Jubilee Hills Bypoll: తెలుగు రాష్ట్రాల ప్రజానీకం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills Bypoll) ప్రక్రియలో ఆదివారం కీలకమైన ప్రచారపర్వం ముగిసింది. సుమారు నెల రోజులపాటు హోరాహోరీగా సాగిన ప్రచారం సాయంత్రం ఆగిపోయింది. అన్ని పార్టీల మైక్లు మూగబోయాయి. సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులు అందరూ నియోజకవర్గాన్ని వీడి వెళ్లాలని ఎలక్షన్ కమిషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, నియోజకవర్గ పరిధిలోని వైన్స్ షాపులు, పబ్బులు మూసివేయాలని స్పష్టం చేశారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా ప్రచారం జరిగింది. ప్రచార శైలిని బట్టి రసవత్తరమైన త్రిముఖ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. నవంబర్ 11న ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలుకానుంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇక, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
Read Also- Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్లో మంత్రులపై మనీ ప్రెజర్.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ మంత్రి
మొత్తం 55 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్రెడ్డి ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. నవీన్ యాదవ్కు ఎంఐఎం పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. ఉపఎన్నికే అయినప్పటికీ ప్రచారంలో అగ్రనాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తరపును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనేకమంది మంత్రులు నియోజకవర్గ స్థాయిలో మోహరించి, ప్రచారం చేశారు. బీఆర్ఎస్ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు మాజీ మంత్రులు ప్రచారం నిర్వహించారు. ఇక, బీజేపీ తరపున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ వంటి బీజేపీ జాతీయ నేతలు కూడా కూడా పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులు కూడా చాలామంది ప్రచారంలో పాల్గొన్నారు.
Read Also- Honda Elevate 2025: హోండా నుంచి కొత్త సర్ప్రైజ్.. ఎలివేట్ ADV ఎడిషన్ లాంచ్
