్ వోలేటితోపాటు తానాజీ పండరీనాథ్ పట్వారిని కూడా అరెస్ట్ చేశారు.
Read Also- Ganesh Immersion: వెరీ గుడ్ ఆఫీసర్స్, స్టాఫ్.. సీఎం రేవంత్ అభినందనలు.. ఎందుకంటే?
ఒక్క మహారాష్ట్రకే…
కొన్ని నెలలుగా మెఫెడ్రోన్ డ్రగ్ తయారు చేస్తున్న శ్రీను విజయ్ వోలేటి, తానాజీ పండరీనాథ్ పట్వారిలు ఇప్పటివరకు ఒక్క మహారాష్ట్రకే 100 కిలోలకు పైగా డ్రగ్ ను సరఫరా చేసినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. చేస్తున్న గలీజ్ దందా బయట పడకుండా ఉండేందుకు ఈ ఇద్దరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. పర్మినెంట్ ఉద్యోగులను పెట్టుకుంటే మాదక ద్రవ్యాల తయారీ వ్యవహారం బయట పడుతుందన్న ఉద్దేశ్యంతో రోజు కూలీకి పని చేసే వారిని పనిలో పెట్టుకుంటూ వ్యవహారం నడిపించినట్టుగా తెలిసింది. వీరిని కూడా తరచూ మారుస్తూ వచ్చారని సమాచారం.
పకడ్భంధీ నెట్ వర్క్…
మెఫెడ్రోన్ ను ఉత్పత్తి చేయటమే కాకుండా శ్రీను విజయ్ వోలేటి, తానాజీ పండరీనాథ్ పట్వారిలు పకడ్భంధీ పెడ్లర్ల నెట్ వర్క్ ను కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. మన రాష్ట్రానికి చెందిన వారితోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్ లకు చెందిన వారు ఈ నెట్ వర్క్ లో ఉన్నట్టు సమాచారం. వీళ్లు చర్లపల్లి నవోదయ కాలనీ ఫ్యాక్టరీ నుంచి డ్రగ్ కొని రైలు, బస్సు మార్గాల ద్వారా దానిని వేర్వేరు రాష్ట్రాలకు తీసుకెళ్లే వారని తెలియవచ్చింది. కొన్నిసార్లు కార్లలో కూడా మాదక ద్రవ్యాలను తరలించినట్టుగా సమాచారం.
Read Also- Bandla Ganesh: దున్నేయ్.. ఇక టాలీవుడ్ నీదే.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి బండ్ల బూస్ట్!
మెట్రోపాలిటన్ సిటీలకు…
ఈ గ్యాంగ్ మెఫెడ్రోన్ డ్రగ్ను ప్రధానంగా దేశంలోని మెట్రోపాలిటన్ సిటీలకు సరఫరా చేస్తూ వచ్చారని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. హైదరాబాద్తో పాటు ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నైతోపాటు వేర్వేరు ప్రాంతాలకు సరఫరా చేసినట్టు సమాచారం. ఇక, యువకులు, ఐటీ ఉద్యోగులకు పెడ్లర్లు ఎక్కువగా ఈ డ్రగ్ అమ్మినట్టుగా తెలిసింది.
అంతా లెక్క తేలిస్తే…
శ్రీను విజయ్ వోలేటి, తానాజీ పండరీనాథ్ పట్వారిలు దేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు మెఫెడ్రోన్ డ్రగ్ను సప్లయ్ చేసినట్టుగా ఇప్పటికే మహారాష్ట్ర పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యింది. దందా మొదలు పెట్టిన తరువాత ఒక్క మహారాష్ట్రకే ఈ గ్యాంగ్ 100 కిలోలకు పైగా డ్రగ్ ను సరఫరా చేసినట్టుగా దర్యాప్తులో వెల్లడైందని తెలిసింది. అంతర్జాతీయ మార్కెట్లో మెఫెడ్రోన్ ధర కిలోకు 1.20కోట్లు ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాన్ని సరఫరా చేసినట్టు వెల్లడైన నేపథ్యంలో మొత్తం లెక్క తేలిస్తే సప్లయ్ అయిన మెఫెడ్రోన్ టన్నుల్లో ఉండవచ్చన్నారు. ఈ లెక్కన ఎన్ని వందల కోట్ల వ్యాపారం జరిగిందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. హైదరాబాద్ వచ్చిన మహారాష్ట్ర పోలీసులు ఈ కేసులో విచారణను కొనసాగిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ముందు ముందు ఈ కేసులో మరిన్ని సంచలన వివరాలు వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.